Friday 15 January 2016

నిశ్శబ్దం బద్దలైంది!!! ( రోమిలా థాపర్ ఇంటర్వ్యూ)






రోమిలా థాపర్ ఢిల్లీలోని జవహర్ లాల్ యూనివర్సిటీ చరిత్ర విభాగంలో గౌరవ అధ్యాపకురాలు. ఆమె బ్రిటిష్ అకాడమీలో పరిశోధకురాలు కూడా. 2008లో ఆమె అమెరికా గ్రంధాలయ సంస్థ నుండి ప్రతిష్టాపకమైన క్లుగే బహుమతి యిచ్చారు. నోబెల్ అవార్డు పరిగణలోకి తీసుకోని చరిత్ర లాంటి అంశాలలో అమెరికా గ్రంధాలయ సంస్థ  జీవిత సాఫల్యత అవార్డును యిచ్చి ఆమెను గౌరవించింది.


http://www.ndtv.com/video/player/the-buck-stops-here/violent-fringe-groups-are-terrorists-call-them-that-romila-thapar-to-ndtv/386987?hp&video-featured
రొమిలా థాపర్ ఎన్డిటివీకి యిచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్య అంశాలు. _______________________________________________                                                
పరిచయ కర్త : మీ పుస్తకంలో ఒక చోట... గొంతుకలు వినిపించాల్సిన సమయాల్లో- నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అని  ఉంది. మీరింత నిరాశగా   ఉన్నారా? బుద్దిజీవులు ఆగ్రహం చూపించడంలో విఫలమయ్యారని మీ ఉద్దేశ్యమా?
రోమిలా: ఈ పుస్తకం(ది పబ్లిక్ ఇంటలెక్చువల్ ఇన్ ఇండియా) నిరుడు రాసినది, అప్పుడు ఈ ‘నిశ్శబ్దం’ మరింత చిక్కగా ఉండేది. ఐతే గత కొద్ది వారాలుగా సాగుతున్న విషయాలు ఆశాజనకంగా ఉన్నాయి. నిశ్శబ్దం బద్దలైందని మాత్రం రూడి గా చెప్పవచ్చు. 
మేధావుల కొరత మనకు  ఏనాడూ లేదు, కానీ ‘వాసిని మార్చేటంత శక్తి గల రాశి’ అనదగ్గ  క్రిటికల్ మాస్ గా వారు రూపొందాలి. అలా వారు సామూహికంగా వ్యక్తీకరించుకునెందుకు తగిన వేదిక మాత్రం ఉండడం లేదు. ఆలోటు తీరే దిశగా అడుగులు పడుతున్నాయని భావిస్తున్నాను.
ప.క: ఈ రచయితలు సాహిత్య అకాడెమీ అన్న సంస్థను వ్యతిరేకిస్తున్నారు కానీ ప్రభుత్వాన్ని కాదని కొంతమంది అభిప్రాయం. మీరేమంటారు?
రో:  సాహిత్య అకాడెమి ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా మారాలనే అభిలాష చాలా మందికి ఉంది. అది ఒక్కటే కాదు, చారిత్ర్రక పరిశోధనా సంస్థ, సాంఘిక శాస్త్ర పరిశోధనా సంస్థ, ఐఐటిలు, ఐఐఎంలు .. ఇలాంటి కీలకమైన సంస్థలు స్వయం పాలనాధికారంతో ఉండాలని పదేళ్ళక్రితమే మేమంతా గట్టిగా వాదించాం. కానీ ఏమీ జరగలేదు. అవి ఈనాటికీ ప్రభుత్వం చెప్పుచేతల్లోనే ఉన్నాయి. కనుక సాహిత్య అకాడెమి నిర్ణయాలను నిరసించడమంటే, ప్రభుత్వ ధోరణులను వ్యతిరేకించడమే అనడంలో సందేహం లేదు. 
ప.క: భావప్రకటనా స్వేచ్చ అందరితో పాటూ రచయితలకూ ఉంది కానీ, పురస్కారం వెనక్కివ్వడమంటే భారత రాజ్యాన్నిఅగౌరవపరచడం అని కొంతమంది అంటున్నారు. ఈరచయితల చర్యను రాజ్య ధిక్కారం కింద పరిగణించే వారికి  మీరేం చెప్తారు?
రో: అది సరి కాదు, ప్రభుత్వమూ. రాజ్యం ఒకటే అనుకోడం తప్పు. ఈ రచయితలూ నిర్వహిస్తున్నది- సమాజంలోని పరిస్థితులపై ఆందోళన తప్ప రాజ్య ధిక్కారం ఎంతమాత్రమూ కాదు. ఒక మంచి ప్రభుత్వ పాలన ఇటువంటి దుస్థితిని నివారించి ఉండేది అనే విషయం మనం గ్రహించాలి.
ప.క: విద్యా సంస్థలనుండీ, తోటి విద్యావేత్తల పురస్కారాలు తప్ప స్వీకరించనని మీరు నిర్ణయించుకున్నారు, రెండు సార్లు పద్మ పురస్కారాలను కూడా నిరాకరించారు. మరి మీ దృష్టిలో అవార్డుల తిరస్కారం దేనికి సంకేతం?
 పద్మ పురస్కారాలతో సహా ఈ అవార్డులన్నీ పేరుకు మాత్రమే రాజ్య పురస్కారాలు, ఆచరణ లో వీటిని మనం ప్రభుత్వ గుర్తింపుల కింద మార్చేసాం. ఉదాహరణకు నాలాటి వారికి  బిజేపీ ప్రభుత్వమూ పద్మ పురస్కారం ఇవ్వబోదని మనం ఖచ్చితంగా ఊహించవచ్చు. రాజ్యమూ, ప్రభుత్వమూ – వీటి మధ్య విభజన మన సమాజం పాటించడం లేదు అన్న విషయం స్పష్టం గా తెలుస్తోంది కదా. 
ప.క: ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకదిశలో ఒక ప్రశ్నవేస్తాను. ప్రజల మీద అమితమైన ప్రభావం చూపే సోషల్ మీడియా వంటి అంశాలు ఈనాడు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. మరి ఈ నేపధ్యంలో ‘పబ్లిక్ ఇంటలేక్చువల్’ కు అసలు మనం ఎంత పాటి ప్రాధాన్యత నీయవచ్చు?
రో: పబ్లిక్ ఇంటలేక్చువల్’ (ప్రజా మేధావి) అని ఎవరిని అంటాం అంటే ....
మొదటి అర్హత  ...తానెన్నుకున్నరంగంలో నిష్ణాతుడై, తోటివారి గౌరవాన్ని  పొందుతున్నవాడు, ఆ కారణం చేత జరుగుతున్న విషయాలపై తన అభిప్రాయాలనుసాధికారంగా నిరూపించ గలిగినవాడు. రెండవది మానవహక్కుల పట్లా, సాంఘిక న్యాయం పట్లా నిబద్ధత కలిగిన వ్యక్తి. పై రెండు లక్షణాలూ కలిగిన బుద్దిజీవినే నేనుపబ్లిక్ ఇంటలేక్చువల్’ అని అంటున్నాను. అతను వర్తమాన విషయాలను అర్ధం చేసుకుని, సామాన్యుడికి అర్ధం అయ్యేలా వివరిస్తాడు.
ఇప్పుడు ‘బీఫ్ తినడం’ అనే ఒక్క అంశం .. సాంఘికపరమైన, కులపరమైన అనేక చిన్న చిన్న అంశాల సమాహారం. బీఫ్ ఎగుమతి, మాంసం కొట్టే పని, తోలు పనీ అలా ఎన్నో జీవనోపాధులు దానిలో ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నదేమిటంటే, ప్రతీ ఒక్క విషయాన్నీ రాజకీయపు నిర్ణయంగానే, రాజకీయ పార్టీల కోణం నుండి మాత్రమే  మనం చూడడానికి అలవాటు పడిపోతున్నాం. వేరే కోణాలూ, పార్శాలు కూడా ఉంటాయని తెలియజెప్పి, వాటిని ప్రజలకు పరిచయం చేసే అవసరం చాలా ఉంది. ఆ పనినే  ‘పబ్లిక్ ఇంటలేక్చువల్’ చెయ్యాలని నేను భావిస్తున్నాను.
ప.క: కానీ మీరనే రాజకీయపు ‘రొద’ లో పబ్లిక్ ఇంటలేక్చువల్’ చెప్పే వాస్తవాలు ఎవరికి వినిపిస్తాయి? గోవధా, గోమాంస భక్షణ రెండూ మన ప్రాచీన చరిత్రలో ఉన్నాయని, ఇంతక్రితం కూడా కొంతమంది చరిత్రపరిశోధకులు తమ  ఇంటర్వ్యూ లలో చెప్పారు. కానీ ఆ మాటను బీజేపియే కాదు, మరే పార్టీ కూడా చెవిన పెట్టదు. బీఫ్ మీద బాన్ ను మొదట మేమే ప్రతిపాదిం చాం అని దిగ్విజయ్ సింగ్ సగర్వంగా ప్రకటిస్తున్నాడు కదా?

రో: మీ మీడియా వారు రాజకీయ పక్షాల నడిగాం అంటున్నారు సరే, మరి సామాన్య పౌరుడిని అదే ప్రశ్న అడిగారా? బీఫ్ తినడం గురించి అతనేమనుకుంటున్నాడో వరసగా  ప్రోగ్రాములు మీడియా ప్రసారం చేసిందా?
 ప్రభుత్వ స్థాయిలో ఒక బాన్ అమలు జరిగిందీ అంటే వివిధ దిశల్లో దానికి అనుసంధానమై వచ్చే పర్యవసానాల జాబితా చాలా విస్తృతంగా ఉంటుంది. ఆ బాన్ తాకిడికి గురయ్యేది ఎవరెవరని పరిశీలనలు జరగాలి. ‘మీరు బాన్ ని సమర్ధిస్తున్నారా లేక వ్యతిరేకిస్తున్నారా’ అని కాదు ప్రశ్నలు రావలసినది . చర్చలతో, వివరణలతో ప్రజాభిప్రాయాన్ని నిర్మాణమ్  జరగాలి. ఆ పనిలో  మీడియా సహాయం తో ‘పబ్లిక్ ఇంటలేక్చువల్’ గురుతర బాధ్యతను నిర్వహించగలడు.   
ప.క: ఆ పాత్ర ను ‘పబ్లిక్ ఇంటలేక్చువల్’  ఏ రకమైన భయం లేకుండా నిర్వహించే పరిస్థితులు ఉన్నాయంటారా? మీ వరకూ మీరు చాలా వ్యతిరేక ప్రచారానికి గురయ్యారు కదా, మీరు ఏదైనా చెప్పేందుకు ఇప్పుడు సంకోచిస్తారా?
రో: ఆ రకమైన భయాలకు నేనెప్పుడో స్వస్తి చెప్పాను, నేను స్త్రీ ననే కారణం చేతనూ, నా భావాల మీద వ్యతిరేకతతోనూ చాలా ద్వేష పూరిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, కానీ నా వ్యక్తిగత నిర్ణయం భావ ప్రకటనే.
అది పక్కన పెడితే, నిన్న జరిగిన (కులకర్ణి పై పెయింట్ పోసిన) సంఘటన దుస్సహమైనది. అటువంటి చర్యలకు పాల్పడిన వారిని తగినట్టూ శిక్షించడం లేదు. ఈ రకమైన చర్యల పూర్తి అర్ధం అంచనా కట్టలేక పోవడం వల్ల ప్రజలు కూడా దీనికి తగిన వ్యతిరేకత చూపడం లేదు.
పుస్తకపు ఆవిష్కరణ మధ్యలో ఆగిపోలేదు, అది ఒక చిన్న విజయమే కానీ ఈ పెయింట్ ఉదంతపు పూర్వాపరాలపై  విమర్శ జరగాలి. శివసేన, బీజేపీ రెండూ మిత్ర పక్షాలుగా ఉండేవి కదా, మరి ఇప్పుడు బీజేపీ సమర్ధన ఎటుంది? భద్రతా ఏర్పాట్లు జరిగినప్పటికీ ఇంత అవాంతరం ఎలా సంభవించింది? భద్రతా దళాలు ఎవరి పక్షాన ఉన్నారు? ఇటువంటి ప్రశ్నలెన్నో ఉత్పన్నం ఔతాయి. అన్నిటి కంటే ముఖ్యమైన విషయం, మన దేశాని కొక విదేశాంగ విధానం ఉంటుంది. ఎలాటి పరిస్థితుల్లోనూ, ఒక కనీస స్థాయి సంబంధాన్ని మన పొరుగు దేశంతో మన దేశం నిలబెట్టుకునే తీరాలి. ఆ విషయం ప్రజలకు స్పష్టంగా తెలియజెప్పాలి. 
ప.క: సిక్కుల ఊచకోత జరిగినప్పుడు ఎందుకు అవార్డు తిరస్కరించలేదని నయనతారా సెహగల్ పై విమర్శలు వస్తున్నాయి. బహుశా ఆమె ఎమర్జేన్సిని కూడా ఖండించిన విషయం వారికి తెలిసి ఉండదు. కానీ గతంలో కూడా ఖండిన్చవలసిన పరిస్తితులు వచ్చాయన్నది వాస్తవమే కదా? అప్పటి కంటే ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా వేరు అని మీరు భావిస్తున్నారు?   
రో: రెండిటి చారిత్రక సందర్భాలు భిన్నమైనవి. ఎమర్జెన్సీని కూడా ఎవరి ధోరణిలో వారు ఖండించాం. ప్రజాస్వామిక వాది అయిన ఇందిరాగాంధీ చేసిన ఒక తప్పిదంగా ఎమర్జెన్సి ఆమెకు  అనిపించింది, కానీ ప్రస్తుత పరిస్థితి ఆమెకు నియంతృత్వ పాలనగా కనిపిస్తోంది.
ప.క: అదే కారణంతో బీజేపీ ఆమె తిరస్కరణను రాజకీయ చర్యగా అభివర్ణిస్తోంది. స్వప్నదాస్ గుప్త, ఆమె నిరసన మోదీ వ్యతిరేకత నుండి పుట్టినదని వ్యాఖ్యానిస్తున్నారు. మీరేమంటారు? 
రో: లేదు, ఆ వ్యాఖ్య నిరాధారమైనది. మీరొకప్పుడు ఎందుకు ఆందోళన జరపలేదని వ్యక్తుల మీద నెపం వెయ్యడం సహేతుకం కాదు, పరిస్తితులను సందర్భానుసారం విశ్లేషించుకోవాలి.
మన సంఘానికి అప్రజాస్వామికత’ కన్నా కూడా పెద్ద ముప్పు ఒకటి పొంచి ఉంది. ‘మత అసహనం’ ఈనాడు తీవ్రవాద ధోరణులను సంతరించుకుని, ప్రస్తుత సమాజాన్ని అధికారీకృత రాజ్యంగా మార్చేసే పని లో ఉంది. ‘అభివృద్ధి’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీలో, పైకి కనిపించని విచ్చిన్న శక్తులు- టెర్రరిస్ట్ ల రూపం తీసుకున్నాయి.
ప.క: వారిని టెర్రరిస్ట్ లని అంటున్నారా! ఎందుచేత?
రో: వారు అదే పని చేస్తున్నారు. మనుషుల ముఖాలపై పెయింట్ పూయడం, హత్యలు చెయ్యడం, ప్రజలను భయభ్రాంతులను చెయ్యడం - ఈ పనులు చేసేవారు టెర్రరిస్ట్ లే.
ప.క: శివసేన చేసిన పనులను సమర్ధించలేము కానీ అది ఎన్నికలలో ప్రజల వోట్లు సంపాదించిన పార్టీ కదా... టెర్రరిస్ట్ అనడం సమంజసమేనా?
రో: నేను మొత్తం పార్టీని టెర్రరిస్ట్ లనడం లేదు. అలాగే బీజేపీ విషయం కూడా, మొత్తం టెర్రరిస్ట్ లనడం నా ఉద్దేశం కాదు, కానీ దానితో పొత్తు పెట్టుకున్న కొన్ని సమూహాలూ, సంఘాలూ ఉన్నాయి.
ప.క: దాబోల్కర్, కాల్బుర్గీ ఉదంతాలకు కారణమని విచారణ జరుగుతున్న ‘సనాతన సంస్థ’ వంటివనా మీ అభిప్రాయం?
రో: ఔను, ఇస్లామిక ఛత్రం లో కొన్ని సంస్థలను టెర్రరిస్ట్ లంటాం కదా, వారిలాగే వీరూ చంపడం, ప్రజల జీవితాలకు ఆటంకాలు కలుగజేయడం... ఇటువంటి పనులకే పాల్పడుతున్నారు. ప్రజల వేషధారణలో, తినే తిండి విషయంలో, వారి రాకపోకల్లో అనవసరపు జోక్యం కలిగించుకుంటున్నారు. వారిని ఇక చెదురు మదురు భావాల గుంపులూ, తీవ్ర భావాల అల్పసంఖ్యాకులూ అని అనుకోకూడదు,
ఈ సంఘాలు, ఒక ప్రత్యేక తరహా రాజకీయ వ్యవస్థను పట్టుకుని వేలాడే విచ్చిన్న శక్తులు. వాటి భావజాలాలనూ, కార్యకలాపాలనూ గుర్తింఛి, సరైన పేరుతొ వాటిని పిలిచే సమయం ఆసన్నమైంది. అవి ప్రభుత్వాలను తోసిరాజని తామే పాలక నిర్ణయాలు చేస్తూ ఉంటే మనము వాటిని అనుమతిస్తామా? ఈ పాలన కోసమేనా మీకు వోటు వేసినది అని ప్రభుత్వాన్ని నిలదీసి ఈ శక్తులను అడ్డుకుంటామా? 
ఇంకా తరువాత జరిగిన చర్చలో ‘చరిత్రరచన’ చుట్టూ అల్లుకుంటున్న వివాదాల ప్రసక్తి రాగా, రోమిలా ఇచ్చిన  వివరణ లో కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:
1818 లో జేమ్స్ మిల్ “ది హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా” అనే పుస్తకం లో భారతదేశ చరిత్రను హిందూ, ముస్లిం, బ్రిటిష్ కాలాలు గా విడగొట్టాడు, హిందూ ముస్లిము లెల్లప్పుడూ వైరులు గానే ఉండేవారనీ, బ్రిటిష్ వారు వచ్చి శాంతి స్థాపన చేసి వీరిని రక్షించినట్టుగా ఆ పుస్తకంలో ఆయన రాసాడు. ఆ వలసవాదపు ప్రతిపాదనలనే ఆనాటి నుండీ ఈనాటి వరకూ ముస్లిం వేర్పాటు వాదులూ, హిందూ రాష్ట్ర నిర్మాణ వాదులూ  కొనసాగిస్తున్నారు.
చరిత్రను తప్పుగా అందించడం వలన వచ్చే అనేక ప్రమాదాలలో ఇది ఒకటి మాత్రమే. పూర్వం ‘చరిత్ర’ అంటే ‘ఇండాలజీ’ (భారతదేశానికి సంబంధించిన విషయాలు) అనే అర్ధం లో వాడేవారు. గత యాభై ఏళ్లగా చరిత్రను సాంఘిక శాస్త్రాలలో భాగం గా మారిన తర్వాత దాని పరిధి విస్తృతమయిన్ది. పాత కథల్లోని పాక్షిక సత్యాల గురించి చరిత్ర చర్చించడం కొంతమందికి కంటగింపుగా ఉంది. అందుకే ‘చరిత్ర రచన’ను  ఒక ప్రముఖ వ్యూహంగా మేధావులు గుర్తిస్తున్నారు.