Monday 16 May 2016

అనురాధ గాంధీ

 

 “అను జీవితం అనేక మార్గాలలో పయనిస్తూ వచ్చింది. స్కూలు లోనే ‘అను’ చురుకుగా ఉండేది, దాని వెనుక ఆమె ఇంటిలోని ప్రగతిశీలక ప్రజాస్వామిక వాతావరణం పాత్ర చాలా ఉన్నదని చెప్పుకోవచ్చు. కాలేజీ రోజుల్లో విద్యార్ధి ఉద్యమాల్లో పాల్గొని నాయకత్వం వహించేది. ఎమర్జెన్సీ అనంతరం, అప్పటికి లెక్చరర్ గా పని చేస్తున్నఅను దేశం లోని మానవహక్కుల ఉద్యమాలకు తలలో నాలిక అయింది. 1980 ల్లో నాగపూరుకు చేరుకున్నాక, ‘అను’ పేరు - నాగపూరు/విదర్భ సాంస్కృతిక విప్లవోద్యమానికి ‘చిరునామా’ గా మారింది. అక్కడ సోషియాలజీ ప్రొఫెసర్ గా ఉన్నత విద్యను బోధించడంతో పాటూ, యుద్ధ సన్నద్ధురాలైన ట్రేడ్ యూనియన్ నాయకురాలిగా ప్రముఖ పాత్ర పోషించింది. కార్మిక ఉద్యమాలను నడపడం, స్వయంగా అనేక సార్లు జైలు శిక్ష ననుభవించడం కూడా జరిగాయి. ఆ ప్రాంతం లో స్త్రీల ఉద్యమాలకు కూడా ఆమె నీడగా నిలిచింది.  వీటిలో గుర్తుంచుకోదగ్గ విషయం ఒకటి - లెక్చెరర్లూ, విద్యార్ధులూ, లాయర్లూ, విదర్భ ప్రాంతపు ఉద్యమకారులూ – ఇటువంటి మేధావి వర్గం మీద ఆమె వ్యక్తిత్వం చూపిన ప్రభావం ఇంతింతని చెప్పలేం. అయితే అన్నిటి కంటే ముఖ్యమైన అంశం - విదర్భ దళితుల పోరాటానికి ఆమె అందించిన సహకారం.”  
(కొబాద్ గాంధీ తీహార్ జైలు నుండీ రాసిన ఉత్తరం లో తన ప్రియ సఖి, సహచరి ఐన అనురాధ గాంధీ గురించి ఇలా రాసుకున్నాడు.)
    “...కానీ అనురాధ సంగతే వేరు”
అనురాధ గాంధీని ఎరిగిన వారంతా అనే మాట ఇది. ఆమె ఎవరెవరి జీవితాలను స్పృశించిందో వారందరూ ఏకగ్రీవంగా నమ్మే మాట ఇది.   
12 ఏప్రిల్ 2008 న ముంబాయ్ లోని ఒక హాస్పిటల్లోమలేరియా తో మరణించింది. బహుశా ఝార్ఖండ్ అడవుల్లో ఆదివాసీ మహిళలకు స్టడీ క్లాస్ లు నిర్వహిస్తున్న కాలంలో ఆ విషజ్వరం ఆమెకు సోకి ఉంటుంది. మన పవిత్ర ప్రజాస్వామ్యం, ఆమెను ఒక మావోయిస్ట్ లీడర్ గా మాత్రమే చూస్తుంది గనక ఆమెను అరెస్టు చేయనూ గలదు, అనేక వందల మందికి పట్టించిన గతే ఆమెకూ పట్టించి, నకిలీ ‘ఎన్ కౌంటర్’ పేరుతో చంపనూగలదు మరి. ఈ ‘తీవ్రవాది’, ఒళ్ళు పేలిపోయే జ్వరంతో రక్త పరీక్ష చేయించుకునేందుకు ఒక హాస్పిటల్ కు వెళ్లింది కానీ అక్కడ డాక్టరుకు ఇచ్చిన వివరాల్లో తన పేరూ, ఫోను నంబరు నకిలీవి ఇచ్చింది. ఆ కారణం చేత, ఆమె రక్తంలో ప్రాణాంతకమైన మలేరియా ఫాల్సిపేరం దొరికిందన్న వార్త ఆ డాక్టరు ఆమెకు అందజేయనే లేకపోయాడు. ఆమె అంగాలొకోటొకటిగా పని చెయ్యడం మానేశాయి. 11 ఏప్రిల్ న ఆమెను హాస్పిటల్లో చేర్చే సరికే పరిస్థితి చెయ్యిదాటి పోయింది. నిష్కారణం గా ఆమెను మనం పోగొట్టుకున్నట్టయింది.                      
మరణించే నాటికి ఆమె వయస్సు 54 ఏళ్ళు, అందులో 30ఏళ్ళకి పైన నిబద్ద విప్లవకారిణి గా అజ్ఞాతం లోనే గడిచింది.   
ఆమె జీవించి ఉండగా నాకామెను కలిసే అదృష్టం లేకపోయింది, కానీ ఆమె సంస్మరణ సభకు హాజరవగలిగాను. అప్పుడు గ్రహించాను – ఆమె ఎందరికో ఆరాధనీయంగా నిలిచింది, కానీ అంత కంటే ఎక్కువగా మరెందరి ప్రేమాభిమానాలనూ చూరగొంది అని. ఆమెను తెలిసిన వారు ఆమె ‘త్యాగా’లను పదేపదే ప్రస్తావిస్తూ ఉంటే నాకు కొద్దిగా ఆశ్చర్యం కలుగుతోంది. వారి ఉద్దేశం - మధ్యతరగతి జీవితం ఇవ్వగలిగిన సౌకర్యాలూ, భద్రతా – వీటిని వదిలి మౌలిక రాజకీయాల్లోకి ఆమె రావడం గురించి అయి ఉంటుంది. నాకయితే అనురాధ - తుచ్చతనీ, అనాసక్తతనీ జీవితం లోంచి తోసిపడేసి, వాటి స్థానం లో నిర్విచారంగా తన ఆశల్నీ, కలల్నీ నిలుపుకోగలిగిన ధీశాలి అని అనిపిస్తుంది.  ప్రజలకి ‘సేవ’ చేయ్యడం, ‘పుణ్యం’ సంపాదించడం వంటివి కాదు ఆమె ఆశయాలు. పరమాద్భుతంగా జీవించిందామె, అతి కఠినమైన జీవనం కానీ సాఫల్యం చెందిన జీవితం.                
ఆమె తరంలోని మిగిలిన వారి లాగే, చిన్న వయస్సు లోనే అనురాధ మీద కూడా వెస్ట్ బెంగాల్ లోని నక్సలైట్ ఉద్యమపు భావజాలం బలమైన ముద్ర  వేసింది. 1970 ల్లో ఎల్ఫిన్స్టన్ కాలేజీ లో ఉండగా మహారాష్ట్ర గ్రామాలలో ఆమె చూసిన ‘కరువు’ అనురాధను అతలాకుతలం చేసింది. ఆ కరువు పీడితుల ఆకలీ, నిస్సహాయతా ఆమెను విప్లవ రాజకీయాల్లోకి అడుగుపెట్టేలా చేసేయి. ముంబాయి విల్సన్ కాలేజీ లో లెక్చెరర్ గా ఉద్యోగ జీవితం మొదలయ్యింది, కానీ 1982 కల్లా నాగపూర్ కు చేరింది. కొన్ని సంవత్సరాల పాటు - నాగపూరు, చంద్రపూరు, అమరావతి, జబల్పూరు, యావత్మల్ – ఈ ప్రాంతాల్లో భవననిర్మాణ కూలీలూ, బొగ్గు గనుల కార్మికులూ – ఈ నిరుపేదలను కూడగట్టుకుని ఆమె పనిచేసింది. అది ఆమెలో దళిత ఉద్యమానికి సంబంధించిన అవగాహనను పెంచింది. 

1990 ల్లో, స్క్లేరోసిస్ అనే కండరాల వ్యాధి తో బాధపడుతూ కూడా, బస్తర్ గ్రామానికి వెళ్లి, దండకారణ్యాల్లో ‘పి ఎల్ జీ యే’ People’s Liberation Guerilla Army లో మూడేళ్ళు పనిచేసింది. అక్కడ ఉన్న ఒక అసాధారణ మహిళా నిర్మాణం, బహుశా దేశం లోని అతి పెద్ద ఫెమినిస్ట్ నిర్మాణం అనొచ్చు దాన్ని. 90,000 కు పైగా సభ్యులు ఉన్న (KAMS) ‘క్రాంతికారి ఆదివాసి మహిళా సంఘటనం’ తో కలిసి - దానిని  శక్తివంతం చేసేందుకూ, విస్తరింప చేసేందుకూ అనురాధ కృషి చేసింది. ఈ KAMS భారతదేశం దాచి ఉంచే రహస్యాలలో ఒకటి అనుకుంటా. అనురాధ ఎప్పుడూ అనేది – దండకారణ్యం లో పీపుల్స్ వార్ (సీపీ ఐ –మావోయిస్ట్) గెరిల్లా వీరులతో గడిపిన ఆ మూడేళ్ళూ ఆమెకు అత్యంత సాఫల్యం కలిగించిన సంవత్సరాలని. ఆమె మరణించిన ఒక రెండేళ్ళ తర్వాత ఆ ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు, స్త్రీల గురించీ, సాయుధ పోరాటాల గురించీ నా ఆలోచనలను తరచి చూసుకున్నాను. తెలిసీ తెలియక ఏర్పరుచుకున్న నా అభిప్రాయాలను వదిలి, KAMS గురించి అనురాధ వెలిబుచ్చిన ఆనందాశ్చర్యాలను నేనూ పంచుకున్నాను.
అవంతి అనే మారుపేరుతో రాసిన వ్యాసాల సంకలనం లో అనురాధ ఇలా అంటుంది:
మార్చి 8 దగ్గర పడుతోంది, నూతన శతాబ్దపు తొలి వెలుగులో, స్త్రీ ల పక్షాన్న గణనీయమైన అభివృద్ది జరుగుతోంది. మధ్య భారతపు మారుమూల అరణ్యాల్లోనూ, మైదానాల్లోనూ, ఆంధ్రప్రదేశపు కుగ్రామాల్లోనూ, ఆ రాష్ట్ర గిరిజనుల కొండప్రాంతాల్లోనూ, బీహారు, ఝార్ఖండు అడవులూ, మైదానాల్లోనూ – స్త్రీలు సంఘటిత మౌతున్నారు, ఫ్యూడల్  పితృస్వామ్యపు సంకెళ్ళు చేదించి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించెండుకై ఏకత్రితమౌతున్నారు. దేశం లోని గ్రామీణ ప్రాంతపు ఆడ రైతు కూలీలు పాల్గొని సాగించే స్త్రీల విముక్తి ఉద్యమం ఇది. అణగారుతున్న రైతాంగం, పీపుల్స్ వార్ విప్లవ నాయకత్వంలో చేస్తున్న పోరాటం.  కొన్ని సంవత్సరాలుగా మార్చి8 వేడుకలు జరుపుకునేందుకు వేలాది స్త్రీలు చుట్టుపక్కల వందలాది గ్రామాల నుండి  వస్తూ ఉన్నారు. నారాయణపూర్ వంటి చిన్న టౌనులో ‘ప్రపంచ సుందరి’ అందాల పోటీలను వ్యతిరేకించడం; తెహసీలు టౌనుల గుండా, బస్తర్ కుగ్రామాల బజార్ల గుండా - పిల్లలకు విద్యాసదుపాయాలు కల్పించమంటూ ‘మార్చ్’ లు సాగించేందుకు - వారి పిల్లాపాపలతో సహా, స్త్రీలందరూ కూడడం జరుగుతోంది. రేప్ కేసులను ప్రతిఘటిస్తూ రోడ్లను అడ్డుకుంటున్నారు. సారా అమ్మకాలను ఆపివేయమని పోలీసులను నిలదీస్తున్నారు.   తరతరాల నుండీ వారి కి సంక్రమిస్తున్న బానిస సంకెళ్ళను వదుల్చుకుని, ‘పీడితుల సైన్యం’ లో అడుగుపెట్టి వందలాది యువతులు గెరిల్లా యోధులు గా మారుతున్నారు. ఆకుపచ్చ టోపీల పై ఎర్రని నక్షత్రాన్ని ధరించి, భుజాలపై రైఫిళ్లు పట్టుకుని ఆత్మవిశ్వాసం తో తోణికిస లాడుతున్నారు. పితృస్వామ్యాన్ని కూలదోయ్యాలంటే - ఆధిపత్య వర్గాల మీదా, భూస్వామ్య వర్గాల మీదా, వలస పాలనా వర్గాల మీదా పోరాటం తప్పనిసరి అని అర్ధం చేసుకుని దానిని సాధించడానికి సైనిక శిక్షణ పొందుతున్నారు. ఆ బలం తో ప్రపంచం లోనే మూడవ పెద్ద దోపిడీ వర్గపు సైన్యాన్ని ఎదుర్కునేందుకు సంసిద్దులౌతున్నారు. కటిక పేదస్త్రీలలో కలుగుతున్న సాంఘిక రాజకీయ జాగృతి ఇది. బూర్జువా మీడియా చూడదల్చుకోని విషయం కదా – అందుకే ఈ ఘట్టాలు టీవీ కెమెరాల జిగజిగ లకు దూరంగా చోటుచేసుకుంటున్నాయి. విప్లవ పోరాటాల కారణంగా గ్రామీణ నిరు పేద వర్గాల జీవితాలలో జరుగుతున్న రూపాంతరాలకు, వికాసానికీ గుర్తులు ఇవి.   

కానీ ఈ స్త్రీల విప్లవ ఉద్యమం ఏదో రాత్రికి రాత్రి ఉద్భవించినదో, మరేదో ప్రచారపు ఉద్రుతాల వల్ల గాలిలో తేలుతూ వచ్చినదో కాదు. సాయుధ పోరాటాలు వ్యాప్తి చెందడం తో పాటే స్త్రీల పోరాటాలు కూడా విస్తరించాయి. ఈ పోరాటాలకి సంబంధించి ప్రజల్లో ప్రవేశపెట్టిన అభిప్రాయాలు అపోహలేననీ, వాస్తవం వేరే ఉందనీ మనం గ్రహించాలి. అదేమిటంటే - 1980 ల్లో ఫ్యూడల్ పీడనకు వ్యతిరేకంగా దేశం లోని పలుప్రాంతాల్లో కమ్యూనిస్ట్ విప్లవ శక్తులు ప్రారంభించిన విప్లవ పోరాటాలు – ఈ రైతు మహిళలు పోరాటాలు సాగించేందుకూ, తమ హక్కుల కోసం ఉద్యమించెందుకూ – వారిలో తగిన ధైర్యాన్ని కలిగించాయి. పీడితులలో కెల్లా పీడితులూ, సొంతంగా చిన్న ముక్క భూమి కూడా లేని రైతుకూలీలూ – వీరెవరికీ ఈ సమాజంలో గుర్తింపూ, గొంతుకా లేవు, కనీసం వారికి పేర్లు కూడా లేవు. అటువంటి అట్టడుగు వర్గపు స్త్రీలంతా వారి గ్రామాల్లో మహిళా కార్యక్రమాలను నిర్మించుకున్నారు, గెరిల్లా సైనికులూ అయ్యారు. అంటే, దీని సాయుధపోరాటాలతో పాటూ, స్త్రీల సంఘటిత రూపాలూ బలపడ్డాయని అర్ధం. అలా సంభవించిన ఈ మహిళా ఉద్యమం దేశం లోకెల్లా అతి శక్తివంతమైనదిగా రూపుదిద్దుకుంది. కానీ దానికి ప్రచారం ఇవ్వకపోవడమూ, నిరాదరించడమూ జరుగుతోంది. అది ఆధిపత్య వర్గాల కుట్ర అని మనం గ్రహించాల్సి ఉంది. అది ఈ ఉద్యమానికి సంబంధించిన వార్తలను గుర్తించకపోవడమే కాదు సాధ్యమైనంత కాలం తొక్కి పెట్టి ఉంచుతుంది కూడా.