Saturday 8 December 2018

మహాశ్వేతా దేవి రిక్షావాలా – ఇప్పుడు ఆక్స్ ఫర్డ్ రచయిత!

మూలం: మనోరంజన్ బ్యాపారి 



చేతిలో పుస్తకాన్ని ఒళ్లుమర్చి చదువుకుంటున్నాను, రిక్షాలైన్ లో నా వంతు వచ్చిందని తెలియనేలేదు. గభాలున మేలుకున్నా, తలెత్తి చూస్తే ఎదురుగా ఒకామె ఒక పాతికేళ్ల యువకునితో కలిసి రావడం కనిపించింది. టీచర్‌గా మాకందరికీ పరిచయమైన ముఖమే. మళ్లీ ఒకసారి నేను చదువుతున్న పుస్తకం పేజీలు వేళ్లతో తిరగేసాను. ఆరో ఏడో పేజీలు మిగిలేయంతే, ఏం చెయ్యాలో తోచలేదు, నావెనక నిలబడ్డ అతన్ని ఆసవారీ తీసుకోమని అడిగేను. నేను తర్వాత వచ్చేవాళ్లని ఎక్కించుకుంటానన్నాను.
“చాల్చాలు, తెలివి ఎక్కువౌతోందే, గుర్రం దిగింక” అని కోపంగా జవాబిచ్చాడు అతను. “ఇద్దరు పాసింజర్లు వచ్చారని తెలివిగా నామీద తోసేద్దామనుకుంటున్నావా, నీ వొంతిది, నీ కేది రాసి పెట్టుంటే అదొస్తుంది. నా వొంతొచ్చినప్పుడు నేను తీసుకుంటాను. నీలాగే అందరం ఎండలో మాడుతున్నాం, ఆ పుస్తకం పక్కన పడేసి సవారీ కట్టు – పో!” అని గసిరాడు.
నాకేది రాసిపెట్టుంటే అదొస్తుందని కదా అన్నాడు?  ఆమాట నిజం. లేకపోతే ఆమె నా రిక్షా లోకే ఎక్కడం ఎలా సంభవిస్తుంది?
సరే, ఇక చేసేదేం లేక అయిష్టంగానే లేచి పుస్తకాన్ని సీట్ కిందకి తోసేను. సూర్యుడు పడమటింటికి దిగుతున్నాడన్న మాటే గానీ, వేడి భరించలేకుండా ఉంది. నా ఒళ్లు చెమటతో తడిసి ముద్దై ఉంది.
రోడ్లు మామూలు కంటే ఎక్కువ రద్దీగా ఉన్నాయి. ఆరోజు శనివారం, స్కూళ్లు కాలేజీలూ వదిలే టైమయింది, ఇంటి మొహం పట్టిన స్టూడెంట్లతో వీధులు నిండి పోతున్నాయి. వచ్చి నాముందు నిలబడ్డ పెద్దావిడని చూసేను, నెరిసిన జుత్తూ, కళ్లద్దాలూ, పక్కగా వేలాడుతున్న సంచీ. ఆమె ముఖం సీరియస్ గా ఉంది, ఆమె ఎలాటి టీచరయ్యుంటుందో అలాగే కనిపించింది.
ఆమె జాదవ్ పూర్ వెళ్లాలట. రిక్షా సాగి పోతోంది. సగం దారిలో అనుకుంటా, ఒక పదం గుర్తొచ్చింది: జిజీవిష.  కొన్ని రోజుల క్రితం చాణక్యసేన్ పుస్తకం చదివినప్పుడు తగిలింది. ఆ మాటకి అర్ధం ఎవరూ చెప్పలేక పోయారు నాకు. అప్పటి నుంచీ తలలో అప్పుడప్పుడు మెదులుతూనే ఉంది. అందుకని ఆమెని అడిగాను .
“దీదీ, మీరేమనుకోనంటే ఒక మాటకి అర్ధం అడగొచ్చా, జిజీవిష అనే మాటకి అర్ధం ఏమిటమ్మా?”
నా ప్రశ్న ఆమెకి ఆశ్చర్య కలిగించిందనుకుంటా, ఆమె అంది: “జిజీవిష అంటే జీవించాలనే కోరిక. అది సరే గానీ ఆమాటని నువ్వెక్కడ విన్నావ్?”
“ఒక పుస్తకంలోనమ్మా,” అని జవాబిచ్చేను.
నిశ్శబ్దం. పాసింజర్ సీట్లో నావెనక కూర్చుంది. ఆమె ముఖం లోని భావాలు కదిలి ఉంటాయో నాకు చూసే అవకాశం కలగలేదు.
కాసేపటి తర్వాత ఆమే అడిగింది, “నువ్వెంత వరకూ చదువుకున్నావ్?”
“నాకు స్కూల్ కెళ్లి చదువుకోడం కుదరలేదమ్మా.”
“మరి చదవడం ఎలా వచ్చింది?”
“అంటే … నా అంతట నేనే కొద్ది కొద్దిగా… నేర్చుకున్నానమ్మా,” నేను చెప్పేను.
చక్రాలు గిర్రుగిర్రని తిరుగుతున్నాయి. మా గమ్యస్థానం దగ్గర పడింది.
అయితే తిరుగుతున్నవి నిజానికి ఏం చక్రాలు? అవి రిక్షా చక్రాలా లేక నా భాగ్య చక్రాలా? ముందుకుకదులుతున్నది ఏది? నా రిక్షానా లేక నేనా? అంధకారం, అవమానాలతో నిండిన అనామక జీవితం నుంచి గౌరవం, మర్యాద దొరికే జీవితంలోకి ప్రవేశించుతున్నానా?
అప్పుడు ఆమె ఇలా అంది, “నేనొక పత్రిక నడుపుతూ ఉంటాను, దానిలో నీలాటి శ్రమజీవులూ, కాయ కష్టం చేసేవారూ – రాస్తూ ఉంటారు. నాకోసం రాస్తావా? నువ్వు రాస్తానంటే, నేను ప్రచురిస్తాను.”
నేను? రాయడమా!
పుస్తకపు ముఖచిత్రాల మీద మెరిసే పేర్లూ, రేడియోలో వినపడే గొంతులూ, టీవీ స్క్రీన్ల మీద తేలుతూ కనపడే ముఖాలూ – కళ్ల ముందు తిరుగాడేయి. వారు మన నేల మీదే నడుస్తారని అప్పటి వరకూ అనుకోలేదు. ఎక్కడో వేరే గ్రహం మీద ఉండే మనుషులన్నట్టు నా భావం. మన లాగే తింటారనీ, పడుకుంటారనీ, బజారు కెళతారనీ, వీధుల్లో తిరుగుతారనీ – అసలు ఊహించనేలేను. ఏది ఏమైనా – వాళ్లెవరూ రిక్షా అయితే తొక్కుతారని ఒక్కనాటికీ అనుకోలేదు.
అలాటిది ఈ మహిళ మరి ఆ వరాన్ని ప్రసాదిస్తానంటుందేమటి?
“నేను రాసేది అచ్చు వేస్తారా?”
“ఔను, అదే అంటున్నాను. రాస్తావా మరి?”
“కానీ … నేను దేని గురించి రాయగలను?” అడిగాను.
“రిక్షావాలాగా నీ జీవితం గురించి చెప్పు,” ఆమె చెప్పింది. “నువ్వు ఈపనిలోకి ఎలా వచ్చావు, నువ్వు రోజుకెంత సంపాదిస్తావు, నీ కుటుంబానికి సరిపోతోందా – అవన్నీ రాయి, ఏం రాస్తావా?”
“నేనింతకు ముందెప్పుడూ రాసి ఎరగను,” సంకోచంతో చెప్పేను. “కానీ ప్రయత్నిస్తాను. రాయగలిగినట్టైతే, మీదగ్గరకి తెస్తాను. మీ అడ్రస్ ఇస్తారా?”
ఆపాటికి జాదవ్ పూర్ చేరుకున్నాం. ఆమె కాగితం, పెన్నూ బయటికి తీసింది. కాగితంమీద ఏదో రాసి, నాచేతికి అందించింది.
“ఇదిగో,” అంది.
కాగితం ముక్క మీద రాసి ఉన్నది చదివేను, నా చుట్టూ ఉన్న ప్రపంచం అటూ ఇటూ ఊగడం మొదలుపెట్టింది.
“మీరా?!” ఆశ్యర్యాతిరేకంతో అరిచేను.
“నేనెవరో తెలుసా?”
నాకు నువ్వెవరో తెలియకపోవడమేమిటమ్మా, ఓ మహోత్కృష్ట అక్షరశిల్పీ! ఎటువంటి జ్ఞానమది? తిరుగుబాట్లూ, ప్రతిఘటనలూ, ఉద్యమాలూ, ఆక్రోశాలూ – వాటి లోంచి, ఆ స్వేదం, రక్తంలోంచి –  ఉత్పన్నమైంది. పీడితుల పక్షానా, నిస్సహాయుల పక్షానా నిలిచి – వారి కోసం – కలాన్ని ఖడ్గంగా ఝళిపించిన ఆగ్రహం అది. నీ ద్రౌపదిని చదివేక ఆ రేపిస్ట్ లని వెతికి వేటాడి చంపాలని ఊగిపోయానమ్మా! వారు కాకుంటే అలాటి దుర్మార్గులని కొందరినైనా శిక్షించాలనిపించిందమ్మా …
అయితే ఇదేదీ చెప్పలేదు. నా ఉధృత భావప్రవాహన్ని – భాషలోకి తేలేకపోయాను.
నేనన్నాను, “మీ పుస్తకాలు చదివేను. అగ్నిగర్భ ఇదిగో ఇక్కడే ఉంది.”
సీట్ పక్కకి జరిపి పుస్తకం బయటికి తీసేను.
ఆమె మనసులో ఏం ఆలోచనలు మెదిలాయో నాకు తెలియదు. నాకు మాత్రం ఒక అపురూపమైన సంతృప్తి ఆమె ముఖంమీద మెరిసిందని తోచింది. ఆమె ఏబడుగు జీవుల కోసం రచనలు చేస్తోందో, వారు ఆమె పుస్తకాలని గుర్తించారనీ, శ్రద్ధాసక్తులతో చదువుతున్నారనీ తెలియడం – ఆమెకి ఆనందం కలిగించి ఉంటుంది.
ఇక నా సంగతి చెప్పాలంటే, ఉద్వేగం పట్టలేక ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాను. శ్వాసతీసుకోడం కష్టమైపోతోంది. నా గుండె గట్టిగా కొట్టుకుంటోంది, నా శరీరం వణుకుతోంది, మనసూ కంపిస్తోంది, నా జీవమే ఒక ప్రకంపనగా మారింది. నిటారుగా శరీరాన్ని నిలబడనంటోంది … తల ఎత్తి నిలబెట్టడం శక్యమవడం లేదు. నా శిరస్సు దానికదే వంగి పోయింది, ఆమె కాళ్ల ముందు సాగిలపడిపోయాను. తల ఎత్తి నిలబడే సందర్బాలు అనేకం ఉంటాయి మనిషికి. ఎవరికైనా శిరసు వంచి గౌరవం చూపగల అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది. సరైన పాఠశాలగది మొహం చూడని ఒక పిల్లవాడు, కేవలం తల్లిపాలతోనే తన దాహాన్ని తీర్చుకున్న పసివాడు, ఇన్నేళ్ల  తర్వాత ఒక దేవత ముందు నిలుచున్నాడు. సాక్షాత్ హంసవాహిని సన్నిధి. ఔను, సరస్వతికి మరో పేరు మహా శ్వేత కదా?
మర్నాడు తనని వచ్చి కలవమని, తనతో కలిసి లంచ్ చెయ్యమని ఆమె ఆహ్వనించింది. ఈలోగా ఆమె ఎక్కాల్సిన బస్ వచ్చింది. బస్ ఎక్కుతూ ఆమె చెయ్యి ఊపింది – ఏదో దివ్యహస్తం ఆశీర్వదించినట్టు అనిపించింది.
మరుసటి రోజు ఉదయాన్నే ఏడు గంటలకల్లా, బాలీగంజ్ రోడ్లో ఉన్న ఆమె ఇల్లు చేరుకున్నాను. వంకర తిరిగి ఉన్న మెట్లు ఎక్కుతున్నాను, తలలో ముప్పిరిగొంటున్న భావాల సందోహం.
ఆ మెట్లు: పూలూ, పళ్లూ, కలుపు మెక్కలూ, పురుగులూ, క్రిమి కీటకాలూ పుష్కలంగా ఉన్న మట్టిలోకి  బలంగా పాదుకుని ఉన్న ఆమెట్లు, వాటి రెండో అంచు మాత్రం – అవధులు లేని సువిశాల స్థలంలోకి,  ఆశల దీపాలు వెలిగే ప్రాంగణం లోనికి, అప్పటికింకా రూపుకట్టని ఉజ్వల భవిష్యత్తు లోకి – తెరుచుకునే మెట్లు.
ఆమెట్ల మీద నడుస్తుంటే, నాకాలి ఒత్తిడికి జవాబుగా -వాటి భాషలో కిర్రుమంటూ స్వాగతం చెప్పేయి. మొదటి అంతస్థులోని ఆమె ఇంటి ముందు నిలుచునే సరికి, నా జీవితపు అత్యున్నత స్థానాన్ని చేరుకున్న భావం కలిగింది.
నేను బెరుకు బెరుకుగా తలుపు తట్టేను, ఆమె గొంతు జవాబిచ్చింది.
“తలుపు తెరిచే ఉంది, లోపలికి వచ్చి కూచో, మదన్.”
నన్ను చూడకుండానే నేనని గ్రహించింది. నిన్న కలిసిన పిచ్చివాడు, రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా ఉండి ఉంటాడు, పొద్దు పొడవగానే వచ్చేసి ఉంటాడని ఆమె ఊహించింది.
అది ఆమె కూచుని రచన సాగించే గది. చుట్టూ చూసాను. ఒక టేబులూ, కుర్చీ. టేబుల్ మీద పెన్నులూ, కాగితాలూ ఉన్నాయి. పది పన్నెండు నిమిషాల తర్వాత ఆమె వచ్చింది. ఆదివారం, సెలవు కావడంతో – పొద్దెక్కే కొద్దీ – చాలా మంది రావడం మొదలైంది. వారందరికీ నన్ను ఒక రచయితగా పరిచయం చేసింది.
“ఇదిగో ఈయన నా కొత్త రచయిత, మదన్.” రచయిత!
అలా నా జీవితంలోని అతి క్లిష్టమైన సమయం మొదలైంది. యుద్ధం చెసేవాడిని. తుపాకీ గొట్టాలూ, బాంబులతో చేసే దాని కన్నా కష్టతరమైన యుద్ధం. నాకు తెలిసి, అన్నిటి కంటే దుష్కరమైన పోరాటం.
ఒక వాక్యం మరో వాక్యంలోకి నా కన్నుగప్పి దూరిపోయేది. పెనుగులాడే వాడిని. పదాలు ఒక్కో చోట ఒక్కోలా ధ్వనించేవి. ఏది సరైనదో నాకెలా తెలియాలి? తల కొట్టుకునే వాడిని. ఏ పదాన్ని వాక్యంలో ఎక్కడ వాడితే – ఆవాక్యం అర్ధవంతంగానూ, వ్యాకరణబద్దంగానూ కూడా ఉండగలదు?అర్ధమయ్యేది కాదు.  కాగితాల మీద రాసే వాడిని, మళ్లీ  చించేసేవాడిని. రీముల కొద్దీ కాగితం, లీటర్ల కొద్దీ కిరోసిన్ ఖర్చయింది. కొన్నాళ్లు పనికి కూడా వెళ్లకుండా ఇంట్లో ఉండిపోయేవాడిని. కొంతకాలానికి నేను రాసినదాని మీద కాస్తంత సంతృప్తి కలిగింది‘నేను రిక్షాలు తొక్కుతాను’  అనే పేరుతో బర్తిక1981 జనవరి-మార్చి సంచికలో అది అచ్చైంది.
మహాశ్వేతా దేవి కేవలం రచయిత మాత్రమే కాదు. కవి మనీష్ ఘటక్ కూతురు, ఫిల్మ్ డైరెక్టర్ రిత్విక్ ఘటక్ మేనకోడలు, నాటకకర్త బిజన్ భట్టాచార్య స్నేహితురాలు – వీటన్నిటికీ మించి – ప్రతిఘటనా స్వరానికి బలమైన గొంతుగా నిలబడ్డ వ్యక్తి. ఆమె ఎడిట్ చేసే పత్రికలో నా పేరు కనబడ్డాక, జుగాంతర్ అనే వార్తాపత్రికలో ఒక సమీక్షకుడు నారచన గురించి రెండు మంచి మాటలు రాసాడు. తర్వాత  “ఎంతో దగ్గర అయినా మరెంతో దూరం”, అన్న పేరుతో రాసే తన ధారావాహికలో, మహాశ్వేతా దేవి నాపేరు ప్రస్తావించింది, “మదన్ గొప్ప వ్యక్తి. అతను రిక్షా నడుపుతాడు. అతను రాస్తాడూ… ” అంటూ ఆమె రాసింది. దానితో నేను నలుగురికీ పరిచయమయ్యాను, చాలా పత్రికలు నా రచనలు వేసుకుంటాం అన్నాయి. నాకు రిక్షావాలా రచయిత అని పేరు వచ్చింది. అది నాలో ఉత్సాహాన్ని నింపింది, నామీద నాకు నమ్మకాన్నిచ్చింది.
ఔను, నేను రాయగలిగేను.
ఛండాలుడిగా పుట్టిన నా ఇతివృత్తం’  అనే పేరున్న ఆయన ఆత్మకధ ‘Interrogating my Chandal life’గా ఇంగ్లీషులోకి తర్జుమా అయింది. (సిప్రా ముఖర్జీ అనువాదం). దానిలో ఈ అత్యద్భుత ఘటనని, అది తన జీవితాన్ని తిప్పిన మలుపునూ – మనోరంజన్ బ్యాపారి వివరించారు.
ఆయన చరిత్ర తెలుసుకోడం అంటే ఆయన విశిష్టత తెలుసుకోడమే :ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురణల్లో తన రచనకి స్థానం పొందిన  ఏకైక రిక్షావాలా – అలాటి వ్యక్తి  ప్రపంచంలోనే మరెవరూ లేరంటే అది అబద్ధం కాదు. పుట్టుకే – భయంకరమైన పేదరికం, అనిశ్చత వాతావరణంలోకి. పార్టిషన్ సమయంలో వెస్ట్ బెంగాల్లోని బంకురా జిల్లాలోని రెఫ్యూజీ కేంప్ – అతనికి పసితనం గుర్తుల్ని మిగిల్చింది. తర్వాత కొద్ది కాలానికే చెట్టు కొకరూ పుట్ట కొకరుగా అతని కుటుంబం చెదిరి పోయింది. ఎన్నో ఆటుపోట్లు.
ఎమర్జెన్సీ టైంలో అతన్ని ఆలీపూర్ జైల్లోనూ, తరవాత ప్రెసిడెన్సీ జైల్లోనూ పెట్టారు. అప్పుడే – ఒక తోటి ఖైదీ ప్రోత్సాహంతో – గోడలమీదా, నేలమీదా, మట్టితో, రాయితో, అక్షరాలు దిద్దుకుని కూడబలుక్కుంటూ చదువుకోడం నేర్చుకున్నాడు. జైలు లోంచి పుస్తకాల పురుగుగా మారి బయటకొచ్చాడు. ఈనాడు దళితసాహిత్యంలో అతని  అక్షరాలు నిజనిర్దేశాలుగా మారి వెలుగు పంచుతున్నాయి.


మనిషి, సరుకు- ఒక క్రూర వ్యాపారం

అక్రమ మానవ రవాణా గురించి రాసిన వ్యాసం  సెప్టెంబర్ నెల మాతృకలో ...


“బబ్బో, అమ్మా లేదంటే బూచాడొచ్చి ఎత్తుకుపోతాడు!”
“పిల్లలు ఒకళ్లూ పెద్దవాళ్లు లేకుండా తిరక్కూడదు అమ్మో దొంగలు ఎత్తుకుపోతారు.”
“తెలియని వాళ్లు ఇచ్చిన చాక్లెట్లు అవీ తినకూడదు. వాళ్లు పిలిస్తే వెళ్లకూడదు.” ఇవే చైల్డ్ ట్రాఫికింగ్‌ని ఎదుర్కోడానికి మనకి చేతనయిన రెస్పాన్స్‌లు. ఈమాటలు వింటూనే పెరిగాం.
చైల్డ్ ట్రాఫికింగ్ మాట కొత్తది కానీ, విషయం మనకి తెలీంది కాదు. సినిమాల్లోనూ దీని ప్రస్తావనలొచ్చాయి కాకపోతే ఒక ట్రాజెడీ లాగే చూపిస్తారు. లేదా హీరో వీర పోరాటానికీ లేదా విలన్ దుర్మార్గానికీ ఉదాహరణగానే. అందుకే సాధారణంగా ఏకొందరు అతి క్రూరులు చేసే విలనీలాగానో మాత్రమే భావిస్తూ ఉంటాం. పాలు తాగే కృష్ణుణ్ని ఇంట్లో అందరి కళ్లూ గప్పి పూతన ఎత్తుకుపోవడం కథ నాటి నుంచీ పిల్లల పాలిటి శత్రువులున్నారని గుర్తించాం. కాకపోతే ఎవరో దుష్టులు చేస్తూ ఉంటారని ఊహిస్తూ వచ్చాం. పూతన వచ్చింది కూడా కంసుడి కోసం కృష్ణుణ్ని చంపడానికే.
ఈనాడు వేల కొద్దీ పిల్లలు ఊహాతీతమైన హింసకు గురౌతున్నారన్నది మనం మర్చిపోలేని వాస్తవం. ప్రభుత్వాల కన్నా సేవాసంస్థల మీదే వారి శ్రేయస్సు ఆధారపడి ఉండడం మరొక చేదు నిజం. ప్రజ్వల అనే పేరు గల సంస్థ నడిపే సునీత కృష్ణన్ చైల్డ్ ట్రాఫికింగ్‌కి సంబంధించి భయంకరమైన సంఘటనల్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఆమె చెప్పిన ఒక ముగ్గురి పాపలు, ప్రణీత, షాహీన్, అంజలిల కథ. ప్రణీత తల్లి ఒక వేశ్య, ఆమెకు హెచ్ఐవీ సోకింది. ఎయిడ్స్ చివరి దశలో ఇక వృత్తి కొనసాగించలేని స్థితి వచ్చి – 4ఏళ్ల ప్రణీతను –బ్రోకర్‌కి అమ్మేసింది. సంగతి తెలిసి రక్షించేందుకు వీళ్లు వెళ్లే సమయానికే – ముగ్గురు వ్యక్తులు ఆ పాపని రేప్ చేసారు. షాహీన్ తల్లిదండ్రులెవరో తెలియదు కానీ వీరికి ఆమె రైల్వే ట్రాక్ పై దొరికింది, వీరు ఆమెను తీసుకొచ్చే సరికి అనేక మంది ఆమెను రేప్ చేసి ఉన్నారని గుర్తులు కనిపించాయి. దాని కారణంగా ఆమె పొట్టలో పేగులు బయటకొచ్చి ఉన్నాయట, వాటిని మళ్లీ లోనికి వేసి 32 కుట్లు వేసేరట డాక్టర్లు. అంజలి తండ్రి తాగుబోతు, ఆమెను పోర్నోగ్రఫీలో వాడబడేందుకు అమ్మేసాడు. ఈ ముగ్గురూ, ఇలాటి వేలాది మంది బాలలు – కేవలం 3,4,5 ఏళ్లవారు ఈ చైల్డ్ ట్రాఫికింగ్ విక్టింలు. అది సాడిజంలా కనిపించవచ్చు కానీ కాదు, బిలియన్ల వ్యాపారం. దేశాల బోర్డర్లు దాటి జరిగే మానవ రవాణా – డ్రగ్స్ ఆయుధాల తర్వాత అతి పెద్ద ఇల్లీగల్ ట్రేడ్.
బచ్‌పన్ బచావో ఆందోళన్ పేరున స్థాపించిన కైలాష్ సత్యార్ధిలాటి వారి వల్ల సమస్య, ఉద్యమరూపాన్ని సంతరించుకోడం, కొద్ది కొద్దిగా ప్రజల మధ్యకు రావడం మొదలైంది. ముఖాలు తెలియని అనామక అభాగ్యులు గుంపులు గుంపులుగా కాక – ముఖాలతో బయటకు రావడం ఒక పెద్ద మలుపు. బాధితులు వారి గొంతు విప్పి జరుగుతున్న అత్యాచారాల్ని బయటపెట్టడం చరిత్రలో ముందెన్నడూ జరగలేదు. దానికి ఆ సేవాతత్పరుల మానవత్వమే కారణం. ఎంతెంతటి అవరోధాలను కూడా దాటి నడిచినంత మేరా సస్యశ్యామలం చేసే జీవధారలాటి మానవత్వం నిండుగా ఉన్న వ్యక్తుల వల్లనే ఈకార్యం సాధ్యపడింది – సందేహం లేదు.
అయితే అందులో చిక్కుకున్న వారిని రక్షించడం, వారికి పునరావాసం కల్పించడం, అది ఎంత నిస్వార్ధమైన సేవ అయినప్పటికీ అది సమస్య పరిష్కారానికి మొదటి అడుగు మాత్రమే అని చెప్పుకోవాలి. ఒక్కొక్కరి వృత్తాంతం వింటే గుండెలు కరిగిపోయేమాట వాస్తవమే. వారి దురదృష్టం పట్ల మనకు కలిగే సానుభూతి - సమస్య లోతుల్లోకి మనని తీసికెళ్లదు. జాలి, దయ, కరుణ, సంఘీభావం – బాధితుల పట్ల కలగడం సహజం. కానీ – పరిష్కారం వెతకడానికి అవేవీ సహాయపడవు.
సమస్య వ్యాప్తి
2016 స్లేవరి ఇండెక్స్ (బానిసత్వపు సూచి) ఈనాడు 46 మిలియన్ల స్త్రీలూ, పురుషులూ, పిల్లలూ ఆధునిక బానిసత్వంలో ఉన్నారని, అందులో సగం ఆసియాలోనే ఉన్నారని చెబుతోంది. ఇంటర్నేనల్ లేబర్ ఆర్గనైజేషన్ ((ILO), లెక్కల ప్రకారం ఈ అక్రమ వ్యాపారంలో లాభాలు 150 బిలియన్లు దాటుతున్నాయట. చరిత్రలో ఎప్పటి కంటే ఈనాడు ఎక్కువ బానిసలున్నారని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది. ఇది వెనకబడ్డ దేశాల్లోనే ఉందనీ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉందని అనుకోడానికి లేదు. బంగ్లాదేశ్ లోని అనేక పరిశ్రమల్లో బలవంతపు వెట్టిచాకిరీ ఉంటే, లాస్ ఏంజిల్స్‌లో సెక్సువల్ దోపిడీకి గురౌతున్న ఆడవాళ్లున్నారు. ఉగాండాలో పిల్లల్ని సైన్యంగా వాడుతూంటే, చైనాలో మానవ అవయవాలను పంటల్లా వాడుతున్నారు. యూరప్ రాజధానుల రోడ్ల మీద ఉండే బిచ్చగాళ్లను ట్రాఫికింగ్ చేస్తున్నారు. ప్రపంచంలోని అన్ని మిలిటరీ స్థావరాలకీ అనుబంధంగా వేశ్యావాటికలుంటాయి. అదే అనుకుంటే, ఆ సైన్యం అక్కడ నుంచి కదలగానే, ఆ పిల్లలను ఇంకా డిమాండున్న స్థలాలకు తరలిస్తారు.
చైల్డ్ ట్రాఫికింగ్‌ లోకి పిల్లల్ని చేర్చే విధానాల్లో వివిధ దశలున్నాయి. ఏయే రకాలుగా దీనిలోకి లాగబడతారో తెలుసుకుంటే – వాటికి అక్కడక్కడ చెక్ చేసే ఉపాయాలను అన్వేషించగలుగుతాం. కిడ్నాప్ చేసి ఎత్తుకు పోయే సందర్భాల్లో పూర్తి నిర్బంధం ఉంటుంది. పని ఇప్పిస్తామని ఆశ పెట్టి కొందరినీ, సగం సగం నిజాలు చెప్పి కొందరినీ తీసుకెళ్లి వారిని అమానవీయ కార్యాలకు నియోగించడంలో మోసం ఉంటుంది. కొందరినైతే సెక్స్ వ్యాపారాలకు నియోగిస్తామని చెప్పి మరీ - వారి తల్లిదండ్రులను బెదిరించడం, డబ్బిచ్చి కొనుక్కుని దోపిడీ చెయ్యడం చేసి వారి పిల్లలను తీసుకుపోతారు.
ఎన్నో విధాలుగా పిల్లల ట్రాఫికింగ్ – తక్కిన వాటి కంటే భిన్నమైనదప్పటికీ - దానిని స్లేవరీ అనే వ్యాపారంలో భాగంగా చూసి అర్ధం చేసుకోవాలి. సామాజిక పరంగా విశ్లేషించుకోవలసినవి కొన్నుంటే, ఆర్ధిక పరంగా పరిశీలించాల్సిన అంశాలు కొన్ని.
సామాజిక కోణం లోంచి ట్రాపికింగ్ మీద ప్రభావం చూపుతాయనుకున్న అంశాలను గుర్తించి, వాటిని ఎదుర్కోగలిగే మార్గాలను అన్వేషించుకోవాలి.
జాతిపరమైన వేర్పాటు (ఎత్నిక్ ఫ్రాక్షనలైజేషన్)
విభిన్న మతాలూ, జాతులూ ఉండే బహుముఖ సమాజంలో, ఎత్నిక్ ఫ్రాక్షనలైజేషన్ బలపడుతోందంటే – ఆ సమాజం సమూహాలగా విడగొట్టబడుతోందని అర్ధం చెప్పుకోవచ్చు. సమూహాలు వేటికవిగా భావించుకుని బలపడాలన్న ఆకాంక్షల వల్ల – ఒక సమూహానికేదైనా ఆపద వస్తే తక్కిన సమూహాలు తగినంతగా స్పందించకపోడం – ఒక ధోరణి. భిన్న సమూహాల మధ్య పరస్పర సంబంధాలు తగ్గిపోయిన కొద్దీ సురక్ష చక్రం (safety net) బలహీనమౌతుంది. చైల్డ్ ట్రాఫికింగ్ విషయాని కొస్తే - బాధితుల వయసు తక్కువగా ఉండడమనే అంశం చాలా ప్రశ్నలు లేవనెత్తుతుంది. పిల్లలు కట్టుబానిసత్వంలో చిక్కుకునేలా చేసేవి ఏయే అంశాలని సోషియాలజీలో రీసెర్చిలు జరుగుతున్నాయి. [Nunn and Wantchekon రాసిన ‘slave trade & origins of mistrust in Africa’, 2011] దీనికి సమాజంలోని కొన్ని విలువలూ, జీవనవిధానాలూ కొంత వరకూ బాధ్యత వహించాల్సి ఉందని తెలుస్తోంది. ఆఫ్రికాలోని బానిసవ్యాపారం బహిరంగంగా జరిగిన సమయంలో ... సమాజంలో మెజారిటీ ప్రజ బానిసత్వాన్ని ఆమోదించేది. దాని వల్ల సమస్యని మొత్తంగా చూడడం పోయి, ఎవరికి వారు బానిసత్వాన్ని తప్పించుకునే ధోరణిలో ఉండేవారట. మానవ జీవితం పట్ల అగౌరవమూ, కొన్ని జీవితాలు వేరే వాటి కంటే ఎక్కువ విలువైనవన్న భావం – ఆ సమాజపు ప్రధాన లక్షణాలనీ తెలుస్తోంది. మన నమ్మకాలూ, సంస్కృతీ, అవగాహనలూ మన చుట్టూ జరిగేవాటిని ప్రభావితం చేస్తాయి. ఈనాడు ఎక్కడెక్కడైతే ట్రాఫికింగ్ తక్కువగా ఉందని తెలుస్తోందో, ఆ ప్రాంతాల ప్రజలు సహజంగానే ఉన్నత నైతిక విలువలున్నవారని, లేక తోటి వారి పట్ల ఎక్కువ ప్రేమ ఉన్నవారనీ చెప్పడానికి లేదట.
కానీ ‘వారు- మేము’ అని బలంగా విడదీసే శక్తులు పనిచేస్తున్న సమాజంలో ట్రాఫికింగ్‌కి ఎక్కువ అవకాశాలుంటాయని పరిశోధకులు నమ్మకంగా చెప్తున్నారు. సమాజంలో అల్లుకుపోయి ఉన్న ఈ విభజనరేఖలతో, పిల్లలు ఏ బలహీనవర్గానికి చెందినవారన్న వాస్తవం కలిసి పనిచేసి వారి ట్రాఫికింగ్‌ సంభావ్యతని సూచిస్తుందంటున్నారు.
అంతర్జాల రాపిడికి అసహాయంగా గురి కావటం (ఆన్లైన్ వల్నరబిలిటీ)
మనం గుర్తించవలసిన సామాజిక పరమైన మరో మార్పు ఇంటర్నెట్, అది పిల్లలను వేటాడడానికి పెద్ద సాధనం. పిల్లల ఆన్లైన్ వల్నరబిలిటీ అనే మాటని – ఇంటర్నెట్ మాధ్యమంలో ట్రాఫికర్లకి పిల్లల లభ్యత పెరిగింది అని అర్ధం చేసుకోవచ్చు. ట్రాఫికర్లకి ఇంతకు ముందు ముఖాముఖీ కలిసే అవసరం ఉండేది. కాని వారు ఇప్పుడు కొత్త బాధితులను పట్టడంలో సోషల్ మీడియాని ఉపయోగించుకుంటున్నారు, ఎవరికీ దొరకకుండా ఉంటూ, సులభంగా దెబ్బతియ్య గల అవకాశాల కోసం కాచుకుని కూచుంటారు. ఆన్లైన్‌ దాడిలో ఆరితేరుతున్నారు. వాట్సప్ మెసేజిలు పంపి, ఎవరన్నా జవాబివ్వగానే వారిపై తమ వల విసురుతూంటారు. ఇబ్బంది కలిగించగల ఫొటోలను, ఇతర వివరాలనీ చేజిక్కించుకుని తమ పట్టు బిగిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోకి సైతం వారి నెట్‌వర్క్ చొచ్చుకుపోయినట్టు వార్తలొస్తున్నాయి.
రాజకీయ అస్థిరతా, సామాజిక సంక్షోభం పెద్ద ఎత్తున పిల్లల జీవితాలపై ప్రభావం చూపుతుంది. యుద్ధాలూ, ప్రకృతి వైపరీత్యాలూ సంభవించే సమయం ప్రత్యేకించి పిల్లలను అతలాకుతలం చేస్తుంది. అది అదునుగా ట్రాఫికర్లు మరింత వేగంగా వారి ఎత్తులు వేస్తారని గుర్తిస్తే కొంతైనా మనం జాగ్రత్తపడగలం.
ఆర్ధిక కోణం
ఎమోషనల్ స్పందన అదుపులోకి తెచ్చుకుని – ఈ బానిసల వ్యాపారానికి మూలాల్లోకి వెళ్లాలి. వ్యాపారంగా దాన్ని అర్ధం చేసుకోవాలంటే ఈకోణంలోంచి చూడడం తప్పనిసరి. ట్రాఫికింగ్లో జరిగే మానవుల మార్పిడిని సప్లై, డిమాండ్ల పరస్పర చర్యగా చూసి – ఆ మార్కెట్ ని ప్రభావితం చేసే అంశాలు ఏవన్న ప్రశ్న వేసుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో (ఒక దేశం లోని కొన్ని ప్రాంతాల్లో కూడా) శారీరక శ్రమనీ, వస్తువులనీ, సెక్స్‌నీ చవకగా కొనుగోలు చేసే డిమాండ్ ఉంటుంది. అదే ఈబానిసల మార్కెట్‌ని నడుపుతుంది. అయితే మామూలు వ్యాపారాల కంటే బానిసల వ్యాపారపు మార్కెట్ రెండు అంశాల్లో భిన్నంగా ఉంటుంది.
ఒకటి ప్రాఫిట్ రేటు. వేల సంఖ్యలో నిత్యం కొనుగోలూ, అమ్మకాలూ జరిపే రాకెట్ (ముఠా)కి – ఒక వ్యక్తిని ఎక్స్‌ప్లాయిట్ చేసేందుకయ్యే ఖర్చు అతి తక్కువ. [Jakobsson & Kotsadam రాసిన ‘The Economics of Trafficking for Sexual Exploitation’, 2015] ఒక హోటల్ గదిలాగా మనిషిని మళ్లీ మళ్లీ అమ్మగలిగే అవకాశం ఉండడం వల్ల ఒకసారి బానిసగా మారిన వ్యక్తి ధర పడిపోయి పడిపోయి – అతి చవకగా అమ్ముడు పోయి కూడా తన యజమానికి లాభం అందిస్తాడు.
సమస్య తీవ్రతని అర్ధం చేసుకునేందుకొక ఉదాహరణగా – ఒక రెడ్‌లైట్ ఏరియాని తీసుకోండి. ట్రాఫికింగ్ చేయబడిన ఒక పిల్లకు ఒక వ్యక్తి 500 రూపాయలు చెల్లించాడనుకోండి. 10మందికి అమ్మితే ఒక రోజుకు ఎంత, ఆ ఏరియాలో ఒక 100 మంది పిల్లలపై గడించే బ్లాక్‌మనీ 5లక్షలు. ఒక దేశంలో అలాటి ఏరియాలు వేల కొద్దీ ఉంటాయి, ప్రపంచంలో ఈ వ్యాపారం సాగుతోంది 100 పైచిలుకు దేశాలతో హెచ్చించి చూడండి. ఇదంతా లెక్క ల్లోకి రాని అక్రమ ధనం. అసలు కీలకం అంతా ఇక్కడే ఉంది. ఈ పోగుపడ్డ ధనమంతా మళ్లీ డ్రగ్స్, ఆయుధాలూ, రాజకీయాల వంటి అక్రమ వ్యాపారాల్లోకి పెట్టుబడిగా మారుతుంది. ఆలాభాల్లో వాటాదారులు అత్యంత శక్తివంతమైన స్థానాల్లో ఉంటారని మనం గుర్తించాలి. ఇలా బలంగా వేళ్లూనుకున్న విషవృక్షాన్ని కూల్చడానికి వేర్వేరు నాలుగు దిశల్లోంచి బలమైన వేట్లు పడాలి.
నాలుగు ‘పి’ లు- ప్రోసిక్యూషన్, ప్రొటెక్షన్, ప్రివెన్షన్, పార్టనర్‌షిప్,
1. ప్రోసిక్యూషన్, (చట్ట సంబంధమైన చర్యలు)
అస్పృశ్యత, మనుషుల వ్యాపారం- రెండూ రాజ్యాంగ ప్రకారము నేరాలే కానీ కైలాష్ సత్యార్ధి అనే ఏక్టివిస్ట్ ఉద్యమించే దాకా ట్రాఫికింగ్‌పై సమగ్రమైన చట్టం లేనేలేదు. బచ్‌పన్ బచావో ఆందోళన్, 2011లో, ఆర్టికల్ 32 కింద – సర్కస్‌లలో పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రజాహిత వ్యాజ్యాన్ని వేసింది. దాని వచ్చిన ఒక మంచి ఫలితం – భారతదేశం అంతర్జాతీయ ఒప్పందంలో భాగమవడం. ఐక్యరాజ్య సమితి చేసిన పాలెర్మో ప్రోటోకాల్‌ని మన దేశమూ రేటిఫై చేసింది, (పాలించాలని నిర్ణయించుకుంది). దాని ప్రకారం: శ్రమ చేయించేందు కోసం – బలవంతం చేసి గాని, తప్పనిసరి చేసి గాని, మోసం చేసి గాని, ఎత్తుకుపోయి గాని - వ్యక్తులని - రవాణా చెయ్యడం, నియోగించడం, ఆ రవాణాకి సహకరించడం, దాని కోసం సొమ్ము పుచ్చుకోడం – ఇవన్నీ ట్రాఫికింగ్ పరిధిలోకి వస్తాయని – కఠినంగా శిక్షించవలసిన నేరాలని స్పష్టమైంది.
ఏజెంట్‌ని అరెస్ట్ చెయ్యడమో, ట్రాఫిక్ అయిన పిల్లలని ఉద్యోగంలో పెట్టుకున్న ఫేక్టరీలని మూయించెయ్యడమో– చాలదు. డబ్బు ఎక్కడెక్కడ చేతులు మారిందో ఆ జాడలన్నిటినీ పరిశీలించి, సంబంధిత వ్యక్తులపై చట్టానికి అప్పగించాలి.
2. ప్రొటెక్షన్ (రక్షణ చర్యలు)
బానిసత్వమే మానవుడికి ఒక మచ్చ అనుకుంటే, పిల్లలను బానిసలుగా మార్చడం దానికి అనేక రెట్లు తీవ్ర సమస్య. ఒక సారి వారి మూలాల్నుంచి పెకిలించబడ్డాక, వారి జీవితాలకు ఎటువంటి పూచీ ఉండదు. ఒకసారి ఆ వలయం నుంచి రక్షించబడినా, స్వయంసమృద్ధి కలిగే దాకా వారికి సురక్షిత స్థావరం దొరకడం చాలా కష్టం. అక్కడ మళ్లీ వారిపై ఏ అత్యాచారమూ జరగకుండా కాపలా కాయడమన్నది ఏ సంస్థకైనా కత్తి మీద సామే.
3. ప్రివెన్షన్ (నిరోధించే చర్యలు)- శాశ్వతంగా దీన్ని నిర్మూలించాలంటే ఒకటే మార్గం, కూకటి వేళ్లని పెకిలించడం. ఆర్ధిక శక్తిని ఉపయోగించి, ఏ వ్యాపారాన్ని దెబ్బతియ్యాలన్నా దాని లాభాన్ని శూన్యం చెయ్యాలి. ఒక పిల్లవాడిని బానిసగా మార్చేందుకయ్యే ఖర్చు పెంచాలి అంటే లావాదేవీలలో (కాస్ట్, సప్లై, ప్రోడక్షన్ అన్ని దశల్లోనూ) ఆటంకాలు కల్పించగలగాలి. ట్రాఫికర్లు ఆశించే లాభాన్ని ప్రబావితం చెయ్యగలిగే పాలసీలను - సప్లై వైపు నించీ, డిమాండ్ వైపు నించీ – కూడా తయారు చేసుకోవాలి. వాటి కోసం పటిష్టమైన చట్టాలనీ, వాటి అమలునూ కోరుకుని సాధించే రాజకీయ ఇచ్ఛాశక్తి (పొలిటికల్ విల్) కావాలి మనకి.
4. పార్టనర్‌షిప్ (భాగస్వామ్యం వహించే చర్యలు)
జూలై 30న ట్రాఫికింగ్‌కి వ్యతిరేక దినంగా గుర్తించారు. దానిని ప్రజల్లో ఈ సమస్య పట్ల సానుభూతినీ, సహకారాన్నీ కూడగట్టడానికి వినియోగించాలి. సునీతాకృష్ణన్ వంటి అపూర్వ మహిళలు – తనపై 8వ ఏట జరిగిన గాంగ్ రేప్ వంటి దారుణాన్ని వ్యక్తిగతంగా అధిగమించి నిలబడడమే కాక ఆ నిప్పుల వర్షంలో నిలబడ్డ దురదృష్టజీవుల్ని నీడలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంలో ఆమె పదేపదే ఒకే మాటను చెప్తుంది – ఈ పోరాటంలో ఆమెకు అత్యంత ప్రయాస కలిగించే అంశం, సమాజం ఈ బాధితులను కలుపుకునేలా చెయ్యడమేనట. ఆమెతో కలిసి పని చేసిన వారు సైతం – ఆ విక్టింలను పనిలో చేర్చుకోడానికి ఇష్టపడకపోడాన్ని ఆమె బాధగా ఎత్తి చూపిస్తుంది. సమాజపు ఆమోదం కోసం నాలుగో దిశగా వేసే ఈ అడుగు కూడా ప్రధానమైనదే.
శాశ్వత పరిష్కారం సుదూరంగా ఉంది, నిజమే ... మరి ఈలోగా మనం ఏమేం చెయ్యగలం? మెజారిటి ప్రజలకు ఇది ముఖ్య సమస్య అని చెప్పి ఒప్పించగలగాలి. అది ఎక్కడో బలహీనవర్గపు పిల్లలకు సంభవించేది మన పిల్లలకు కాదని అనుకునే మధ్యతరగతికి – సమస్య అసలు స్వరూపం తెలియజేయాలి. దిక్కులేని పిల్లల రక్తం తాగి బలిసిన మృగం, దాని వేటును ఉన్నతవర్గపు పిల్లల మీద కూడా వెయ్యకమానదు. ఒక ఐయేఎస్ ఆఫీసర్ కూతురు కూడా ఈ ట్రాఫికింగ్ కి బలయి, ‘ప్రజ్వల’ రక్షించగా బయటపడ్డ సంగతి గుర్తు చెయ్యాలి. మనకి పక్కనే అగాధాన్ని ఉంచుకుని, నిత్యం దానిలో వేలాది పిల్లలు నెట్టబడుతూంటే - దానిలో మనం పడంలెమ్మని ఊరుకోడం మూర్ఖత్వమని వారికి వివరించగలగాలి.
హైడ్రాలాగా అనేక ముఖాలున్న సమస్య ఇది కనక ప్రత్యేక నైపుణ్యం కల పౌర సమాజ సంస్థలు దీనికని పూనుకోవాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్ జీవోలన్నీ – కలిసి పనిచేసేందుకు సమైక్యవిధానాలను రూపొందించుకోడం, లోపాలను పూరించుకోడానికి అవసరమైన టెక్నాలజీని సమకూర్చుకోడం, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించడం వంటి అనేక కార్యక్రమాలను – ఒకే లక్ష్యసాధన - కోసం ప్రణాళికగా చేపడితే తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అన్నిటి కంటే ముందు ఈసమస్య తీవ్రత తెలిసేటట్టు ఎన్ జీవోలు, ప్రజలకి సరైన అర్ధాన్ని అందించని ‘ట్రాఫికింగ్’ అనే పటాటోపపు మాటను వదిలి ‘దొంగిలించడం’, ‘అమ్మడం’ అనే మాటలను వాడడం మంచిది.