Tuesday 11 January 2022

అవార్డు స్వీకారం – వ్యక్తిగత నిర్ణయం 

ఎవరికైనా అవార్డు లభించింది అంటే, వారు చేసిన కృషిని గుర్తించి, పది మందిలోనూ గౌరవించడం, వారికి ఒక ప్రత్యేకతను అందించడం. అప్పటికే ప్రజాదరణ పొందారన్న దానికి రుజువు కావచ్చు, ఇక ముందు పొందబోతారనే దానికి సూచనా కావచ్చు – అవార్డు. అది చేకూర్చే ప్రయోజనం ఏదో ఉందని మాత్రం స్పష్టంగా ఊహించవచ్చు. స్థూలంగా చెప్పాలంటే – ఇంతే, కాని దానిలో చాలా మెలిక లున్నాయి.

కొంత మందికి ఇవ్వడం ద్వారా అవార్డుల ఘనతను పెంచుదామని ఇచ్చేవారు ప్రయత్నాలు చేస్తే, ఆ అవార్డును సామ దాన భేద దండోపాయాలతో – పుచ్చుకుని, తద్వారా ‘ఘనత’ను కొట్టేయ్యాలని అనేకులు ప్రయత్నిస్తూ ఉంటారు. వారి అర్హత గురించి అనేక అనుమానాలు వినవస్తాయి. దూషణ భూషణ తిరస్కారాలకు అతీతమైన కార్యశూరులు వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగిపోతారు. అది ఎంత చిన్న సంస్థ అయినా సరే, లోపాయకారీ ఒప్పందాల వల్ల లభిస్తున్నా సరే, డబ్బులిచ్చి కొనుక్కుని అయినా సరే అవార్డు కొట్టేయ్యాలి అని గట్టి పట్టుతో ఉన్నవారు, ఇప్పుడు దానిని దక్కించుకున్న వారి కోసం చప్పట్లు కొడితే, ఏదో ఒక రోజున మన ప్రయత్నాలో, పైరవీలో ఫలించి మనకు అవార్డు అంటూ వచ్చినప్పుడు – మన కోసం కూడా చప్పట్లు కొట్టే గుంపు ఉంటారనే ముందు చూపుల వారూ అనేకులు ఉంటారు, నా మట్టుకు నాకు,వారితో పేచీ ఏదీ లేదు. అవార్డులనేవి కొన్ని ద్వారాలను తెరుస్తాయి, కొన్ని మార్గాలను సుగమం చేస్తాయి అని మెజారిటీ ప్రజలు నమ్మినప్పుడు – వాటి కోసం వారికి చేతనయిన మార్గాలలో ప్రయత్నిస్తున్నారు తప్పేముంది అనుకుంటాను.

అయితే, అధికార చర్యలను ప్రతిఘటించేవారు, దాని నిర్ణయాలను వ్యతిరేకించేవారూ – ‘అవార్డును పుచ్చుకోవడం – ఆమోదాన్ని అందించడంతో సమానం’ అనే అవగాహన కారణంగా అవార్డులను తిరస్కరిస్తారు. తమ స్థాయికి తగినవని తోస్తేనే తీసుకుని, కాని పక్షంలో వదులుకునేవారు, తమ భావజాలానికి అనుకూలమైన వాటిని మాత్రమే ఆమోదించేవారు, కేవలం తటస్థ /ప్రైవేట్ సంస్థల నుండి మాత్రమే తీసుకునేవారు, ప్రభుత్వం నుండి లభించడం అంటే యావత్ ప్రజానీకానికి ప్రాతినిథ్యం వహించేదని భావించి వాటిని మాత్రమే స్వీకరించేవారూ – ఇలా ఎన్నో రకాలు. ఆ స్పందనలలో ఉండే స్వల్ప భేదాలూ, ఈ వైవిధ్యం – అంతా గతంలోని మాట. ఇప్పుడు ఆ గొంతుకలేవీ వినబడడం లేదు పెద్దగా. అసలు ఏ ఒకరినో ఎంపిక చేసి వారికి ఒక ప్రత్యేకతను ఆపాదించడం, గౌరవాన్ని కట్టబెట్టడం – అనే ఆలోచననే మౌలికంగా తిరస్కరించేవారూ ఉంటారట కానీ నేను చూడలేదు. “ఎప్పుడో మాకు రావలసింది కనీసం ఇప్పటి కన్నా ఇచ్చారు కానీయండి” అని మూలిగే ‘గతకాల ప్రతిభావంతుల’ను చాలా మందిని చూస్తున్నాను.

ఇన్ని రకాల వారున్నారు కాబట్టే, ఎప్పటికప్పుడు – అవార్డు స్వీకారానికి సమర్ధనగా వింతవింత కారణాలు వినబడుతూ ఉంటాయి. విప్లవాత్మకమైన భావాలను, ఉత్తమ శిల్పంతో – కథల్లో లోతుగా ప్రవేశపెట్టి తెలుగుకథను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లిన రచయిత ఒకరు – ‘ఏ అవార్డునైనా, రివార్డునైనా – కథ కోసం తాను చేపట్టిన ఒకానొక ప్రాజెక్టు కోసమే వాడతాను’ అని ప్రకటించి – అవార్డులను స్వీకరించారు. తిరుగుబాటును అతి శక్తివంతంగా తన కవిత్వంలో వినిపించిన కవి మరొకరు – ‘నా కవిత్వానికీ, అవార్డుకూ ఏ సంబంధమూ లేదు, అది తీసుకున్నా – నా గొంతుక అదే స్థాయిలో పలుకుతుంది’ – అని నొక్కి చెప్పారు. ఇలా అవార్డుల గురించి పరస్పర వ్యతిరేక అభిప్రాయాలు వినవస్తున్నా, అవార్డుల గురించిన చర్చ జరుగుతూనే ఉంది. ఏమిటి కారణం? ఎవరు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ప్రశ్నిస్తున్నారు? దాని గురించి చర్చించే ముందు, ఎవరినిప్రశ్నిస్తున్నారు – అనే విషయంలో స్పష్టత ఉండాలి.

పురాణాలలో కొత్త స్వారస్యాలు వెతికి చెప్పే పండితులకో, ‘సెల్ఫ్ హెల్ప్’అనే పల్ప్ ఫిక్షన్ రాసుకునే లౌకికులకో అవార్డులు వస్తే, దాని గురించి ఎవరూ ప్రశ్నిస్తారనుకోను. అయితే, ఆలోచనాపరులూ, పదికాలాల పాటు నిలిచే అక్షరాలు రాసి ప్రజల మనసులపై ముద్ర వేసిన సాహిత్యకారుల విషయంలో ప్రశ్నలు లేచే అవకాశం ఉంది. ఏ రచనలకు, రచయితకూ ప్రాసంగికత ఉందో, వారి గురించే చర్చ జరుగుతుంది. మరి ఇప్పుడు అవార్డు లభించిన విప్లవకవి గురించి – ఎవరికీ పట్టనేలేదు నిజానికి.
ఇస్తే తీసుకుంటాం, లేదంటే ఊరుకుంటాం – ఆ విషయాని కంత కంటే ప్రాముఖ్యత లేదు అని నిజాయితీగా నమ్మి, ఆ ప్రకారంగానే ఆచరించే సాహిత్యకారులు ఉంటారు. వారిలో అసాధారణ ప్రతిభాశాలులు, లబ్ధ ప్రతిష్టులు కూడా ఉంటారు – నేను వారికి మాత్రమే ఈ చర్చను పరిమితం చేస్తున్నాను. ఒకవేళ అవార్డు వైపు మొగ్గు చూపినా – అది కేవలం సాహిత్యపరమైన కారణాల వల్లనే – అంటే మరింత ఎక్కువ మందికి తమ రచనలు చేరుకుంటాయనో, మరిన్ని భాషలలో పాఠకులకు అందుతాయనో, ఎన్నో తరాల పాటు సుస్థిరంగా మన స్మృతి నిలిచి ఉంటుందని ఆశ తప్ప, స్వార్ధ పరత్వమో, స్వీయానురాగమో ప్రేరణలు కావని కూడా ఒప్పుకుని, ఆ తర్వాతనే చర్చ సాగిద్దాం.
బాధ్యతతో రచనా వ్యాసంగం సాగించే వారు, ప్రజాస్వామిక విలువలను రచనలలో ప్రధానంగా చిత్రీకరించేవారు – రచయితలను జైలులో వేసిన సమయంలో – అవార్డును స్వీకరించడం ఎంత వరకూ సమంజసం అన్న ప్రశ్న లేచినప్పుడు – “వారి ఇష్టం, తీసుకుంటారో మానుతారో, మనమెవరం నిర్ణయించడానికి?”
“నిజానికి ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని వారినీ, ఆ పరిధి లోనికి రాని రచనలనీ – ప్రశ్నించలేము, విప్లవ రాజకీయాలతో సంబంధం పెట్టుకున్నవాళ్లే అవార్డుల పట్ల ఈ దృక్పధంతో వ్యవహరించడం లేదు, ఇంక అలా పెట్టుకోనివారిని ఏమనగలం?”అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

బలమైన గొంతుకలను, తమ పక్షాన చేసుకోవడానికి ప్రభుత్వం అందించే లంచాలు అవార్డ్‌లనే అవగాహన కొన్ని సందర్భాలలో మనకు కనిపిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ, అవార్డు స్వీకారం అనేది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం అనీ, నైతిక చట్రంలో దానిని పెట్టి, తూచకూడదనీ అంటున్నారు. విప్లవాల కబుర్లు చెప్పి, వెనుదిరిగి ప్రభుత్వపు పంచన చేరిన వారిని విమర్శిస్తే అర్థం ఉంది గానీ, అలాటి వాగ్దానాలు చెయ్యని వారిని ఎలా అడుగుతాం అని కూడా చాలా మంది అంటున్నారు. కానీ ఇది వ్యక్తుల మీద ‘మాట తప్పేరన్న’అభియోగాన్ని మోపే సందర్భం కాదు. ఈ విషయానికున్న ప్రాముఖ్యత ఎటువంటిదంటే, వ్యక్తిగత స్థాయిని దాటి సామూహిక స్థాయిలో దాని గురించి, సంవాదం జరగవలసి ఉంది.

మరొక కోణంలో కూడా చర్చ జరుగుతోంది – అనాదిగా తీరిక సమయమన్నదే అందనివ్వకుండా, శతాబ్దాల తరబడి వారి కళనూ, సృజననూ- మెయిన్ స్ట్రీంలోకి రానివ్వకుండా అడ్డుకుని, ఇక దశాబ్దాల నుండి వారి సృష్టిని వారికే తెలియకుండా చేజిక్కించుకుని –అంచుల్లోకి నెట్టివేయబడిన సమూహాలు – స్త్రీలూ, దళితులూ -వారికి సంబంధించిన చర్చ. ఈ గుర్తింపు, గౌరవాల రాజకీయాలలో వారి వైఖరి ఎలా ఉండాలి అన్నది కూడా చర్చనీయాంశమే. దానికి సంబంధించిన ఒక అభిప్రాయాన్ని ఇక్కడ ప్రస్తావించడమే తప్ప – వివరంగా చర్చ చెయ్యబోవడం లేదు:
“ముందు నుయ్యీ, వెనక గొయ్యీలా ఉంటోంది దళితులకు, ఈ వామపక్ష భావాల సాహిత్యకారులు ఎక్కడుంటే అక్కడ – ఇదే జరుగుతుంది, వీళ్ల మాటలు వినకపోతే, దుష్ప్రచారం చేస్తారు, దూరం పెడతారు, సరే అని వీళ్ల మాట విని అవార్డులను కాదనుకుంటే, ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేస్తుంది. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ప్రభుత్వపు ఫలానా పాలసీకి నిరసన అనో, మరేదో చర్యకు వ్యతిరేకంగా అనో – మీమీద ఏదైనా ఒత్తిడి తెస్తారేమో. మీరు అదేదీ పట్టించుకోకండి, అవార్డులు వద్దనడం, వెనక్కి ఇచ్చేయడం వంటి కుప్పిగంతులు వెయ్యకండి, మరీ ముఖ్యంగా – దళిత రచయిత్రులను ఉద్దేశించి ఈ సలహా చెప్తున్నాను” అని హెచ్చరికలు వినవస్తున్నాయి.
ఏదో ఒక ఒత్తిడి వల్లనే తప్ప, అవార్డ్ వద్దనే నిర్ణయాన్ని స్వంతంగాఎవరూ తీసుకోరనీ, అవార్డును సాధింవడం, బయటి ఒత్తిడులకు లొంగకుండా దానిని ఉంచుకోవడం- అదే దళిత రచయితల తక్షణ కర్తవ్యం అనీ వీరి విశ్వాసం అనుకుంటాను. ఏది ఏమైనా, దళితులపై దాడులు ఎప్పటికంటే కూడా ఎక్కువైన ఈ తరుణంలో – ఏది సరైన అడుగు, ఏది వారి లక్ష్యం వైపు పడే అడుగు అనేది నిర్ణయించుకోవలసింది వారే.
__________
వెరసి, అవార్డు అంటూ రావడమే సృజనకు శిఖరాయమానమైన మజిలీ అనే ఏకాభిప్రాయానికి వచ్చారు మనలో చాలా మంది.కాబట్టి అవార్డులు నిరాకరించడం – త్యాగం చెయ్యడంతో సమానంగా భావిస్తున్నారు, వాటిని నిరాకరిండం అంటే – తనకుమాలిన ధర్మమే. అలాటి ‘ఆదర్శాలను’ రచయితల మీద రుద్దుతున్నారు అభ్యుదయ వాదులు – అనే అభిప్రాయంతో చాలా మంది ఉన్నారు.దానితో నేను ఏకీభవించడం లేదు. దీనిలో మనం సాధారణంగా పరిగణనలోకి తీసుకోని అంశాలు ఉన్నాయని నా ఉద్దేశం. అవార్డులను సైద్ధాంతికంగా వ్యతిరేకించడాన్ని కాకుండా, వాటి ఫలితాలను, ప్రభావాలనూ ప్రాపంచిక దృష్టికోణంతో చర్చించే ప్రయత్నం చేస్తాను. ఆ సందర్భంలో ‘ఇమేజ్’కు ఉదాహరణగా చూపించడానికి – తెలుగు సాహిత్యంలో ‘స్టార్’లంటూ ఎవరూ కనబడక కొంచెం ఇబ్బందిపడ్డాను – వేరే రంగాల ప్రముఖుల పేర్లు చెప్పక తప్పలేదు.

ముందుగా ఒక విషయాన్ని స్పష్టపరుచుకోవాలి. అవార్డు అంటే – కేవలం పరోపకార పరాయణత్వంతో ఒకరు మరొకరికి అందించే ఒక బహుమతి అనే భ్రమలో ఉన్నాం. దాని నుండి బయటపడాలి. మనం అప్పుడప్పుడు పొగడ్తలు వింటూ ఉంటాం చూడండి, ‘ఫలానా వారి వల్ల అవార్డుకే పేరు వచ్చిందని’, అది నిజమే కూడా కొన్ని సందర్భాలలో. పుచ్చుకునే వారికే కాదు, ఇచ్చేవారికీ, ఇప్పించే వారికీ– లాభం రకరకాల రూపాలలో (గుడ్‌విల్, లెజిటిమసీ, రెలవెన్స్) ఉంటుంది.

దీనిని వివరించడానికి ఒక ఉదాహరణ ఇస్తాను: అడ్వర్టైజ్మెంట్ రంగంలో బ్రాండ్ అంబాసిడర్‌లు ఉంటారు. వారి ఉత్పత్తికి సరిపోయే, ప్రజల మనసులో నాటుకుపోగల ఒక ఇమేజ్‌ను వారు ఊహించుకుంటారు, దానికి కేంపెయిన్‌ ద్వారా రూపకల్పన చేస్తారు, దానిని పోషించగల ప్రముఖుల కోసం వెతుకుతారు, అప్పటికే అటువంటి ఇమేజ్‌ను ఆ ప్రముఖులు సాధించి ఉంటే కేంపెయిన్ మరింత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కనక అటువంటి వారికి మరింత గిరాకీ. సినిమా నటి తాప్సీ పణ్ణు విషయమే తీసుకోండి, ఒక బలమైన, స్వతంత్ర వ్యక్తిత్వం అనే గుర్తింపు అప్పటికే వచ్చింది కనక ఎముకలకు పుష్టిని ఇస్తుందని చెప్పే పానీయానికి ఆమెను ఎన్నుకున్నారు. అంటే అందచందాలూ, సినిమాల విజయమూ, నటనా సామర్ధ్యం మాత్రమే కాదు, ‘ఇమేజ్’ – అంటే ప్రజలు ఆమెను ఎలా చూస్తున్నారు అనేది అక్కడ ప్రధాన అంశం. సాహిత్యకారుల విషయంలో ఇమేజ్ అంటే, వారి భావజాలం, వారు నమ్మే విలువలతోపాటు, ప్రజల మనసులను తాకగల వారి నైపుణ్యం అని అర్థం చేసుకోవాలి. అరుంధతీ రాయ్ బుకర్ అవార్డ్‌ను తీసుకుంది. విశ్వవ్యాప్తంగా, బుద్ధిజీవులకు పరిచయం అయ్యింది. దాని వల్ల తన భావాలకు, తాను సహకారం అందించే ఉద్యమాలకూ ప్రచారం జరిగింది.

మరో విషయం, ఎంపిక చేసుకునేది సంస్థలే కాదు – ప్రముఖులకు కూడా తమ ఇమేజ్‌ గురించి పూర్తి అవగాహన ఉంటుంది. ఏ బ్రాండ్‌కు తమ పేరును జోడించాలనే విషయంలో ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. ఆమిర్ ఖాన్ సినిమా అవార్డులకు దూరంగా ఉండడం – ఆదర్శవాదమో, త్యాగమో కాదు. అదే అయితే, ఆస్కార్ కోసం వెళ్లి ఉండేవాడు కాదు, దీనానాధ్ మంగేష్కర్ అవార్డును పుచ్చుకుని ఉండేవాడు కాదు. సినిమా అవార్డ్‌ల చవకబారు వ్యవహారం తన ఇమేజ్‌ను కించపరుస్తుందని భావించాడు. ఈ ఉదాహరణ ద్వారా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే – తీసుకోవడానికీ, వద్దనడానికీ కూడా – ఎవరికి సమంజసమనిపించే కారణాలు వారికి ఉండవచ్చు అని.

కనుక అవార్డులను అందరూ ఒకే దృష్టితో చూస్తారనేది వాస్తవం కాదు. వారి కేది ప్రయోజనకారి అనిపిస్తుందో, వారి సాహిత్య పయనంలో వారే మజిలీ వద్ద ఉన్నారో, వారి సృజనకూ, లెగసీకీ ఏర్పడే హానిలాభాలేమిటో బేరీజు వేసుకుని – ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటారు.
__________

మరి రచయిత తనకు సరైనదని తోచి తీసుకున్న నిర్ణయం గురించి, పాఠకులకు తమ అనంగీకారం, వ్యతిరేకతను తెలిపే హక్కు, విమర్శ చేసే హక్కు – ఉంటుందా ఉండదా అనేది ప్రశ్న. దానికి జవాబుగా, ఇటీవలే జరిగిన ఉదంతాన్ని తీసుకుందాం:
అవార్డు తీసుకున్నందుకు – తాను అభిమానించే రచయితపై – వ్యక్తిగత స్థాయిలో ఒక వ్యక్తి నిరాశను ప్రకటించారు. రచయిత పరిచయం చేసిన ప్రగతిశీల భావాలతోనూ, జీవితంపై వారు చేసే సూక్ష్మ పరిశీలనలతో ప్రభావితమై, ఆ అక్షరాలతో మమేకం చెంది,వారి ప్రవర్తనలో కనిపించే ప్రజాస్వామిక విలువలను గమనించి, అవేవిలువలకు భంగం కలుగుతున్న బయటి పరిస్థితులకు తానువిచలితమవుతూ, రచయిత నుండి సంఘీభావాన్ని అపేక్షిస్తూ, ఒక అభిమాని వినిపించిన ‘భావావేశపు స్పందన’ (emotional response) గా నాకది కనిపించింది. రచయిత ఏమని ప్రతిస్పందిస్తున్నారో – తెలియదు కానీ – వారి అభిమానులో, లేక అవార్డుల అభిమానులో గానీ – తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దిశ ఎలా ఉందో చెప్పడానికి ఈ రెండు వాక్యాలు చదవండి:
“అవార్డు వచ్చిందని, వారి మీద అసూయ.”
“తెలుగులో ఇంకా చాలా మందికి అవార్డులు ప్రకటించబడ్డాయి కదా? వాళ్ళను ఎందుకు విమర్శించడం లేదు?”
రచయితలకూ, వారి రచనల వల్ల ప్రభావితమైన పాఠకులకూ ఉండే అనుబంధాన్ని వీరెవరూ గుర్తించడం లేదనిపించింది. పాఠాన్ని శ్రద్ధగా విని వంటబట్టించుకున్న విద్యార్ధే, ప్రశ్నలు అడిగే శ్రమతీసుకుంటాడు. ఒక రకంగా అది ఉపాధ్యాయుడి విజయమే. భావ ప్రసారం జరిగిన చోట, వ్యక్తులు సన్నిహితమవుతారు. ఇబ్బందికరమైన ప్రశ్నలను సైతం వేస్తారు.

అంతమాత్రాన ఎవరి కోరికలు మరెవరికీ శిరోధార్యాలు కానవసరం లేదు. విన్నాక, ఆలోచించాక, నిర్ణయం తీసుకునే హక్కు సంపూర్ణంగా రచయితకు ఉంటుంది. దానిని ఎవరూ కాదనరు – అయితే, రచయితను ఆ విషయమై సంబోధించడమే నేరంగా మారిన పరిస్థితి నాకు రుచించడం లేదు. ఆవేదన వ్యక్తీకరణ పట్ల సానుభూతి లేకపోవడం, అలాటి ప్రశ్నలు సంధించే వారందరినీ – కుసంస్కారులుగా, ఓర్వలేనివారుగా, అహంభావులుగా చిత్రీకరించడం అభ్యంతరకరంగా అనిపించింది.

ఇలాటి ప్రతిస్పందనలు, ప్రశ్నలను నీరుగారుస్తాయి. అవార్డులు తీసుకోవడం మానడం అనేది, వ్యక్తిగత నిర్ణయమైనా -ప్రజల మీదా, తోటి రచయితల మీదా ప్రభావం చూపగల నిర్ణయం కనుక, చర్చజరిగేందుకు సానుకూల పరిస్థితులు ఉండాలి. నిర్ణయం తీసుకునే వారి మనసులో ప్రశ్నలను లేవనెత్తడం, సమాధానాలను సరఫరా చేయగలగడమే – ఈ చర్చలకు లక్ష్యంగా ఉండాలి. అవార్డుకు సర్వవిధాలా అర్హులై, తమ ప్రయత్నం ఏమీ లేకుండా – పిలిస్తే వెళ్తాం, ఇస్తే పుచ్చుకుంటాం అనే వారితోపాటు, ఈ విషయంలో ఇంకా ఏ నిర్ణయానికీ రాని వారికి కూడా ఇలాటి చర్చల వల్ల మేలు జరుగుతుంది. తాము తీసుకునే నిర్ణయపు ప్రభావమేమిటని ఆలోచించుకుంటారు, దానిలో ధ్వనించే రాజకీయాల పట్ల తమకు అభ్యంతరం ఏమైనా ఉందా అని తరచి చూసుకుంటారు. అంతిమంగా నిర్ణయం వారిదే – అది ఏదైనా సరే.

కాలం ఎప్పుడూ ఇలాగే ఉండిపోదు, వ్యక్తులెప్పుడూ ఒక్కలాగానే ఉండరు. ఒకనాడు ప్రజల కోసం పనిచేసిన వారు, ఇప్పుడు ఉద్యమాలను హేళన చేయవచ్చు. అలాగే తన చుట్టు పక్కల ఏమౌతోందనేది ఏనాడూ పట్టని వ్యక్తి – తన దృష్టిని ఏ మారుమూల ప్రదేశానికో ప్రసరించి, అక్కడి ప్రజలను సంఘటిత పరచవచ్చు. ఇవేళ ప్రజల కోసం మాట్లాడేవారెవరూ, పుడుతూనే సామాజిక స్పృహను తమ వెంటతెచ్చుకుని రాలేదు.

ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంలో ఒక స్పృహ కలుగుతుంది. ప్రకాష్ రాజ్ అనే నటుడు 2016 దాకా విజయవంతమైన నటుడు మాత్రమే. తన స్నేహితురాలు గౌరీ లంకేష్‌ను హత్య చేసిన మతతత్వ మూకల రాజకీయాలను ఎదిరించడం – తన వ్యక్తిగత బాధ్యతగా తోచిందిఒక్కసారిగా అతనికి. తోటి మనుషుల జీవితాలను లోతుగా పరిశీలించి, వారి అభివృద్ధిని కాంక్షించి బాధ్యతతో రచనలు సాగించే వారికి ఈ స్పృహ కలిగే అవకాశం మరింత ఎక్కువ ఉంటుంది. వారి నుండి సహకారాన్నీ, సంఘీభావాన్నీ అపేక్షించడం ఎన్నటికీ వృధా కాబోదు. కనుక ప్రశ్నలు వేసేవారు వేస్తూనే ఉండాలి.

కులం - తరచుగా వేస్తున్న ప్రశ్నలు - సమాధానాలు



కులానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఈ విలువైన ఇంటర్వ్యూను వీడియో రూపం నుండి లిఖిత రూపంగా మార్చి, తెలుగులోకి అనువాదం చేసి ఇచ్చిన Madhura Dhara Talluri Kalyani SJ లకు మాతృక ధన్యవాదాలు తెలియచేసుకొంటోంది.

కులం - తరచుగా వేస్తున్న ప్రశ్నలు - సమాధానాలు
శబ్దరూపంలోని ఇంటర్వ్యూను రాతపూర్వకంగా మార్చినవారు: మధురధార
ఆంగ్లం నుండి అనువాదం: ఎస్ జె కల్యాణి
సూరజ్ యెంగ్డే మన దేశపు ప్రముఖ విద్యావేత్త, ప్రజా మేధావి. జీజే మ్యాగజైన్ -25 ‘అత్యంత ప్రభావవంతమైన యువ భారతీయుల -జాబితాలో ఈయన పేరు ఉంది. ‘అత్యంత ప్రభావవంతమైన యువ దళితుల’లో ఈయన ఒకరని జీ వార్తాసంస్థ పేర్కొంది. సూరజ్ రాసిన ‘క్యాస్ట్ మాటర్స్’ (కులం చాలా ముఖ్యం)’ విజయవంతమైంది. అవార్డు గెలుచుకున్న ‘ది రాడికల్ ఇన్ అంబేద్కర్’ అనే సంకలనానికి ఆయన సహ సంపాదకునిగా పనిచేశారు. ఇటీవల ది హిందూ తయారుచేసిన ‘దశాబ్దపు ప్రతిష్టాత్మక ఉత్తమ నాన్-ఫిక్షన్ పుస్తకాల’ జాబితాలో ‘క్యాస్ట్ మాటర్స్’ పుస్తకం కూడా చోటు చేసుకుంది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో సీనియర్ ఫెలో, ఆయన ఆఫ్రికన్ మరియు ఆఫ్రికన్-అమెరికన్ అధ్యయనాల విభాగంతో రీసెర్చ్ అసోసియేట్‌గా ఉన్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆఫ్రికన్ మరియు ఆఫ్రికన్-అమెరికన్ పరిశోధనల కోసం హచిన్స్ కేంద్రంలో నాన్ రెసిడెంట్ ఫెలోగా సేవలు అందిస్తున్నారు. ప్రపంచపు దక్షిణ భాగంలో ‘క్యాస్ట్’, జాతి, జాతి ప్రత్యేకతల అధ్యయనాలు, కార్మిక వలసల రంగంలో సూరజ్ రాసిన 100 పైగా వ్యాసాలు, ఆర్టికల్స్, ఇంకా పుస్తక సమీక్షలు బహుళ భాషలలో ప్రచురించబడ్డాయి. ప్రస్తుతం, ఆయన దళితులు, నల్ల జాతికి సంబంధించిన అధ్యయనాలలో ఒక కీలకమైన సిద్ధాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు.
ఈ ఇంటర్వ్యూ చేసినవారు టి.ఎం కృష్ణ. టి.ఎం కృష్ణ -రచయిత, యాక్టివిస్ట్, రామోన్ మాగ్సేసే అవార్డు గ్రహీత. గాయకుడిగా, ఆయన తన కచేరీల శైలిలోనూ, వస్తువులోనూ అనూహ్యమైన ప్రయోగాలు చేసారు. సాంప్రదాయ విలువలలో బంధించబడి సంగీతం ఉందనీ; రాజకీయ పక్షపాతాలతో, ప్రచ్ఛన్న భావజాలాలతో నిండిన సామాజిక సోపానాల ఉక్కు పిడికిలి నుంచీ కర్ణాటక సంగీతాన్నీ, ఇతర కళారూపాలను విడిపించాలని -ఆయన పుస్తకం 'రీషేపింగ్ ఆఫ్ ఆర్ట్' ద్వారా అభ్యర్థిస్తారు. అతని మరో పుస్తకం 'సెబాస్టియన్ & సన్స్' - గొడ్డు చర్మాన్ని వలిచి, మృదంగాన్ని తయారుచేసే దళిత కళాకారుల చరిత్ర.
టి.ఎం కృష్ణ: కొన్ని ప్రశ్నలు మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నాయి, కులం కారణంగా ప్రత్యేక హక్కులను పొందిన ప్రజలు అడిగే ప్రశ్నలు ఇవి. కులం గురించి సంభాషణ జరిగిన ప్రతిసారీ ఇవే ప్రశ్నలు తిరిగి వస్తున్నాయి. వీటికి సమాధానాలు అనేక సందర్భాల్లో, అనేక వ్యక్తులు ఇచ్చినప్పటికీ, తరతరాలుగా -ఈ ప్రశ్నలు మాత్రం ఎక్కడికీ పోవడం లేదు. కాబట్టి మేము వాటన్నిటినీ ఒకచోట చేర్చి చూద్దాం అనుకుని -ఈ ప్రశ్నలను క్రౌడ్ సోర్సింగ్ (ప్రజల నుండి సేకరించడం) చేసి, సమాధానాలను ఒకే వేదిక పైకి తీసుకు వస్తున్నాము. ఈ అంశాలను విస్తృతంగా షేర్ చేసి, ఎంత ఎక్కువమందికి వీలైతే అందరికీ వినిపించాలనీ, వాళ్లందరూ వీటి నుండి నేర్చుకుంటారనీ ఆశిస్తున్నాము.
సూరజ్, స్వాగతం. ఈరోజు మనం ఇలా కలిసి అలా మాట్లాడే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
సూరజ్: థేంక్యూ బ్రదర్ కృష్ణ! మీ ధైర్యసాహసాలు, జనాకర్షణతో -తాను చేసుకున్న తప్పులలో తానే కూరుకొనిపోయి, అవసాన దశలో ఉన్న రంగానికి (సంగీత కళారంగం అయి ఉండవచ్చు – అను.) కొత్త ఊపిరి పోయడం చూసి నేను ఆనందిస్తూ ఉంటాను. మీరు అందిస్తున్న సేవలకు నా నెనరులు.
టి.ఎం కృష్ణ: థేంక్యూ! నేను నేరుగా ప్రశ్నలలోకి వెళ్తాను, నా దగ్గర కులానికి సంబంధించిన ఒక 10 ప్రశ్నలు ఉన్నాయి.
కులం అనేది గతకాలానికి సంబంధించినదనే వాదంతో -ఈ ప్రశ్న పదేపదే తిరిగి వినిపిస్తూనే ఉంటుంది ‘నా పూర్వీకులు చేసిన అకృత్యాలకి నేనెందుకు మూల్యం చెల్లించాలి?’ అని.
సూరజ్: ముందుగా ఒక మాట. కులం అనేది గతానికి సంబంధించినది కాదు. అది ఈనాటిది, ఇప్పుడూ ఉంది. ఒకరకంగా చెప్పాలంటే మనం పీల్చే గాలి లాంటిది. మనం వదిలేది కార్బన్ డై ఆక్సైడ్‌ని కాదు కులతత్వాన్నే. కులం అనేది -అమాయక హృదయాన్ని సైతం దురభిమానిగా మార్చగలిగే శక్తి ఉన్న వ్యవస్థ. అది -బడికి పోయే పసిబిడ్డకి కూడా -వాడికీ నాకూ ఉన్న భేదాన్ని గమనించేలా చేస్తుంది. వాడి ఆధిపత్య కులాన్ని, నా దళిత కులాన్నీ గుర్తు పట్టేలా చేస్తుంది. అలాటి తేడాలను పసిగట్టే విద్య పిల్లవాడికి నేర్పిస్తుంది.
ప్రస్తుతం ఒక సంవత్సరంలో దళితుల పట్ల 49,000 దారుణాలు జరిగాయని తెలుస్తోంది -ఇంకా కులం గతానికి సంబంధించినదని ఎలా అంటాం? ఇది కేవలం ప్రభుత్వ డేటా మాత్రమే. సాధారణ డేటా కావాలంటే, దాన్ని మూడు పెట్టి గుణించండి. ఇంకా నమోదు అయిన కేసులు, నమోదు కానివి ఎన్నుంటాయో ఊహించాల్సిందే.
మీ పూర్వీకుల పాపాలకు మిమ్మల్ని పరిహారం చెల్లించమని ఎవరూ అడగడం లేదు, మీరు చెల్లించడం లేదు. అది మళ్లీ ఒక పెద్ద అబద్ధం. మీరు ఏమి చెల్లిస్తున్నారు? ఆధిపత్య కులంలో ఒకరు పుట్టారంటే అపారమైన సామాజిక మూలధనాన్ని పుట్టుకతోటే వెంట తెచ్చుకుంటారు. తక్కిన వాళ్లు ఇంకా కనుచూపు మేరలో కూడా లేనప్పుడు -ఇతను అప్పటికే ఆటలో ఒక అడుగు వేసి ఉన్నాడన్న మాట. యథాతథ స్థితిని కొనసాగించడం ద్వారా -మెజారిటీ జనాలని పీడించి, మీ పూర్వీకులు మీకు అందించిన ప్రయోజనాలని అందుకుంటున్నారు.
ఇంకో విషయం ఏమిటంటే -నిన్ను నువ్వు దేశంలో భాగంగా ఎలా చూసుకుంటున్నావు అనేది. ‘నా దేశం’ అనే భావనకి అర్థం త్రివర్ణ పతాకాన్ని మోయడం, మైనారిటీలను పరాయి వాళ్ల కింద చూడడం, లేదంటే ఒక మతాన్ని స్వంతం అనుకోడం కాదు. ఒక దేశ వాసులంతా ఆ దేశపు వనరులను పంచుకోవడం -అదీ ఒక దేశంగా ఉండడం అంటే. అభివృద్ధి చెందిన సమాజాలలో అది కనిపిస్తుంది. ‘నా దగ్గర ఒక 10 రొట్టెలున్నాయి, నాకొక రొట్టెతో కడుపు నిండిపోతుంది, తక్కిన తొమ్మిందింటినీ ఏం చేస్తాను? నా దగ్గరే ఉంచుకుని వాటిని కుళ్లి పోనిస్తానా లేక మరో 9 మందికి వదిలేస్తానా? అలా చేయడం ద్వారా -మర్నాడు నాకు కావలసింది తీసుకోడానికి వీలయిన వ్యవస్థ నొక దానిని తయారు చేసుకుంటానన్న మాట.
ఉదాహరణకి ఈ దేశంలో బ్రాహ్మణ సమాజం దగ్గర, సగటు జాతీయ ఆదాయం కంటే 40% ఎక్కువ ఆదాయం ఉంది. బ్రాహ్మలు సుమారుగా జనాబాలో 4-4.5% ఉంటారు, కొందరు 3.5% అంటారు. ఇది స్పష్టంగా అపార్థైడ్ (వివక్షతో నిండిన సమాజం -దక్షిణాఫ్రికాలో మైనారిటీలైన తెల్లజాతి, మెజారిటీ వనరులను స్వంతం చేసుకోడం) లాంటిదే. 3% ప్రజల దగ్గర 3% వనరులే ఉండాలి కదా, మిగిలిన 37% ఏ వనరులూ లేని ప్రజలకి పంపిణీ కావాలి కదా. అన్నట్టు, వారి దగ్గర ఉన్న వనరులు మెరిట్ మీద తెచ్చుకున్నవి కాదే, వలస ప్రభుత్వాల దగ్గరా, అంతకు ముందు ముస్లిం ప్రభువుల దగ్గరా -కొలువు చేసి ఈనాములుగా భూములను సంపాదించుకున్నారు, ఒక స్వతంత్ర భూస్వామ్యాన్ని ఏర్పరుచుకున్నారు. మెజారిటీ ప్రజలు పేదరికంలోనే ఉండిపోయారు. కాబట్టి చెప్పేదేమిటంటే, నువ్వు నీ పూర్వీకుల తరపున చెల్లించడం లేదు. నువ్వు ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా నీ వంతు పన్ను నువ్వు కడుతున్నావు. 10 రూపాయలు కట్టి, 100 కట్టినట్టు మాటాడి, ఆ పైన 1000 కట్టానని క్లెయిమ్ చేస్తుంటావు. ఇందులో చిత్రమేమిటంటే -వారి అతిశయోక్తులను వాళ్లే నమ్మి, దళితులు ఆదివాసీలు వీరి మీద పడి తింటున్నారనే నిర్ధారణకి వచ్చేస్తున్నారు. కానీ అది నిజం కాదు. అసలు అందుకే ఉద్యోగాల గురించి ప్రశ్న వేసుకోవాలి. ఏయే కుల సమూహం ఎంతెంత డబ్బు గడిస్తోందన్న గణాంకాలు కావాలి. నువ్వు దళితుల విద్యకయ్యే ఖర్చు భరించడం లేదు, వారి ఖర్చు వారే భరించుకుంటున్నారు -ఎందుకంటే అధికారిక, అనధికారిక ఆర్థిక వ్యవస్థలో వారు శ్రమ చేస్తున్నప్పుడు, వారు సృష్టిస్తున్న సంపద రాజ్యపు ఖజానాలో చేరుకుంటుంది, అదే రాజ్యం మళ్లీ వారికి వెనక్కిస్తుంది. ఇక్కడైతే, రాజ్యం వారికి వెనక్కి ఇవ్వడం లేదు కూడా. రాజ్యం ఆ డబ్బుని ఫ్లైఓవర్ల నిర్మాణం, కామన్‌వెల్త్ గేమ్‌లు వంటి వాటిలో ఖర్చు చేస్తోంది, మళ్లీ దానిలో దళితులని దోపిడీ చేయడమే జరుగుతోంది. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. దళితుల నుండి రాజ్యపు ఖజానాలోకి ఎంత వెళుతోంది, వారికి తిరిగి ఎంత వస్తోంది అన్న దాని మీద నిజానికి ఆర్థిక కోణంలోంచి ఖచ్చితమైన అధ్యయనం జరగాల్సి ఉంది.
టి.ఎం కృష్ణ- తర్వాతి ప్రశ్న- ‘అగ్ర ‘కులం’ అంటే దానిలో ఫార్వర్డ్ కేస్ట్‌లు అన్నీ వస్తాయి కదా (FCs). మరి మీరు ‘బ్రాహ్మణీయ’ అనే పదం ఎందుకు వాడుతుంటారు?”
సూరజ్: ఇది ఆసక్తికరమైన ప్రశ్న. బ్రాహ్మలు ప్రత్యేకించి, ‘బ్రాహ్మణీయ’ అనే పదం వాడకం మీద అభ్యంతరం చెప్తూ ఉంటారు. వారిని మాత్రమే నిందిస్తున్నట్టు అనిపిస్తుందనుకుంటా. ఇది ఒక రకంగా నిజం, మరో రకంగా నిజం కాదు కూడా. ‘బ్రాహ్మణీయ’ వ్యవస్థ అనేది - ‘పురుషోత్తముడు’ అనే భావనలో విశ్వాసం ఉంచుతుంది. ఏ జీవి ఏ కడుపున పుడతుంది అనేది బ్రహ్మ, లేదంటే మరో పాత్ర నిర్ణయిస్తుందనీ, ఆ సూత్రాన్ని బట్టీ సృష్టిని నడుపుతుందనీ నమ్ముతుంది.
రుజువు చేసుకోనవసరం లేకుండానే, దాని కోసం ప్రయత్నించనక్కర లేకుండానే -వారికి యోగ్యత ఆపాదించబడుతుంది -అదే ఇక్కడ సమస్య. ఒక్క కులం అనే కాదు, అన్ని రకాల అణచివేతలను కలిపి ఉంచే వ్యవస్థని ‘బ్రాహ్మణీయం’ అని పిలుస్తున్నాం, ఎందుకంటే, నిచ్చెన మెట్ల వ్యవస్థలో బ్రాహ్మలు అగ్రభాగాన ఉంటూ, అక్కడే నిలిచి ఉండడానికి రకరకాల ఎత్తులు, జిత్తులూ కనిపెట్టారని తెలుస్తోంది. ఒకరు పైన ఉన్నారంటే, తక్కిన వారంతా కింద ఉన్నారని అర్థం -కనకనే ఆ అగ్ర భాగాన ఉన్న వారి పేరుతోనే ఆ వ్యవస్థని గుర్తిస్తున్నాం.
టి.ఎం కృష్ణ: “కులం అన్ని మతాల్లోనూ ఉంది, మరి హిందూ మతాన్నే ఎందుకు ప్రత్యేకించి తప్పు పడుతున్నారు?”
టి.ఎం సూరజ్: ఇది పొరపాటు అభిప్రాయం. నిజం కాదు. అంబేద్కర్ కూడా క్రైస్తవం, ఇస్లాంలో ఉన్న వివక్ష గురించి చాలా నిశితమైన విమర్శ చేసి ఉన్నాడు. మరో సంగతి, అంబేద్కర్ క్రైస్తవంలోని వివక్షను స్వయంగా అనుభవించాడు. ఆయన బరోడా వెళ్లినపుడు, క్రైస్తవమతం పుచ్చుకున్న ఒక బ్రాహ్మణ మిత్రుడు కులవివక్షను పాటించేవాడని తన ఆత్మకథలో రాసుకున్నాడు, అలాగే పార్సీల గురించి కూడా చెప్పాడు. పార్సీలు చాలా పలుకుబడి కలిగిన వర్గం, కానీ వారు కూడా బ్రాహ్మణీయ భావజాలానికి లొంగి ఉన్నారు. కాబట్టి, ఏ వ్యవస్థ అయితే స్త్రీని 4 గంటలకి లేచి, తమ పనిముట్లు పట్టుకుని వెళ్లి -మన మలమూత్రాలను శుభ్రం చేయమని ఆదేశించి, అణగదొక్కుతోందో -ఆ వ్యవస్థని మనం ఖండిస్తున్నాము. అది అలాగే ఉండాలని సమర్ధించే ప్రతీ ఒక్కరికీ, కేవలం హిందువుకే కాదు -ఇది వర్తిస్తుంది. భారతదేశంలో కులాలన్నిటిలోనూ -ఈ ధోరణి కనిపిస్తుంది, అన్ని మతాలకీ పాకింది. ఈ ఏరు పారుతున్నంత కాలం, అందరూ దీనిలో ఒళ్లు తడుపుకోడానికి చూస్తూనే ఉంటారు. సుమారు 2,600 ఏళ్ల కితం, ఏ విధానాలని ఆధారంగా చేసుకుని, ఈ దుర్మార్గ వ్యవస్థ రూపొందించబడిందో, ఆ విధానాల తోటే మెజారిటీ సమూహాలని పీడించడం ఈనాటికీ కొనసాగుతోంది.
టి.ఎం కృష్ణ: థేంక్యూ! “అసలు నిజంగా వ్యక్తులను వేరుచేసేది వర్గం కదా, (కులంకాదు కదా)?”
సూరజ్: ఆ విషయంలో నాకు, కొంత అంగీకారం లేకపోలేదు. వర్గం -విభాజక అంశమే, కానీ కేవలం అది ఒక్కటే కాదు. అలా అయి ఉంటే, ఈపాటికే విప్లవం వచ్చి ఉండేది. మన అనుభవాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం, దానిని ఏమని పిలుస్తాం అనే విషయంలో ఒక పాటి అంతరం ఉంది ప్రజల అవగాహనలో. వర్గ అంతరం వల్ల బాధ పడేవారు వర్గం గురించి మాట్లాడతారు, కులం బాధించే వారికి కులం సమస్యగా కనపడుతుంది. భారతదేశపు వ్యవస్థలో, కులం అనేది వర్గాన్ని అధిగమించి పోయింది. అయితే, మనం కేవలం కులం గురించి మాట్లాడితే సరిపోదు. కులం అనే మాట పక్కన, ఒక కామా పెట్టి విధిగా దానికి వర్గం అనే మాటను జోడించాల్సి ఉంది. ఎందుకంటే శ్రమని దోచుకోవడం అనేది కుల వ్యవస్థకి పునాది కదా? మార్క్స్ ‘అదనపు శ్రమ’ అనే మాటని గుర్తించి, మనకి చెప్పడానికి ఎంతో పూర్వమే భారతదేశంలో శ్రమదోపిడీ -కులవిభజన ద్వారా అమలు జరుగుతోంది. కులాన్ని ఎందుకు పోకుండా కాపాడాలనుకుంటారు ఎవరైనా? పొలం పనికైనా, నిత్యజీవితంలోనైనా -శ్రామికులు అందుబాటులో వుంటారు. అవసరం అయినప్పుడు వాడుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే దానిని విదిలించెయ్యవచ్చు, ఎవరికీ జవాబు చెప్పుకోనక్కరలేదు. ఆ మనుషులకి నువ్వు బాధ్యత పడక్కరలేదు, ఎందుకంటే వాళ్లు ధర్మ శాస్త్రాలు చెప్పే కర్మ సిద్ధాంతంతో బంధించబడి ఉంటారు, ఇక్కడ ‘పాప పరిహారం’ చేసుకోడానికి పుట్టిన మనుషులు వాళ్లు.
కాబట్టి వర్గం ప్రశ్నకి సంబంధించినంత వరకు, ప్రత్యేకించి ఈ కొత్త లిబరల్ సందర్భంలో -వర్గం అనేది మౌలిక నిర్ణాయకం అనేది నేను ఒప్పుకుంటున్నాను. అయితే -ఇక్కడ ఒక ఆసక్తికరమైన మెలిక ఉంది. ఈ ‘నియో లిబరలిజం’ (కొత్త ఉదారవాదం) అనేది కుల వ్యవస్థలోని సూక్ష్మ రంధ్రాలలోకి ఇంకింది. రాజకీయాలని, నిత్యజీవితాన్ని మాత్రమే కాదు, ఇది ఇప్పుడు అంతర్జాతీయ
సంస్థలలో సైతం చొచ్చుకుపోయింది. కేంబ్రిడ్జ్‌లో చూశాం మనం. కాలిఫోర్నియాలో, ఆర్యసమాజ్ ‘బాప్స్’ గుడిలో ఎలాటి దోపిడీ జరిగిందో చూశాం కదా. (యుఎస్‌లోని BAPS, Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sansthan మీద 12 మే 2021న, ఎఫ్‌బీఐ దాడి చేసింది. అక్కడ, దళిత శ్రామికులని, అమానవీయ పరిస్థితులలో బలవంతంగా ఉంచి, 10% వేతనాన్నిస్తూ – పని చేయిస్తున్నారని బయటపడింది -అను)
కాబట్టి ముఖ్యంగా మనం గుర్తు పెట్టుకో వలసినదేమిటంటే, ఈ రెండు అంశాల మీదా ఒకేసారి దృష్టి సారించి, మనం నిశితంగా విశ్లేషణ చెయ్యాలి. అయినా ఏది ముందు పోవాలనే ప్రశ్న ఏమిటి, ఇదేమన్నా పోటీనా?
వర్గం అనేది నిలవడానికి, కులానికి ఒక గిన్నెలాగా అమిరింది. ఆ వర్గం అనే మొక్క వేళ్లుని, బలంగా పుంజుకుని మరింత ఎదగడానికి దోహదం చేసే భూమిక -కులం.
మరో సంగతి గమనించండి, ఉన్నత ‘వర్గం’ లో ఉన్న వారంతా ఎవరు? వారి కులం ఏమిటి? అని చూస్తే, బ్రాహ్మలు, వైశ్యులు -వీళ్లే పెట్టుబడికి యజమానులు. క్షత్రియ కులాల దగ్గర భూమి తప్ప నికరమైన పెట్టుబడి లేదు. అది 93% బ్రాహ్మలు, వైశ్యుల దగ్గరే ఉందని EPW (ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ) రీసెర్చ్‌లో తేలింది.
టి.ఎం కృష్ణ:
ఔను, నిస్సందేహంగా! ఇదిగో ఈ ప్రశ్న, తరచుగా బ్రాహ్మల నుండి వస్తూ ఉంటుంది. “దళితులు ఎదుర్కొంటున్న హింస చాలా వరకు OBC సమూహాల ద్వారానే జరుగుతుంది. అయినా కుల ఉద్యమకారులు బ్రాహ్మలనే తప్పు పడతారు, OBCలని ఎందుకు ప్రశ్నించరు?”
సూరజ్: మనం ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటే, మనం ఎలా ఉన్నాం అనేదే చూస్తాం. అలాటిదే ఇదీని. నేను చాలామందినే ప్రశ్నిస్తున్నా, నువ్వు మాత్రం నీ పేరునే వింటావు. ఈ మానసిక వైఖరి మానవ సహజం. బ్రాహ్మలనే కాదు, వర్గం-కులం సమూహాలన్నింటి గురించీ నేను విమర్శ పెడుతూనే ఉన్నాను. OBCల ద్వారా హింస జరుగుతోందనేది వాస్తవమే. అయితే, కులం అనే నిర్మాణానికి లోబడివారు ఆ హింసని కొనసాగిస్తున్నారు. కులం లేనప్పుడు, OBCలూ మనుషులే, బ్రాహ్మలూ మనుషులే, దళితులూ మనుషులే. కులం అనే చట్రంలో ఒకరు బ్రాహ్మలు అవుతారు, ఒకరు OBC అవుతారు. నేను నా బ్రాహ్మణ మిత్రులతో అంటూ ఉంటాను. నిజంగా ఈ విషయాన్ని వాళ్లు పట్టించుకునే మాటయితే, బ్రాహ్మణ సమూహాలు ఒక ఫత్వాలాంటి తీర్మానాన్ని జారీ చెయ్యాలి. ఏమని అంటే -దళితుల మీదా, ఆదివాసీల మీదా జరిగే హింస -హిందూ ధర్మానికీ, అది బోధించే విలువలకీ వ్యతిరేకం కనుక ఎవరైనా OBCలు అలాటి హింసకు పాల్పడితే, వారికి ఆలయాలలో ప్రవేశం నిషేధం అని.
ఈ OBCలని ‘బ్రాహ్మణీయ సేవక కులాల’ని పిలుస్తాను. ఎందుకంటే ఆ వ్యవస్థకి ఒకపక్క ఊడిగం చేస్తూ, ఉత్తుత్తి ఆధిక్యతను అనుభవిస్తారు. వారిది మౌలికమైన అధికారమూ కాదు, చాలినంత ఎలాగూ లభించదు. దళితుల మీద దౌర్జన్యం అనే నేరాన్ని అతను/ఆమె ఎందుకు చేస్తారంటే, ఆ హింసకి ప్రతిఫలం -ఈనాడు మనం భారతదేశంలో చూస్తూ ఉన్నట్టూ -రాజకీయంగానో, ఆథ్యాత్మికంగానో, మరో రకంగానో పై నుండి తమకు అందుతుందని -వారు విశ్వసిస్తారు కాబట్టి.
టి.ఎం కృష్ణ: ఇదిగో ఈ ప్రశ్న అయితే, నా స్నేహితులు చాలా మంది అడుగుతూ ఉంటారు. వాళ్లంటారూ -“నా ఇంటిలో పని చేసే వ్యక్తిని నా కుటుంబ సభ్యునిగా భావిస్తాను. (వారు ఎన్నో దశాబ్ధాలగా మా ఇంటిలో ఉన్నారు), నన్ను కులవాదినని ఎందుకు నిందిస్తారు?”
సూరజ్: ఉదార గుణంతో ఉండడం అనే విషయానికి వస్తే మరే రకమైన ప్రశ్నలు వెయ్యకుండా ఉండడానికి అలవాటు పడిపోయాం. ఆశ్రయం ఇస్తున్నాం అనే భావం ఒక్కోసారి అసభ్యమైన స్థాయికి చేరుకుంటూ ఉంటుంది. అవతలి వారు నీ ఇంటిలో పని చేస్తున్నారంటే -అది సాధ్యమయ్యేలా చేసిన కుల వ్యవస్థ ఒకటుందని, అది వారి జీవితాన్ని నరకప్రాయం చేసిందనే విషయం మర్చిపోకూడదు. మా నాయనమ్మ, అమ్మమ్మ ఇళ్లలో పని చేసేవారు. ఒక్కోసారి మా అమ్మమ్మ పని చేసే ఇంటికి నన్ను తీసికెళ్లేది. వాళ్లింటిలో నెయ్యి రాసిన రొట్టెలు, ఇంకా కొన్ని నాజూకు వంటకాలు నాకు దొంగతనంగా పెట్టాలని చూసేది. నా అమ్మమ్మ నా కళ్లలో హీరోయిన్, అలాటిది ఆ పని చేయాల్సి వచ్చిందంటే -నాకు ఎంతో ఇబ్బంది కలిగేది. తనకి ఇష్టమై ఆమె ఇళ్లలో పనికి కుదరలేదు, బయట ఉన్న పరిస్థితులు ఆమెకు అది తప్పనిసరి అయ్యేలా చేశాయి. కనక, నిన్ను నువ్వు కులరహితుడివి అయ్యావు అని ప్రకటించుకునే ముందు, నీకూ ఆమెకూ మధ్య కులభేదాన్ని పొగొట్టడానికి -నువ్వు ఏం చేశావు అనే ప్రశ్నని వేసుకుంటే బాగుంటుంది. పనివాళ్లు వాడే పాత్రలూ, గ్లాసులూ విడిగా ఉంచుతారు, ఇంట్లో ఒకవేళ పూజగది ఉంటే -దానిలోకి రానివ్వరు. అసహ్యకరమైన వ్యవస్థ, అందులో బ్రతుకుతున్నాం. అయితే ఒక మంచి పరిణామాన్ని చూస్తున్నాను. యువతరం, ప్రత్యేకించి సవర్ణ సమూహాలకి చెందిన పిల్లలు -నాకు చెప్తూ ఉంటారు -మేము ఈ కుల వివక్షను మా చుట్టూ గమనిస్తున్నాం, మాకు చాలా బాధ కలుగుతోంది అని. నేననేది ఏమిటంటే, ఈ కుల నిర్మాణాలు నీ చుట్టూ ఉన్నాయని నువ్వు గుర్తించకపోతే, నీ ఔదార్యం, దయాగుణాలు సైతం క్రమక్రమంగా నిన్ను కులవాదంలో భాగంగా మార్చివేస్తాయి.
టి.ఎం కృష్ణ: నిజమే! ప్రగతిశీల, ఉన్నతకులాల వ్యక్తులు అడిగే మరో ప్రశ్న -“నేను కులాన్ని నమ్మను (అలా అని వాళ్లంటారు). నా కులాన్ని సూచించే ఇంటిపేరును కూడా నేను వాడను. నేను కుల పీడకుడిని ఎలా అవుతాను?”
సూరజ్: ఇంటి పేరు మార్చుకుంటే, అంతా చెరిగిపోయే పనైతే ఇంక సమస్య ఏముంది? అయితే ఇది ఆసక్తికరమైన విషయం -తమిళనాడులో, ఇంటిపేరు అంటూ ఉండదు, ఐస్‌లాండ్‌లో కూడా అలాగే ఉంటుంది, పిల్లలకి తండ్రి పేరే వస్తుంది. దానిలో ఒక స్వేచ్ఛ లేకపోలేదు.
ఈ ప్రగతివాదులు, ‘నేనైతే, నా కులం పేరును తీసేశాను’ అని చెప్తారు, నాకు తెలుసు వారి ఉద్దేశం మంచిదే, వాళ్లని వేళాకోళం చెయ్యకూడదు. వారికి అర్థమయ్యేలా చెప్పాలి- నువ్వు గ్రహిస్తున్నదీ, అక్కడ ప్రదర్శించబడుతున్నదీ – రెండింటి మధ్యా కొన్ని ఇబ్బందులున్నాయని. కొందరు ప్రగతివాదులు - ‘అందరి పురోగతి’ అనే లిబరల్ విలువని, గాంధీ మోడల్‌గా భావిస్తారు. కానీ ఆ ‘అందరి మోడల్’లో, నిజానికి అసలైన పాత్ర ఆధిపత్య కులాలదే ఉంటుంది. గ్రాంట్‌లు ఇవ్వడం, మెమోలు రాయడం లాటివన్నీ వాళ్లే. అరుదుగా ఎప్పుడో ఒకవేళ, ఏ దళితుడికో, ఆదివాసీకో ఏ కొంతన్నా మేలు జరిగిందో -దానిని అక్కాడా ఇక్కడా ప్రస్తావించి -దానికి మెప్పుదలలని పొందడానికి ప్రయత్నిస్తారు. అక్కడే చాలా ఇబ్బంది కలుగుతుంది
కానీ -వేరే ప్రగతివాదుల సమూహాలూ ఉంటాయి. వారికి నిజంగానే ఈ విషయంలో ఆసక్తీ ఉంటుంది, వారికి మార్గనిర్దేశం అవసరం అవుతుంది. వారిది రైట్ వింగ్ భావజాలం కాదు, కానీ వారు విశ్వాసాలతో బంధించబడి ఉంటారు. వారి కులానికి దొరికే ప్రివిలేజ్‌లని వాడుకోడానికి, ఇంటి పేరును బయటపెట్టే అవసరమే ఉండదు. ఎందుకంటే మహానగర సంస్కృతిలో –నీకు అవసరమయ్యేది -నీ కనెక్షన్‌లే (పరిచయాలు).
కాబట్టి కులతత్వ విరోధం కోసం నేను ఏ రకమైన పని చేయాలనే దానితో పాటు, ఈ విభజనలని సమూలంగా నిర్మూలించడానికి నా వరకు నేను ఎంత పూచీ పడగలను అనే దిశలో ఆలోచించాలి. అంటే, ఎక్కువ పదవులను ఆక్రమించుకుని, ఈ విభజనలను పెంచే విధంగా ప్రవర్తిస్తున్న వ్యక్తులని, నీ స్వంత సమూహాల్లో గుర్తించి వారిని ప్రశ్నించగలగాలి. దళితవాడల్లోకి వెళ్లి, వారికి సహాయపడతాం అనే బదులు, ఎవరి పరిసర సమాజాల్లో వారు -‘పవర్’తోనూ ‘ప్రివిలేజ్‌’తోనూ సంభాషణ జరపాలి.
టి.ఎం కృష్ణ- ప్రజలు అడిగే మరోప్రశ్న – ఇది కులం కాదు సంస్కృతి అంటారు. సాధారణంగా వివాహానికి సంబంధించి ఈ చర్చ జరుగుతూ ఉంటుంది. వాళ్లంటారూ -“మాకు అసలు కులం గురించిన సమస్య లేనేలేదు, కానీ ఒకే రకమైన సమూహాల మధ్య పెళ్లిళ్లు, సహజీవనం -సులభంగా ఉండడం నేను గమనించాను. అదే సంస్కృతి.”
సూరజ్- దానిలో తప్పేమీ లేదు. పెళ్లి నిర్ణయం అనేది ప్రతి ఒక్కరి స్వవిషయం. కానీ భారతదేశంలో సంస్కృతి అంటే కులమే. ప్రముఖ చరిత్రకారుడు, మార్క్సిస్ట్ మేధావి, బ్రిటిష్ దేశస్థుడు, ఎరిక్ హాప్సన్ ‘సంప్రదాయం’ మీద ఒక విశ్లేషణ వ్యాసం రాశాడు. ఆయన అంటాడు, సంప్రదాయం అనేది ఏదీ ఉండదు, మన స్వంత విలువలని నిలబెట్టుకోడానికీ, మిగిలిన మెజారిటీ మీద వాటిని రుద్దడానికి -దానిని సృష్టిస్తాం. పండగల లాంటివన్నీ ‘సంప్రదాయం’లో భాగంగా మారిపోతాయి. ఉదాహరణకి, అమెరికా ఉత్సవం జరుపుకునే విషయం, మిగిలిన ప్రపంచానికి నవ్వుతాలు వ్యవహారంలా ఉంటుంది, కానీ దానిని వాళ్లు సంప్రదాయంగా మార్చుకున్నారు.
అయితే సంస్కృతి విషయానికొస్తే, సంస్కృతికి చారిత్రక సందర్భం అవసరం అవుతుంది. కులం అది అందిస్తుంది. కులం నీకు చరిత్రని ఇస్తుంది, కులం నీకు సూచికలని, ప్రస్తావనలని ఇస్తుంది. సంస్కృతిలో వైకల్యాలు చోటు చేసుకున్న కారణంగా, అది అస్థిత్వంలో లేకుండా పోవాల్సిన పరిస్థితి వస్తే, దానికి నిర్దోషిత్వం ఆపాదించి -దానిని రక్షించి, కొనసాగేలా చేస్తుంది -కులం. ఆ పని కోసం ఒక్కోసారి కాల్పనిక కథలను అందిస్తుంది, ఒక్కోసారి వాటిని వక్రీకరిస్తుంది. ఎలాగోలాగ ఆ సంస్కృతి అనే నిర్మాణాన్ని భవిష్యత్ కాలానికి సుస్థిరంగా నిలిచేలా చేస్తుంది. సంస్కృతి -ఇక కల్చర్ అన్న మాట పరిధిని దాటిపోయి, ఆధ్యాత్మిక – మతపరమైన ఆవరణను చేరుకుని, ఆధ్యాత్మిక సదుపాయాలని అందించే వాహిక అనే నెపంతో మన జీవితాల్లో కలగలిసిపోతుంది.
మనం కల్చర్ అని యూరోపియన్ పదాన్ని వాడినప్పుడు, దానికి ఒక విలక్షణత ఉంటుంది. కాని దానినే మనం ఇండియన్ సందర్భంలో వాడినప్పుడు, దానికి ఆధ్యాత్మిక-మత సంబంధమైన అధికారాన్ని, అనుమతిని కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది. అదే కులాన్ని నియంత్రించే సూత్రంగా మారుతుంది. కాబట్టి, మీరు ఎవరిని కావాలంటే వారిని పెళ్లి చేసుకోండి, కానీ మరెవరైనా వేరే కులం వారిని చేసుకోవాలనుకున్నప్పుడు -వారికి మద్దతునివ్వండి. ఒకే సంస్కృతి అయితే దానిలో సౌలభ్యం ఉంటుందని మీకు అనిపించినంత మాత్రాన, అందరూ అలాగే ఆలోచిస్తారని అనలేం కదా. మరి అలా పెళ్లిళ్లు జరగాలంటే, దళిత పిల్లల హత్యలు జరగకూడదు.
టి.ఎం కృష్ణ: చాలా నిజం మీరన్నది! ఇండియాలో కులమే సంస్కృతి అన్న మీ పాయింట్, చాలా శక్తివంతమైన వాక్యం. ప్రతీ ఒక్కరూ ఆ వాక్యాన్ని గురించి సీరియస్‌గా ఆలోచించాల్సి ఉంది. తర్వాతి ప్రశ్న, నిజానికి ఒకే తరహాలో ఉన్న కొన్ని ప్రశ్నలు ఇవి …“(ఎవరు ఏ మాట మాట్లాడినా) ప్రతీ ఒక్క విషయాన్ని మీరు కులంతో ముడిపెడతారేం?”
సూరజ్: (పెద్దగా నవ్వుతూ) రామబాణం లాగా అన్నమాట. ప్రగతివాదులకీ, తిరోగమన వాదులకీ ఈ విషయంలో ఏకాభిప్రాయం ఉంటుంది లెండి: ‘అన్ని నొప్పులకీ ఒకటే మందు ఝండూబామ్ అన్నట్టు – అన్ని సమస్యలనీ క్రియేటివ్‌గా మీరు కులానికి లింక్ చేసేస్తారు’ -అంటారు. వారు మిస్ అవుతున్న పాయింట్ ఏమిటంటే, కులం ఒక్కటే కాదు, మిగిలిన రకాల అణచివేతల గురించి కూడా విమర్శ పెడుతూనే ఉంటాం, విశ్లేషిస్తూనే ఉంటాం. కానీ కులం మాత్రం ఎక్కువగా వినపడుతుంది. కారణం ఏమిటంటే, కులం అందించే ప్రివిలేజ్‌లని మరింత బాహాటంగా వాడుకుంటారు. ఉదాహరణకి -మననే తీసుకుందాం -పరలింగ సంపర్క (హెటెరోసెక్సువల్), పితృస్వామిక సమాజంలో -లైంగిక వివక్షకు గురయ్యే మైనారిటీ కమ్యూనిటీలు, ట్రాన్య్‌జెండర్ వ్యక్తులతో పోలిస్తే -నువ్వూ, నేనూ మగవారిమి అవడం కారణంగా ఒక రకమైన ‘ప్రివిలేజ్’ని కలిగి ఉన్నాం, అయినా ఆ విషయం అంత స్పష్టంగా కనిపించదు, కానీ కులాధిక్యత మనసుల్లో మెదిలే సందర్భాలు అనేకం. దానిని మనం నిస్సంకోచంగా ప్రదర్శిస్తాం.
అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే -కులం మన ఎంపికలని నియంత్రిస్తుంది, విలక్షణతల ఆధారంగా, సమాజంలో వివక్షకి- మద్దతునిచ్చి, కొనసాగించేలా చేస్తుంది, అంతే కాదు, అపరిమితమైన నియంత్రణా శక్తిని అందిస్తుంది. నువ్వు ఒక కులానికి చెందినవాడివి అంటే, కులానికి యజమానివి -అంటే కులాల నిచ్చెనలో నీకంటే దిగువనున్న కులాలకి యజమానివి.
వర్గం ఏయే రకాలుగా పనిచేస్తుంది అనే చర్చలో - మనం వర్గం, ప్రగతివాద రాజకీయాలు, దేశభావన – ఇలా ఎన్నో అంశాలని కలిపి మాట్లాడుకోవలసి ఉంటుంది. అంబేద్కర్, ఫూలే, పెరియార్‌లని చదివితే -కులం ఒంటరిగా పని చేయదు, దానితో పాటుగా అనేక వ్యవస్థలు దానికి సహకరిస్తూ వస్తాయనే సంగతి స్పష్టంగా రాశారు వాళ్లు. ఈ విషయం గురించి మనం ఒక సానుకూల అవగాహనని పెంపొందించుకోవాల్సి ఉంది. కులం గురించే మాట్లాడి, మరే ఇతర విషయాల గురించి మాట్లాడకపోవడం వల్ల ఒక విధమైన వాక్యూం (సంభాషణ అక్కడ తెగిపోయి, ఒకరి మాటలు మరొకరికి చేరని పరిస్థితి -అను.) ఏర్పడుతుంది. ఎవరూ పనిగట్టుకని కులాన్ని అన్ని సమస్యలతో ముడిపెట్టడానికి ప్రయత్నించడం లేదు. అయితే, ఇక్కడ -సమాజాన్ని యధాస్థితిలో ఉంచే సంస్కృతి రోజూ ఉత్పత్తి అవుతోంది. దానిని సవాలు చేయడానికి, మూలాలలోకి వెళ్లాల్సి ఉంది.
ఒకప్పుడు -మన చిన్నతనంలో అనేవారు గుర్తుందా – జనాభా పెరుగుదలే అన్ని సమస్యలకీ మూలకారణం అని. కులం కాదా అన్ని సమస్యలకీ మూలకారణం? చైనా జనాభా కూడా ఎక్కువే కదా? మరి అది ఈనాడు ఉన్న చోటికి ఇండియా ఎందుకు చేరుకోలేదు? అది కొన్ని (ప్రివిలేజ్) ప్రత్యేక సౌకర్యాలని రద్దు చేసింది. దేశాన్ని ప్రేమించే వ్యక్తిగా, మిగిలిన దేశాలు -అధిక జనాభా ఉండి కూడా అభివృద్ది చెందిన దేశాలు -ఏం చేస్తున్నాయనేది మనం పరిశీలించాలి.
టి.ఎం కృష్ణ: కరెక్ట్! ఇదిగో, కులం గురించిన చివరి ప్రశ్న -ఉద్యమాలకు సంబంధించి మాట్లాడుతున్నారనుకుంటాను. దళిత ఉద్యమం అనేది కూడా గత దశాబ్ధకాలంలో చాలా మార్పులు చెందింది. ఈ ప్రశ్న -కొన్ని ఉన్నతవర్గాల నుండి వస్తోంది. “నేను కుల సంభాషణలో పాల్గొనాలంటే (కుల సమస్యల గురించి పట్టించుకోవాలంటే), నువ్వు అంత కరకు గొంతుతో మాట్లాడడం మానెయ్యాలి.”
సూరజ్: సరే, ఇటీవలే నాకు జరిగిన అనుభవం ఒకటి ఇది కృష్ణా, నేనేం చేస్తున్నానో, ఏమి రాస్తున్నానో దాని గురించి నిశిత పరిశీలన జరుగుతూ ఉంటుంది. నేనొక దాని గురించి కామెంట్ రాసాను. కొన్ని సమూహాల పట్ల నేను మొరటుదనం చూపించినట్లు దానిని తీసుకున్నారు. “నువ్వు ఈమాట వాడి ఉండాల్సింది, ఆమాట వాడకుండా ఉండాల్సింది” అని చెప్పడం మొదలుపెట్టారు. నాకనిపించింది -సభ్యతా సూత్రం ఎప్పుడూ అణచివేతకి గురి అవుతున్న వాడికే ఎందుకు వర్తిస్తుందని అని?
టి.ఎం కృష్ణ: చాలా మంచి ప్రశ్న!
సూరజ్: నేననేది ఏమిటంటే, మనం జీవిస్తున్న సమాజం ఇంకా నాగరిక సమాజంగా మారలేదు, మనం పౌరబాధ్యతల గురించి నేర్చుకుంటున్నాం, అంతే. స్థానిక ప్రభుత్వాలంటే ఏమిటి, మన విధులేమిటి వగైరా వగైరా. అంతే తప్ప సభ్యత అనే భావనని మనం ఇంకించుకోలేదు.
ఈ సందర్భంలో, ఐఐటీలో పనిచేస్తున్న ఒక గొప్ప ప్రొఫెసర్, డా. సూర్యకాంత్ వాగ్‌మోరె రాసిన విషయాలని ప్రస్తావించాలి. ఆయన, సభ్యత గురించి -కులం సందర్భంలో వివరిస్తాడు. హిందూ ద్వంద్వాలను ఆయన ఎత్తిచూపుతూ, ‘హిందూ ఆధునికత’ అనే పదబంధాన్ని కాయిన్ చేశాడు. కులంగానీ, ఇంకా మిగిలిన ప్రివిలేజ్‌లు గానీ ఒక పక్క సమాజంలో ఉంటూ ఉండగా, ఆధునికత అనే భావనకి కూడా చోటు ఉండడం. (అనాగరికమైన ఆ విభజనలను ఆమోదిస్తూనే, ఆధునిక మానవులం అని కూడా కొందరు అనుకోవడం ఇందులో విషాదం)
ప్రస్తుత విషయానికొస్తే, మనం మహా హింసాత్మకమైన, గర్హనీయమైన, అసహనతతో నిండిన సమాజంలో బ్రతుకుతున్నాం. సంభాషణ ఎలాటి వాతావరణంలో జరుగుతోందో చెప్పడానికి, ఒక ఉదాహరణ ఇస్తాను -నువ్వు ఒక మాట అంటావు, అవతలి నుంచి ఒక మాట వస్తుంది. నువ్వు దానికి జవాబు ఇస్తావు, ఇక అవతలి వ్యక్తి నుండి వచ్చే రెండవ జవాబు –దెబ్బ, దహనకాండ లేదంటే మారణహోమం. అటువైపు ఉన్నవాళ్లు నీ మాటలోని కరుకుదనం ఎంత మోతాదులో ఉంది అనే లెక్క పెట్టరు, ఎందుకంటే -ఇది ‘సంస్కృతి కలవారి జాగా’కి సంబంధించిన రాజకీయం కదా!
‘ఏయ్ ఆ రకమైన భాష మాట్లాడకు’ అని నన్ను అదిలించారు. కొన్ని రకాలైన రాజకీయ విశ్వాసాలకు సంబంధించిన పనిని ముందుకు తీసుకుపోవాలంటే -ఏ రకమైన గొంతుకని వాడాలో నాకు పాఠం చెప్పారు. సరే, ఈ అల్పప్రాణికి పూర్తిగా ఆకళింపు అయ్యింది. నా వరకూ అయితే పరవాలేదు. ఎందుకంటే, నాకు ఒక హోదా ఉంది. కానీ ఏదో పని చేసుకుంటే కానీ బ్రతకలేని వారికి ఈ నియమాలని వర్తింపచేయడం అన్యాయం. మర్యాదగా, నాజూకుగా మాట్లాడే సావకాశం నాకు ఉంది. కానీ కళ్ల ముందే వారి అక్కచెల్లెలి పైనో, తల్లిపైనో అత్యాచారం జరగడాన్ని చూసిన వ్యక్తిని చప్పుడు చెయ్యకుండా, మర్యాదగా ఉండమంటే, ఉండగలడా? ఈ కోపాన్ని ప్రజలు అర్థం చేసుకోవడం లేదు -ఇది అనేక తరాల పాటు ఉడుకుతూ వస్తోంది. వారసత్వంగా సంక్రమిస్తోంది. ఇప్పుడు అగ్ని పర్వతం బద్దలై, లోపలి నుండి లావా ప్రవహిస్తోంటే, దాని సెగ నీకు తగిలింది. ఇప్పుడే దానిని గుర్తించావు. ఆ విషయం ఈ ప్రశ్న వేసిన వారందరూ అర్థం చేసుకుంటే మంచిది.
టోన్ మీద నిఘా, పెట్టాలనుకుంటే -పెట్టండి. కాని దానిని బాధితుల మీదనే కాకుండా -పీడకుడికి కూడా వర్తింపచేసినప్పుడు -బహుశా అప్పుడు సమాన స్థాయిలో సంభాషణ చేయగలం.
టి.ఎం కృష్ణ: పూర్తిగా అంగీకరిస్తున్నాను! ఈ ప్రశ్నలకి సమాధానాలిచ్చినందుకు అనేకానేక ధన్యవాదాలు సూరజ్. ప్రశ్నలూ, జవాబులూ ఒకే చోట లభిస్తున్నాయి కాబట్టి -ప్రజలు, కనీసం మళ్లీ మళ్లీ అవే ప్రశ్నలు అనాలోచితంగా వెయ్యకుండా -వాటి గురించి ఆలోచిస్తారనీ ఆశపడుతున్నాను. మీ సమయం వెచ్చించి, ఇంత స్పష్టతని అందించారు, థేంక్యూ సూరజ్!
సూరజ్: థేంక్యూ బ్రదర్.

ఆవేశం నుండి చైతన్యం దాకా : కారా

 "2016లో ఒకసారి మాటల్లో కారా మాస్టారి కథలు నాకు చాలా ఇష్టం!" అన్నారు Rama Sundari.

"చిన్నప్పుడు నాన్న (PRJ Pantulu) 'యజ్ఞం', 'రాగమయి' - చదివి వినిపించడం గుర్తుంది, అప్పుడూ, అటు తర్వాతా కూడా చదివాను కానీ #KaRa సాహిత్యం నాకంతగా అర్ధం కాలేదండీ" అన్నాను.
"మరో సారి చదవండి, మాస్టారి కథల మీద సారంగలో వ్యాసాలు రాసాం మేం, అవి పంపుతాను, చదివి చూడండి" అన్నారు.
ఆమె రాసిన 'హింస' కథ మీద వ్యాసం - చదవడం మొదలు పెట్టేను. ఒక్కసారిగా వయసు పెరిగిన అనుభూతి.
ఆ వ్యాసాలన్నిటినీ పుస్తకరూపం లోకి తేడానికి Vivina Murthyగారితో చేసిన చర్చల ఫలితంగా మరి కాస్త ఎదుగుదల.
Bammidi Jagadheeswararao గారితో నా ఆలోచనలు వ్యక్తం చేస్తూ, ఆయన స్పందనల ద్వారా కొంత స్పష్టత తెచ్చుకునేదాన్ని.
ఒకనాడు నాకేదో సరికొత్తగా స్ఫురించిందనిపించింది. విద్యుత్తు ప్రవహిస్తోందనిపించింది ఒక్కసారిగా. జరిగింది ఒక్క క్షణంలోనే - కాని ఆ మెరిసిందానిని అక్షరీకరించడంలో రెండేళ్లు పట్టింది.
మాస్టారికి Kalipatnapu Subba Rao గారు చూపిస్తారని, #KaRa కు చదవగలిగే ఆరోగ్యం ఉండాలనీ ఆశ.
రెండు వేర్వేరు వ్యాసాల్లో:
26 ఆగస్టున #వివిధలో,

చెప్పింది చదువుకునేందుకు వీలుగా ఒక్క దగ్గరే రాస్తున్నాను.
👇 - - - - - - - - - - - - - - - - - - - - -👇
సమాజ చరిత్రకూ, సమాజ చలనానికీ మధ్య ఉండేటటువంటి సంబంధం గుర్తించినటువంటి అతికొద్ది మంది రచయితల్లో కారా ఒకరని కేతు విశ్వనాధరెడ్డి అంటారు. సమాజ సమగ్ర స్వరూపాన్ని దర్శించే ప్రయత్నమే కారా మాస్టారి కథల లక్ష్యం. కలం పట్టిన తొలిరోజుల్లో – మధ్యతరగతి జీవుల గురించీ, వారి అనుభూతుల గురించే ఎక్కువగా రాసేరు.
అందరికీ చెందే వనరులని, కొందరు చేజిక్కించుకుంటున్న వైనం కంట పడ్డాక, ఆదోపిడీని – వ్యవస్థీకృతం, ఆమోదయోగ్యం – చేసుకోడానికే పీడన సాగుతోందని తెలిసాక - ఆయన రాసిన ఏకథా ఆ సత్యాన్ని విస్మరించలేదు.
కథనపు ప్రత్యేకత :
పీడనని మాత్రమే చిత్రీకరించే కథలు కోకొల్లలు – అలా రాయడం ఆయనకు సమ్మతం కాదు. అది ఏ రూపంలో జరుగుతోందో, ఎవరి ద్వారా జరుగుతోందో, దానిని అనుభవిస్తున్న వారి జీవితాలలో మార్పులేమిటో, దానికి ఎదురెళ్లేవారెవరో – పరిశీలించి తనకొక అవగాహన ఏర్పడింది అనుకున్నాకే దానిని కథావస్తువుగా స్వీకరిస్తారు. అందుకే ‘చెప్పేందుకు విషయాలున్నా చెప్పడానికి అవి నా అలవికి రావాలి’ అంటారొకచోట. నిజమైన వర్గ శత్రువుల అంతర్ బహిస్వరూపాలు ముందుగా తాను గుర్తించి తన కధల్లో వాటిని ఆవిష్కరించడం ఆయన లక్ష్యం.
ఆయన చూపు ననుసరించి మనం సమాజాన్ని కలయజూస్తే - నేలబారు జనపు జీవితాల్లో రాజుకుంటున్న సంఘర్షణ మనకు కనిపిస్తుంది. నీటి కోసం, నిప్పు కోసం, కూలి కోసం, పని చేసుకుని తినే హక్కుకోసం, గొరవంగా బ్రతికే హక్కు కోసం ఘర్షణ పడుతున్న సమూహాల నుండి పాత్రలనెంచుకుని, వారిపై లెన్స్ నుంచి వారి అంతరంగ దర్శనం చేయించడం ఈ కథల్లో మనం చూస్తాం. తాను తయారుచేసిన వస్తువు మీద తనకు హక్కుందని చిన్నకొడుకు ప్రకటించడం తీర్పు కథాంశం.
గౌరవంగా పని చేసే హక్కును నిలబెట్టుకోడం కోసం - వారానికొక సెలవు కావాలని పనిమనిషి అంకాలు నిలదీయడం ఆదివారం కథాంశం. అసహాయురాల్ని చేసి, స్వంత యింటిలో తన అక్కను తలదాచుకోనీకుండా చేసిన సమాజపు క్రౌర్యం, అది ఎనిమిదేళ్ల సంగిని పెట్టిన హింసా, పర్యవసానంగా కనిపించని శత్రువు మీద పోరాటానికి సిద్ధమైన సంగి ఆవేశమూ – హింస కథలో చూస్తాం.
రాత్రంతా ఒకే పక్క మీద జంటగా గడపాలనేది ఎందరికో తీరని కల. డబ్బులు సమకూర్చుకుని, కనీసం ఒక్క రాత్రి భార్యతో ఏకాంతాన్ని అనుభవించాలని - రూం కోసం వెతుకుతాడు నూకరాజు. తోటి మనుషుల నుంచి కనీస మర్యాద ఆశించడమే అతని సంఘర్షణ. కేపిటలిజం ఫలితమైన మొబిలిటీ బెట్వీన్ ద క్లాసెస్ కనిపించినా నో రూం లో లాడ్జిని ఇప్పటి ఫైవ్ స్టార్ హోటళ్లతో పోలిస్తే మనకి వాస్తవం బోధపడుతుంది. కులవివక్ష నక్కి కూచున్న అనేకానేక సామాజిక కోణాలలో ఒక చీకటి మూల నోరూం కథ.
పగలంతా కూలి పనికెళ్లి, సాయంత్రం ఏపూట దినవెచ్చాలు ఆ పూట తెచ్చుకునే జీవితాలు మాలపేటలోని సన్ని వంటి వారివి. ఆమె కూలి డబ్బుల మీద ఆశ వల్ల కలహం పెంచుకున్న అమ్మ, అత్త – నిజానికి పోరాడేది ‘బతుకు భయం’ తోనే. తమ బతుకుల పగ్గాలు తమ చేతిలో లేవన్న నిజం నిర్వీర్యం చేస్తుంటే సన్ని, ఆమె భర్త – పడే పెనుగులాట ఆర్తి కథ.
కాటు వేసే శత్రువు కనబడితే - అది దూరింది తన ఇంటిలో కాకున్నా – మట్టుపెట్టడం తన ధర్మం అని నమ్మి, ఆపోరాటంలో - ప్రాణభయం మీద విజయం సాధించిన సత్తెయ్య గాథ. లోకమంతా తన ఇల్లేనని భావించగలిగిన, లోకోత్తరుల కథ భయం.
తమ శ్రమకు తగిన ఫలితాన్నివ్వమని యాజమాన్యంతో చేసే పోరాటమొక వైపైతే, శాంతి పేరిట - వారు గొంతెత్తడాన్ని సైతం అణచివేసే ప్రభుత్వ యంత్రాంగంతో చేసే పోరాటం మరొకవైపు –కనిపిస్తుంది శాంతి కథలో. బతికినంతకాలం చలితో పోరాడి, చచ్చాక ‘ నాయిన్నాళ్ల సలీ కాష్టమ్మీనైనా కాలిపోవాల’ – అనేది నారమ్మ. ఆమె శవాన్ని కాల్చేందుకు కట్టెలు తేలేక అలమటించే కుటుంబాన్ని చూస్తాం చావు కథలో.
తాగడానికి నీరు లేని గ్రామస్థులందరి చేతా మహజర్లు రాయించి, ఊరికి కుళాయి తెప్పిస్తాడు రావుగారు. ఫలితం – రోజు కొక్క గంట వచ్చే వీధి కొళాయి ముందు మొత్తం ఊరిజనం, ఇల్లూ తోటా తడుపుకునే సదుపాయం ఏర్పాటు చేసుకున్న రావుగారూను. ఒక్క బిందె నీళ్ల కోసం, మానాభిమానాలు చంపుకుని మరీ రావుగారింటి గేటు దగ్గర చేసే యుద్ధం జీవధార కథ.
ఒక్కొక్క కథా ఒక్కొక్క జీవిత శకలానికి ప్రతిబింబం అన్న మాట నిజమే అయినా కూడా సమగ్రంగా అవన్నీ కలిపి ఇచ్చే అవగాహన కూడా ప్రత్యేకించి తెలుసుకోవలసిన విషయం. ఒక కథను అర్ధం చేసుకోడానికి వేరే కథలు సహాయపడతాయి. ఇంకోలా చెప్పాలంటే ... ఒక కథను చదివి గ్రహించిన దాని కంటే మొత్తం ఈ కథలన్నీ చదివిన తర్వాత అదే కథలోంచి గ్రహించగలిగే సారం మరింత ఎక్కువ.
భావజాలాల పై ప్రశ్న:
ఒక తరంలో దోచుకోడం, అణచి ఉంచడం, తమ స్వంత బలంతో సాగించే అపకారం. అది తరతరాలుగా సాగడానికీ, జనం ప్రవర్తనని శాశ్వతంగా శాసించేందుకు - ఏర్పరిచిన – పీడనకి తోడ్పడే భావజాలాలని – గుర్తించడం రచయితగా తన బాధ్యత అని కారా భావిస్తారు. అందుకే ఆయన కథల్లోని పాత్రలు – తమచుట్టూ జరుగుతున్న మోసం చూసి ప్రచారంలో ఉన్న నీతుల్ని ప్రశ్నిస్తూ ఉంటాయి. ఉదాహరణకి – తీర్పు కథలో రెండో కొడుకు మేనత్తతో - పంచిన వాళ్లు పాపాన పోతారని సామెత నువ్వే చెప్పేవు కదా, నువ్వు పెద్దదానివి, నిన్ను నరకానికి పంపడం ఇష్టం లేదు, అందుకే ఆపాపమేదో నేనే మూటగట్టుకుంటున్నాను అంటూ తానే పంపకం చేస్తాడు. అలాగే ఆదివారం కథలో పనిమనిషి అంకాలు గురించి ఇంటావిడ కోడలు పాత్రతో – “ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేయడం నేర్చిన మనిషి, మనసులో విషయం దాచి మసిపూసి మారేడు కాయ చెయ్యడంలో మాకన్నా రెండాకులు ఎక్కువ చదివింది” అనిపిస్తారు. యజ్ఞం కథలో సీతారాముడు – “ఏరి కంటి క్కనపడకండా నువ్వేం సేస్తన్నావో – అదే పని నలుగురికీ కనపడేటట్టు నానూ సేసేను” అని తన కొడుకు శవాన్ని చూపిస్తాడు. ఆ మాటకి అర్ధం – ఒకరి జీవనభృతి లాక్కోడమంటే వారి భవిష్యత్తరాలని హత్య చెయ్యడమే అని.
శాంతి కాముకులు:
దొంగిలించే దాని కన్నా దోచితే చిక్కేది ఎక్కువని తెలుసుకుని కొందరూ, అవేవీ తెలియకుండానే జన్మసిద్ధంగా అందిన వనరుల వల్ల ఇంకొందరూ – ఈ ఆర్ధిక చట్రంలో సౌకర్యవంతమైన స్థానాలలో చేరతారు. వారికి పోరాటాలంటే చెప్పరాని కంపరం. వారి గురించి శాంతి కథలో ఇలా చెప్తారు – “స్వేచ్ఛగా మసలడానికో ఇల్లూ, కట్టేందుకు ఖరీదైన గుడ్డా, అమిరిన వాళ్లందరికీ శాంతి కావాలి.
ఇవన్నీ అవరకపోయినా, వాటిని ఆర్జించుకునే అవకాశం దొరికిన వాళ్లకి దాన్నుపయోగించుకుని పెరగడానికి శాంతి చాలా అవసరం.
ఈ తక్కువ కాలంలోనే అందిపుచ్చుకున్న అవకాశాల్తో అవలీలగా ఆస్థులు సంపాదించుకున్న పెద్దలకు తామే కాక తమ తరువాతి తరాలు కూడా నిష్పూచీగా నిరాటంకంగా అనుభవించేందుకు సుస్థిరమైన శాంతి తప్పకుండా కావాలి. కాని దురదృష్టమేమిటంటే ఈదేశంలో అలాటివాళ్లు చాలా తక్కువమంది ఉన్నారు.” అందుకే కథలన్నిటిలోనూ ఒక ఇనెవిటబిలిటీ ఉంటుంది – పోరాటం వారికెలా తప్పనిసరౌతోందో విప్పి చూపే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఆకథలు.
ఎవరో రెచ్చగొడితేనో లేక మరెవరో చేయిస్తేనో పోరాటాలు జరుగుతాయని మనలో చాలా మంది భావన. కానీ కారా చూసిన సత్యం అది కాదు. అజ్ఞానంతోనో, మరి నిషాతోనో కళ్లుమూసుకుపోయినప్పుడు తప్ప – ప్రపంచంలో ఘర్షణ లేని శాంతి దొరకదు – అని ఖండితంగా చెప్తాడు శాంతి కథలో కథకుడు. ఈ విషయం కారా కథామాలికలకు ఒక దారం వంటిది.
సంపద ఒక చోట కూడి పడి ఉన్నంత కాలం తమ జీవనావసరాల కోసం – ప్రజలకు ఆ సంపద వైపు అడుగు వెయ్యడం తప్పనిసరే. దాని వల్ల అలజడి రేగి – సంపదల ధర్మకర్తలు - భయపెట్టినా, బెదిరించినా, శాంతి పన్నాలు వల్లించినా- ఆ ప్రజలు సంపద పై తమ హక్కును ప్రకటించక తప్పదు.
చావు కథలో సీతయ్య ఇలా అంటాడు: “బతికున్న మనిషైతే నీదీ నాదీను, చచ్చిన శవం ఊరందరిదీనూ.
మరి దానిక్కర్రలు కావాల, నిన్నూ నిన్నూ అందర్నడిగినాం, మీరెవ్వరివ్వలేదు. అవి ఉంటే గాని నాగ్గడవదు. అవక్కడున్నాయి. అందుకని తెచ్చినాను. నువ్వు నామీద కేసే ఎట్టు, పోలీసులకే అప్పసెప్పు, కాదని నన్నురి దీసీసినా – అయినా నాకవుసరమైతే నాను తేకమానను.”
అలాగే జీవధార కథ ముగింపులో కథకుడు ఇలా అంటాడు: “ కసురుకున్నా విసుక్కున్నా కుక్కల్నీ పోలీసుల్నీ చూపి భయపెట్టినా లేనివారు కలవారి నిబ్బంది పెట్టక వల్లకాదు.”
అయితే మరి శాంతి కాముకుల మాటల్లో, చేతల్లో ఒక రైటియస్‌నెస్ (ధర్మాత్ములమన్న నమ్మకం) ఉంటుంది. అప్రజ్ఞాతం, యజ్ఞం, కథల్లో – సూరప్పడూ, శ్రీరాములు నాయుడూ ఆ కోవకు చెందిన వాళ్లు. నలుపూ తెలుపులకి అలవాటుపడిన పాఠకులకి వారి సంక్లిష్టత చప్పున అర్ధంకాదు. వారి పాత్ర చిత్రీకరణని లోతుగా పరామర్శిస్తే - దోచుకోబడే వారికే కాదు, దోచుకునేవారి క్కూడా ఛాయిస్ ఉండదనే – అనే కీలక విషయం మనం అర్ధం చేసుకోగలుగుతాం. ఈ వ్యవస్థలో వారి పాత్ర ఏమిటో, వారి హద్దు లేమిటో స్పష్టంగా తెలియజెప్పే వాక్యం – యజ్ఞం లోనే ఉంది - ఆళ్లకి ఆళ్లు సేసుకోలేని మంచిని నువ్వు సేసినంతకాలఁవే నీ రాజ్జెం. లాబీయింగ్‌లు జరిగేది ఎవరి కోసమో, జరిపేది ఎవరో తెలిసిన పాఠకులకి ‘ఆళ్లు’ ఎవరో, ఆ ‘మంచి’ ఏమిటో సులభంగా అర్ధమౌతుంది. ఆ అంశాన్ని మరో చోట ఇలా వివరిస్తారు – ‘ప్రభుత్వాల మనుగడ పెంట మనుషుల చేతుల్లోనూ, పెద్ద మనుషుల ధన ప్రాణ మానాలు ఆ ప్రభుత్వం చేతిలోనూ చిక్కుకున్నాయి.’ ప్రజాస్వామ్యపు బలమూ, బలహీనతా ఈ వాక్యంలోనే ఉన్నాయి తెలుసుకోగలిగితే.
ఈకుట్రలూ, దోపిడీలూ జరిగే పద్ధతిని తెలుసుకోకనే నిరు పేద వర్గాలు – నీరుకూ, నిప్పుకూ, గూడుకూ, చివరికి శారీరక అవసరాలకు కూడా మొహం వాచిపోయిన సమూహాలు ... వారిలో వారే పోటీలు పడుతూ – తలోదారీ పడుతున్నారని, వారికి అసలు నిజం చూపడమే సాహిత్యకారుల కర్తవ్యమనీ కారా నమ్ముతారు. వారిలో ఐక్యత ఎందుకు లోపిస్తుందో ఆర్తి కథలో చర్చిస్తారు. నేలబారు జనం గురించి చాలా మంది కుండే తేలిక అభిప్రాయం నాయుడు మాటల్లో వినిపిస్తుంది. “తొత్తు కొడుకులు వొళ్లు కొవ్వెక్కి తెగ బలిసున్నారు. కన్నూ మిన్నూ కానక కొట్టుక సస్తున్నారు”. దానికి నారాయుడు – పొలాల్లో కూలి పనికెళ్లినా, చిన్న బంజరు ముక్కమీద పని చేసుకున్నా, పట్నానికెళ్లి సంపాదించినా – ఏది చేసినా తిండికి చాలని తమ సంపాదనల గురించి వివరించి - ‘అదుగో ఆ కడుపు గోలల్లో పుట్టింది బాబూ ఈ మంటంతా’ అంటాడు.
తన జీవితకాలంలోనే – కొందరు ధనవంతులవడం, మరి కొందరి సంపాదనలు పడిపోతున్న – ఈ నిష్పత్తి - చావు కథలో తాత కూడా గుర్తిస్తాడు – “ఒకడు నెగిసేసరికి 100 మంది, పది మంది నెగిస్తే యేల కొద్దీ రాలతన్నారు – జనం.” ఆ లేచేవారిలో ఒకరో అరో తన వాడున్నా – (జనం తాలూకు అజ్ఞానం మీదా, ఆకలి మీదా – ఆ రెంటి బాధా లేని వాళ్లలో – తన ప్రభావం ద్వారా నాటిన దురాశ మీదా ... బతికే వ్యవస్థ కనక) ... “మన్లో సూడగల తొత్తుకొడుకెవడేనుంటే, మన్నాడే ఆల్లల్లో కలిసిపోతున్నాడ’’ న్న తాత మాటలు నిజమే అన్పిస్తాయి.
ఈ నిరాశాజనక స్థితిలో రచయితల కర్తవ్యం గురించి కారా కొక స్పష్టమైన అభిప్రాయముంది - ఒక ప్రశ్నకి సమాధానమిస్తూ - సమకాలీన పోరాటాల ఫలితంగా (దళిత రాజకీయాలు, ఫెమినిస్ట్ ధోరణులు) వారిపై జరుగుతున్న అణచివేత, పీడనల గురించిన స్పృహ ఈ రెండు వర్గాలలోనూ చైతన్యంగా పరిణమిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సామాజిక విప్లవాల గురించి చదివే వాళ్ల అవగాహననీ, స్పృహను, చైతన్యాన్నీ, నిబద్ధతను, నిమగ్నతను ఏ దశ నుండి ఏ మేరకు పెంచేదైనా – విప్లవ కథేనని ఆయన నమ్మకం.
ఏ సందర్భాల్లో ప్రజలు ఏకమౌతారన్న ప్రశ్నకి – చావు కథలో అప్పారావు మాటల్లో మనకి జవాబు స్ఫురిస్తుంది. అవుసరం, నిజంగా నీకవుసరం కావాల, అదుంటే అప్పుడే అనుమానాలూ ఉండవు, ఇన్ని డొంకతిరుగుళ్లూ ఉండవు. అలాగే జీవధార కథలో “ఒలే రాండర్రా! ఇక్కడీల్లు కుక్కల్ని ఉసిగొలుపుతారట!” అన్న సత్యవతి పొలికేక విన్న ఆడవాళ్లు “ఇక్కడ నీళ్లిస్తారు” అన్నట్లు అర్ధం చేసుకున్నారేమో పోటీలు - పోటీలు పరుగులెడుతున్నారని రాస్తారు. ప్రజల నిజమైన అవసరాలను గుర్తించిన నినాదాలతో ప్రజలు గొంతు కలుపుతారని అనిపిస్తుంది.
అసమాన బలాల మధ్య పోరాటం:
ఇందాక చెప్పుకున్నట్టు – కొన్ని పాత్రలు తప్పనిసరి అయి పోరాటం గనక చేస్తాయి గనక అసమాన బలాల మధ్య పోరాటం కారా కథల్లో ప్రముఖంగా కనిపిస్తుంది( ఉదా. వధ, వీరుడు మహావీరడులో అక్షరాలా యుద్దమైతే, శాంతి, జీవధార వంటి వాటిలో వనరుల కోసం, హక్కుల కోసం పోరాటం). గెలవగలనన్న నమ్మకంతో కాక తలపడక తప్పదన్న స్పృహతో చేసే పోరాటాల వర్ణన ఉంటుంది వాటిలో.
ప్రత్యర్ధి బలాన్ని అర్ధం చేసుకున్న పాత్రల నుంచి మనకి వాస్తవం తెలుస్తుంది. బలం అంటే అంగ బలమో అర్ధ బలమో మాత్రమే కాదని. నోరూంలో మేస్త్రీ తన స్కిల్, దానితో తయారైన యజమాని మేడ – ఈ రెంటినీ పోలుస్తూ - ఇలా అంటాడు- ఆడి సొత్తు ఆడు నీకందకండా దాయగలడు. నువ్వలా దాయలేవు. పనోడితో వచ్చిన సావే అది.
సమిష్టి జీవితాల పెద్ద కేన్వాసును తీసుకున్నప్పటికీ - మొత్తంగా కలిపి చూసినప్పుడు - పోరాడే వ్యక్తుల చిత్రీకరణలో కొన్ని రంగులు ప్రస్ఫుటంగా కనిపించడం గమనించవలసిన విషయం, సంఘర్షణకి లోనౌతున్న పాత్రల మానసిక అవస్థల్లో రకరకాల స్థాయిలు కారా కథల్లో మనకి ఎదురౌతుంటాయి. చాలా చోట్ల రచయిత పాత్రల్లోని ఉద్రేకపు భావన ఏ స్ధాయిలో ఉందో వివరిస్తూ ఉంటారు. ఏం జరుగుతోందో తెలియని ఆరాటం, కష్టాలను ఓర్చుకోలేక ఆక్రోశం, దానికి కారణమైన మనుషులను చూసి ఆవేశం - కనిపిస్తాయి. ముఖ్యంగా బలమైన శత్రువుతో తలపడేట్టు చేసేది ఆవేశమే.
ఆవేశం:
ఈ సందర్భంలో ఆవేశం గురించి కారా అవగాహన ఏమిటన్నది అప్పుడప్పుడు ఆయన చెప్పిన మాటల్లో – ‘ఆవేశం గొప్ప చోదకశక్తి. మనుషుల్లో మందిలో జాతుల్లో ధైర్యం సాహసం తెగువ త్యాగం లాంటి సుగుణాలన్నిటి వెనకా ఉండేది ఆవేశమే.’ పోరాటాలను ఇంత నిశితంగా పరిశీలించి, రికార్డు చేసిన కథలని చదివేక – పాత్ర ఎమోషన్ల వర్ణన ద్వారా, ఆయన దర్శించిన జీవిత సత్యమేదో మనకి అందిస్తున్నారని నాకు తోచింది. ఆవేశం ఉద్రేకపు స్థాయిని దాటితే గాని పోరాటంలో విజయం సాధించలేమని కారా అనుకుంటారేమో. ఉదాహరణకి తీర్పులో మోసాన్ని గ్రహించిన రెండో వాడి గురించి ఇలా రాస్తారు– ‘వాడి పెదవులు ఎంత ఆపుకున్నా ఆగక వణుకుతున్నాయి. అలా వణకడం వాడికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు.’ వధ, వీరడు – మహావీరడు కథల్లో కూడా ఆవేశానికి లోనై పోరాటం సాగించడం అనేది ఓటమి వైపు అడుగుపడినట్టు సూచించడమూ కనపడుతుంది.
బలవంతుడికి ఉండే ధీమా వల్ల వాడి ధోరణి ఎలా ఉంటుందో ఈ వర్ణన చూస్తే తెలుస్తుంది. ఉదాహరణ - వధలో వాలి. ‘పోరులో వాలి ఆయాసపడడు, ఎదిరిని దెబ్బ తీయడానికి ఉద్రేక పడడు. ఎదిరి మీది మీదికి వస్తే ఆవేశపడిపోడు. వెనవెనక్కు అడుగు వెయ్యడానికి సిగ్గు పడిపోడు ... మళ్లీ ఆవేశపడి వచ్చేవరకూ వేచి ఉంటాడు.’
దానికి విరుద్ధంగా సుగ్రీవుడు – ‘అడవుల పట్టిన వాడు, అష్టకష్టాలు పడుతున్న వాడు, అన్యాయాలను తలంచుకుని ఆవేశపడేవాడు’
ఒక అంశం నాకు కారా కథల్లో చాలా ఆసక్తికరంగా తోచింది – విజయానికీ, ఉద్రేకానికీ ఏదో తకరారున్నట్టు అనిపించింది. విజయాన్ని సాధించిన పాత్రలన్నీ ఉద్రేకాన్ని అదుపులోకి తెచ్చుకుని ప్రవర్తించడం కనిపించింది. అది ఒక దగ్గర మొండి ధైర్యంతో తిరగబడడమైనా, క్రమశిక్షణతో తమ ప్రణాళికను అమలు జరుపుకోడమైనా, సాహసంతో సంఘద్రోహులను సంహరించబూనడమైనా, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడమైనా. ఒక చైతన్యంతో స్వయంనిర్ణయాధికారాన్ని రీయిన్ ఫోర్స్ చేయడం కనిపిస్తుంది.
పోరాటం తప్పనిసరి అని తెలుసుకున్న పాత్రలను వారి అవగాహనల ప్రకారం ఒక స్కేలు మీద చేరిస్తే - నిర్లిప్తంగా తమకొచ్చిన కష్టాలన్నిటినీ తన వారికి కథల్లా వల్లించి చెప్పే చావు తాత ఒక చివర ఉంటే, తమ హక్కును నిక్కచ్చిగా అడగ్గలిగే ఆదివారం అంకాలూ, తీర్పు రెండో కొడుకూ... ఆ స్కేలు మీద మరి కాస్త ముందు నుంటారు. తనపర భేదమే పట్టించుకోని సత్తెయ్య (భయం) – పూర్తి పరిణతితో స్కేలుకు రెండో చివర నుంటాడు. అతని చరిత్ర చెపుతూ - తన భయం ఎలా పోయిందో, ఏ చైతన్యం అందుకు కారణమో గ్రహించగలిగే వూహ సత్తెయ్యకి లేదు అని వివరిస్తారు. అలాగే మరణపు అంచును ముట్టి వచ్చిన సుగ్రీవుడి విషయం – ‘ఏ తలపులు ఆవే(దే)శాలనిచ్చి ఆశలు వానికి జీవం పోశాయో తెలియదు.’
మూమెంట్ కేప్చర్:
పాము గురించి భయపడేవారికి సత్తెయ్య ఇలా చెప్తాడు - అదెప్పుడో కాటేస్తుందో యెయ్యదో. దాని బయ్యం మనిషిని తినేస్తుంటది పురుగు నాగ. ఎదురు తిరిగితే ఏటీ నేదు. నీ సెయ్యే పైని.
పాత్రలు ఆవేశం నుంచి చైతన్యం వైపు చేసే ప్రయాణంలో – అవి పొందే భయాన్ని కూడా మనం గుర్తించగలం. తర్వాత భయాన్ని దాటే ఒక ప్రత్యేక క్షణపు ప్రసక్తి వస్తుంది. ఆ క్షణాన్ని చాలా స్పష్టంగా పట్టుకుని మనకందిస్తారు కారా. ‘సత్యవతికి భయానికి బదులు రోషం పుట్టింది’ (జీవధార); ‘అక్కడి భయంకరమైన నిశ్శబ్దం కానీ, స్మశానాల్లోని ఆ ప్రశాంతత కానీ ఆమెని భయపెట్టలేదు’ (హింస); ‘ప్రాణం పోవడమంటే ఏమిటో తెలిసిన సుగ్రీవునకు ప్రాణభయం పోయింది.’ (వధ)
సత్యవతిలోనూ, సంగిలోనూ, సుగ్రీవుడిలోనూ, భయం అవధులు దాటాక ... దాని పై స్దాయికి వాళ్లు చేరుకోడం చూస్తాం. వీరంతా సామాన్యులే. కానీ పరిస్థితులు వారిని ఆ దిశగా తోసాక, వారిలోని అసాధారణ జీవశక్తి వారిని భయాన్ని జయించే స్ధాయిలో ప్రవేశపెడుతుంది.
చైతన్యం:
మన చుట్టూ జరుగుతున్న పోరాటాలను గమనిస్తే – ఆవేశమే ఎక్కువగా కనిపిస్తుందంటే తప్పు కాదేమో. మొదలవ్వాలిసింది దానితోనే కానీ కొనసాగాలంటే మాత్రం దాని తర్వాత స్థాయికి చేర్చాల్సి ఉంటుంది. అంతిమంగా విజయం చేకూర్చేది చైతన్యమే.
తనకు జరిగిన అన్యాయానికి ఒక మనిషి వ్యక్తిగతంగా కారణం కాదని తెలిసిన మీదట ఏది అసలైన కారణమో తెలుసుకున్నఅనుభవం (జ్ఞానం) మీద దానితో తరవాతి అడుగు ఎటు పడాలో నిర్ణయించుకుని, తనకే కాక తనవారిక్కూడా – సాయపడగలిగేదే చైతన్యం.
పోరాటపు పరిధిలో చైతన్యాన్ని ఇలా అర్ధం చేసుకోవచ్చు - వ్యక్తిగత స్ధాయిలో – సర్వసహజమైన ఉద్వేగాలూ, ఉద్రేకాలూ, భయాలూ – మనిషిని మరింత బలహీనుణ్నిగా చేస్తూ ఉంటాయి, సామూహిక స్థాయిలో లక్ష్యాన్ని విస్మరించేలా చేస్తాయి. చైతన్యం పొందిన -మనిషి - కోపాన్నీ, భయాన్నీ జయించుతూ అప్రమత్తుడై పోరాడగలుగుతాడు, సమూహం –శక్తుల్ని ఏకీకృతం చేసుకుని ఐకమత్యంతో పోరాటాలను కొనసాగించగలుగుతుంది
------------------------------
జనవాక్యం:
వర్తమానంలో జరుగుతున్న ఏ విషయం గురించైనా- చుట్టూ ఉన్న జనం ఏమనుకుంటున్నారనేది- జనవాక్యం. అది ఏ కాలంలోనూ అతి ముఖ్యమైన అంశమే. ఈ ఇంటర్నెట్‌ యుగంలో దాని ప్రాసంగికత ఊహాతీతమైన స్థాయికి పెరిగిపోయింది. ప్రజలకి తమ వాదం వినిపించే ప్రయత్నాలూ, మరే పక్షపు స్వరమూ వినిపించకుండా చేసే ప్రచారాలూ, వారిని తమవైపు తిప్పుకునే వ్యూహాలూ- ఒకరితో ఒకరు తలపడే పక్షాలన్నీ- తమ శక్తి మేరకు చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కాళీపట్నం రామారావు (కారా) రచనల్ని చదవడం ఉపయోగకరం. ఎందుకంటే-సమాజంలో నిత్యం, విడివిడిగా, రకరకాల రూపాల్లో సాగుతోన్న పోరాటాలు కారా కథలకి- ముడిసరుకుగా కనిపిస్తుంది. ‘వధ’, ‘వీరుడు మహావీరడు’లో ప్రత్యక్షంగానూ, ‘శాంతి’, ‘జీవధార’ల్లో- జీవితావసరం గానూ, ‘భయం’లో ప్రతీకాత్మకంగానూ- పోరాటం కనపడుతుంది.
పోరాటం జరిగిన చోటల్లా మూడు భాగాలుంటాయి. పోరాటం సాగించే రెండు ప్రధాన భాగాలైతే, తక్కిన ప్రపంచం- రెస్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌, మూడో భాగంగా ఉంటుంది. ఆ భాగం- తనను తాను తటస్థమనే భావించు కుంటుంది. కానీ నిజానికి అది ఎటోవైపు చేరుతూనే ఉంటుంది. తటస్థ పక్షం ఏవైపు మొగ్గుతోంది, దాని మద్దతు ఎవరికి లభిస్తోంది-అనే అంశాలు సమాజపు రూపురేఖలను నిర్ణయిస్తాయి. కారా కథా నిర్మాణంలో- ఈ మూడో విభాగపు నడవడిని గమనించడం, వర్ణించడం- ఒక ప్రత్యేకతని సంతరిచుకుంటుంది. తమ మధ్య జరుగుతున్న పోరాటాల పట్ల ప్రజల స్పందనను కారా అనేక కోణాల నుంచి చాలా కథలలో చిత్రించారు. మూడో పక్షానికీ- పోరాటానికీ ఉండే సంబంధం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానాన్ని ఆయన కథల్లోంచి రాబట్టే ప్రయత్నం చేస్తాను.
బలం ఉన్న జీవాలు బలహీనమైనవాటిని ఓడించడం- ప్రకృతి సహజం. అడవి దానికే అలవాటు పడి ఉంటుంది. దానికి విరుద్ధంగా జరిగితే అడవి స్పందన ఎలా ఉంటుందో ‘వధ’లో ప్రతీకాత్మకంగా వర్ణిస్తారు: ‘‘(వాలి సుగ్రీవుణ్ని చావగొడుతున్న) అంతవరకూ తమ నడిబొడ్డున జరుగుతున్న ఆ పోరాటాన్ని నిక్కి నిక్కి నిటారుగా, ఏ వంకకూ తలల చివరలైనా ఊపకుండా అతినిర్లిప్తతతో చూస్తూ ఉండిన మహావృక్షాలన్నీ (రాముడు వాలిమీద బాణం వేసిన) క్షణంలో శివమెత్తినట్లు- మొదళ్లను సైతం కదుపుకుని ఊగిపోతూ హోరుహోరుమంటున్నాయి. ఆ అదటుకి అరణ్యంలో ఉండే క్రూర సత్వాలన్నీ పిచ్చెత్తినట్టు బొబ్బరిస్తూ అరణ్యమల్లా పరుగులు తీసాయి. వాటిని చూచి, ప్రాణభయంతో సాధుసత్వాలు విరిగి బెదిరి కలవరపడి కల్లోలమై కలసి పరుగులు పెట్టాయి.’’
వన్య జీవనంలోనే కాదు, సంఘజీవనంలో కూడా దీనికి అన్వయం కుదుర్చుకోవడం- చాలా సులభం. మూడోముక్క- జనం- పోరాటాలకూ తమకూ ఏ సంబంధమూ లేదనుకుంటూ చోద్యం చూసే పార్టీ. కానీ దాని ఆమోదం- సర్వసాధారణంగా బలవంతులవైపే ఉండడం అందరం గమనించే విషయమే.
కేవలం ప్రజల ఆమోదం కోసం కాక, తమ పక్షంలోని న్యాయాన్ని వారి ముందుకు తెచ్చి, వారి సహాయాన్ని అపేక్షించే ప్రయత్నాలూ జరుగుతాయి. కానీ వాటిలో నూటికో కోటికో ఒకటే ప్రజలని తాకుతాయి. అలాటి వాటిని సైతం పక్కదారి పట్టించగల వైనాల గురించిన చర్చ ఉంటుంది- ‘వీరుడు మహావీరడు’ కథలో. ‘వధ’లో రాముడు బలహీను డైన సుగ్రీవుడి పక్షానచేరి వాలిని కూల్చితే, ఇందులో మాత్రం కొత్తపేట శాండో ‘‘తంతున్న అల్లిపురం వస్తాదుని వదిలేసి- తాపులు తింటున్న’’ గంజిపేట రౌడీ ఎముకలు విరుస్తాడు. అంతవరకూ గంజిపేట రౌడీ వైపు సింపతీతో ఉన్న జనం రెచ్చిపోయి అతని మీద తలో చెయ్యి వేసే పరిస్థితి వస్తుంది. ప్రజాభిప్రాయాన్ని చిటికెలో (ఏ)మార్చగల కొత్తపేట శాండో ద్వారా ప్రజల విచక్షణ మీద వ్యంగ్య విమర్శ చేస్తాడు కథకుడు: ‘‘అవును గురూ అలాటోళ్లు, ఏటనుకుంటారంటే, జనం జూస్తూ అన్నేయాలు జరగనిస్తారా అనుకుంటారు. అనుకుని- న్యాయం ధర్మం- అని పెద్ద పెద్ద కబుర్లతో చిక్కుల్లో పడతారు. పడి ఒకళ్లకి తెద్దునా, అందరికీ తెద్దునా అని క్రైసీసులు సృష్టిస్తారు. ఒక్కసారి జనం సంగతేంటో తెలిస్తే మరింకెప్పుడూ అలాటి ఎర్రి కుట్టి ఏషాలెయ్యడు.’’
ప్రత్యక్షంగా జరుగుతున్న పోరాటంలో ప్రజలు బలహీనుడిని ఒంటరిని చేసిన కథ ఇదైతే, ‘యజ్ఞం’ కథలో అది దండలో దారంలా దాగి ఉంటుంది. తనకి జరిగిన అన్యాయాన్ని వివరించడానికి మూడు రోజుల పాటు ప్రయత్నిస్తాడు అప్పల్నాయుడు. కానీ ప్రయోజనం ఉండదు. ప్రజల సానుభూతిని అర్థించేవారికి అది దొరుకుతుందని గాని, దొరికినా అది ఉపకరిస్తుందని గాని చెప్పలేం. ఏ పరువు కోసం మాట తప్పని వాడినని అతను నిరూపించదల్చుకున్నాడో- ఆ ప్రజామోదాన్ని కథకుడు చీదరించుకుంటాడు: ‘‘అప్పల్రాముడు, అతని సంతతీ- భూమినమ్మేందుకు పత్రాల వేలి ముద్రలు పెట్టడం అంతా అయ్యాక- జనం సానుభూతి రాముడి వంక ప్రవహిస్తోంది. దేనికా ప్రవాహం మురుగు నీరు దాని కన్నా నయం.’’
ఇంచుమించు అలాటి అవగాహనే ఆదివారం కథలో అంకాలుది కూడా. తన హక్కు దక్కించుకోడానికెంతైనా దృఢంగా నిలబడుతుంది. శ్రమ విలువతో పోలిస్తే- ఆమె దృష్టిలో పరువు గుడ్డి గవ్వ పాటీ చెయ్యదు. అందుకే- రెండు రూపాయలెక్కువ పుచ్చుకునైనా సరే, ఆదివారం నాడు మాత్రం పనిలోకి వచ్చి- చుట్టాలు పక్కాలలో తన పరువు నిలబెట్టమని యజమానురాలంటే- ‘‘అంకాలు పక పక నవ్వింది. నవ్వుతూ నవ్వుతూ నా వంక తిరిగి ఆ నవ్వుతోనే- ‘సూడమ్మా యీ యమ్మ మాటలు! దాసీ ముండన్నేనట- యీ యమ్మ పరువు నిలబెట్టాలట!’ అంది. ఆ పరువేపాటిదో చూడన్నట్టు, అందుకా ఆ రెండు రూపాయలన్నట్టు.’’
పరువూ, ప్రజామోదాన్ని లెక్కచెయ్యనివారి సంగతి వదిలేస్తే- ప్రజల మద్దతు కోరే వారికైనా అది లభించొద్దా? ఇక తటస్థ వర్గం ఎప్పటికీ బలవంతుల వైపే మొగ్గుతూ ఉంటుందా? తన కన్నా బలవంతుడైన ప్రత్యర్థితో పోరాటం చెయ్యడమూ తప్పక, చుట్టూ చూస్తూ ఉన్న ప్రజలు సైతం, ఆ బలవంతుడి పక్షమే అవుతూ ఉంటే- నిస్సహాయంగా నేల కూలడమే బలహీనుడి వంతా? కారా కథల్లో కనిపించే వాస్తవం ఇదేనా లేక మరేదైనా పార్శ్వం ఉందా?
ఈ ప్రశ్నలకి సమాధానం దొరకాలంటే ముందు ఒక మౌలిక ప్రశ్నని వేసుకోవాలి. అదేమిటంటే- పోరాటాలలో ఉన్నవారు- జనం పట్ల- ఏ వైఖరి అవలంబించవలసి ఉంది? దానికి సంపూర్ణమైన సమాధానం- ‘భయం’ కథలో సత్యం పాత్రలో దొరుకుతుంది. సత్యం చిన్నప్పుడే తన శత్రువును గుర్తించి జీవితమంతా పోరాడుతూనే ఉంటాడు. ఆ శత్రువు పేరు- భయం. తనలాగే తన తోటి వారందరిలోనూ భయం ఉందని గుర్తిస్తాడు. తనని ఆదుకోవడానికి వచ్చినవారికే- సహాయం చెయ్యడానికి వెరిచే వ్యక్తి సుబ్బాయమ్మ. ఆమె వంటి వారి స్వార్థానికి కారణం కూడా భయమేనని తెలుసు అతనికి. తన పర భేదాన్ని గుర్తించని విశ్వకుటుంబీకుడౌతాడు.
పోరాటంలో అలిసిపోయి కూలిపోతాడేమో కాని ఓడిపోడు. తనకోసం భార్యని ‘‘ఏడనియ్యడమ్మా! దాన్ని ఏణ్నియ్యడు! దాన్నే కాదు ఎవళూ ఏడవొద్దంటాడు,’’ అన్న వాక్యం వెనకాల ప్రజల నుంచి సానుభూతిని కోరని అతని విశ్వాసం కనిపిస్తుంది.
సత్యంవంటి నాయకులు తన సహచరులకి జ్ఞానం అందించ గలుగుతారు. జీవితం మనిషిలో మార్పు తెస్తుంది. అందుకు అనుభవం కారణం అవుతుంది అంటారు కారా. ఆనాటిదాకా- నిత్యం చూసే మందే, మందలోని పశువులే- కొత్తగా కనపడడం మొదలౌతుంది గురువులికి. లోగుట్లు కనిపెట్టగల విద్య పట్టుబడుతుంది- సత్యంతో జరిగిన అనుభవం కారణంగా.
ఎలాటి అన్యాయాలు తమ మధ్య జరిగినా పట్టనట్టుండే జనాన్నే కారా కథల్లో చూసిన మనకి,- ‘భయం’ కథలోని జనవాక్యం పూర్తిగా భిన్నంగా వినిపిస్తుంది. ‘‘ ‘...బతికిన్నాడూ, సచ్చిన్నాడూ బయఁవెరగడు మనిషి, పాఁవుమీద పగపట్టిన్నాడే, పేణాలమీద ఆశ ఒగ్గుకున్నాడు... అంసలాగ బతికిందికి ఆర్నెల్లు సాలు! ఉంటాం, నువ్వూ నేనూ. ఎంత కాలఁవైనా ఒక్కటే...’- జనం ఎన్నెన్నో విధాల చెప్పుకుంటున్నారు.’’ సత్యం పోరాటం పట్ల ప్రజల స్పందన మన ప్రశ్నలెన్నిటికో జవాబులు దొరికే దారి చూపిస్తుంది.
సమాజంలో పోరాటాలు ఏయే కారణాల వల్ల మొదలౌతాయో, వాటి ఫలితాలెలా ఉన్నాయో, అవి ప్రజలమీద ఎలాటి ప్రభావాన్ని మిగిల్చాయో- దగ్గరనుంచి పరిశీలించి- ఆ పరిశీలనా సారాన్ని ఒక్కో కథగా మలిచినట్ట నిపిస్తుంది. పోరాటాలని వర్ణించేటప్పుడు- ప్రత్యర్థుల హావభావాలనీ, తద్వారా మానసిక స్థాయిలనీ తెలియజేయడం కారా కథల ప్రత్యేకత. ఆవేశంతో పోరాడుతున్నవారు ఓటమివైపూ, ఆవేశాన్ని అదుపు చేసుకున్న వాడు గెలుపువైపూ అడుగు వేస్తున్నట్టు కథలలో చాలాసార్లు కనిపించడం యాదృచ్ఛికం కాదు. భయం మీద విజయం సాధించి, ఆవేశపు తదుపరి స్థాయి చైతన్యాన్ని చేరినవారే పోరాటాల దిశ మార్చగలుగుతారు. ప్రజలలో సహానుభూతినే కాక ధైర్యాన్ని కూడా నింపగలుగుతారు. వారిలో పోరాటాలపట్ల సంఘీభావం కలగాలంటే- ఎటువంటి కార్యాచరణ ఉండాలో దానికి సత్యం పాత్ర నమూనాగా కనిపిస్తుంది.