Wednesday 6 January 2016

"నేను జితేందర్ భార్య రేఖను, చర్మకారుల కులానికి చెందినదానిని!"


      హర్యానా దళిత పిల్లల సజీవ దహనం పై నిజనిర్ధారణ.                                     



హర్యానా రాష్ట్రంలో, ఫరీదాబాదు జిల్లాకు చెందిన, సున్పెద్ గ్రామంలో ఒక దళిత కుటుంబం మీద ప్రాణాంతకమైన దాడి జరిగింది. ఇద్దరు చిన్న పిల్లలు సజీవదహనం అయ్యారు. తీవ్ర దుఃఖావేశం కలిగించిన ఈ సంఘటన జరిగిన తరువాత జాతీయ దళిత మానవ హక్కుల ప్రచారకమిటీ మరియు జాతీయ దళిత న్యాయ పోరాటం కలిసి నిర్వహించిన నిజనిర్ధారణ రిపోర్టు

సున్పెద్ లో, 2015అక్టోబర్ 19న, జాగరణ (ఒక భజన వంటిది) జరిగినది. దాల్చంద్ కుమారుడు జితేందర్, జితేందర్ భార్య రేఖా, వారి ఇద్దరి పిల్లలతో ఆ జాగరణకు వెళ్లి, అచ్చట నుండి త్వరగా ఇంటికి వచ్చారు. కిటికీకి పక్కనున్న మంచం మీద నిద్రకు ఒరిగారు. కిటికీ తెరిచి ఉన్నది. తెల్లవారుజామున 2:30కి, ఘాటైన పెట్రోలు వాసనతో జితేందర్ మేలుకున్నాడు. కిటికీ బయట నించున్న మనుషులు కుటుంబసభ్యుల మీద పెట్రోల్ పోయడం కనిపించింది. అతను భార్యను లేపేటంత లోపే మంటలు చుట్టుముట్టాయి. మంటలను తప్పించుకునే వీలు లేకుండా గదికి ఉన్న రెండు ద్వారాల తలుపులూ బిగించి ఉన్నాయి. జితేందర్, రేఖల పది నెలల వయసు కూతురు దివ్యా, సంవత్సరంన్నర వయస్సున్న కొడుకు వైభవ్ మంటలలో చిక్కుకుని మరణించారు.

కొన్నివార్తా సంస్థలు, ఆ పిల్లలు డెబ్భై శాతం పైన కాలిన గాయాలతో మరణించారన్నవిషయం చెబ్తున్నాయి. 

వారి తల్లి రేఖ సఫ్ దర్జంగ్ ఆసుపత్రిలో ఇప్పటికీ విషమస్థితిలోనే ఉంది. వారి తండ్రి జితేందర్ చేతుల పైన కాలిన గాయాలతో, ఆసుపత్రి నుండి బయటపడి ఫరీదాబాదులోని సున్పేడ్ గ్రామంలో ఉన్నాడు.
ప్రస్తుత సంఘటన గురించిన వివరాలలోకి వెళ్ళే ముందు ఆ కుటుంబం గురించీ, గ్రామ పరిసరాలకు సంబంధించీ –సాంఘిక, ఆర్ధిక, రాజకీయ భూమికలను పరిశీలించడం ఆవశ్యక మౌతున్నది. అప్పుడే, ఈ దళిత కుటుంబం సున్పెద్ గ్రామంలో జీవించేందుకు వీలు లేకుండా చేసిన పరిస్థితుల పూర్తి సమాహారాన్ని మనం అర్ధం చేసుకోగలం.
ఈ సంఘటన కు ‘రెండు కుటుంబాల కలహం’ కారణమనీ, కుల ప్రసక్తి లేదనీ - కొన్ని వార్తాసంస్థలూ, క్షత్రియ, బ్రాహ్మణ, రాజపుత్రుల కూటమి ఐన మహాపంచాయత్ పేర్కొన్టున్నాయి. మేము సున్పెద్ గ్రామంలో రాజపుత్రుల నిస్సందేహమైన ఆధిపత్యాన్ని గమనించాక, ఈ కథనాలు పూర్తిగా అబద్ధమని తేలాయి. కనక ఈ పోరాటం - సమానుల మధ్య జరుగుతున్నది కాదూ, కుల ప్రమేయం లేనిది కూడా కాదు!
హర్యానాలో, ప్రీత్ల నియోజకవర్గానికి చెందిన ఫరీదాబాదులో ఈ సున్పెద్ గ్రామం ఉంది. దానిలో 250కి పైగా రాజపుత్ర కుటుంబాలూ, 15 వాల్మీకి కుటుంబాలూ, 80 చర్మకారుల కుటుంబాలూ, ఇంకా మరికొన్ని ఇతర కులాల కుటుంబాలూ ఉన్నాయి. గ్రామంలో అత్యధిక భూభాగం రాజపుత్ర కుటుంబాలకు చెందినదీ లేదా వారి ఆధీనంలో ఉన్నదీ. ప్రభుత్వ సంస్థల్లో కూడా వారి మాటే చెల్లుబడి అయ్యే పరిస్థితి. పాఠశాలలూ, కాలేజీలూ, బాంకులూ మొదలైన ఆధునిక సౌకర్యాలున్న ప్రాంతమిది. ఫరీదాబాదు నగరానికి సమీపంలో ఉండడం గ్రామం మీదా, దాని రూపురేఖల మీదా ప్రభావం చూపింది. నగర వాతావరణానికి తగ్గట్టూ గ్రామం మారుతూ వస్తున్నట్టు తెలుస్తోంది.
జితేందర్, అతని కుటుంబమూ చర్మకారుల కులానికి చెందిన వారు. వారు తమ కృషితోనూ, పట్టుదలతోనూ, విద్యార్జన చేయగలిగారు, ఆర్ధికంగా కొంత నిలదొక్కుకో గలిగారు. ఉదాహరణకు జితేందర్ ఒక క్లినిక్ లో కాపౌండర్ గా పనిచేసేవాడు. జితేందర్ బంధువు జగ్మల్ 2010లో సర్పంచ్ గా ఎన్నికైయ్యాడు. ఆ కుటుంబానికి చెందిన వారిలో ఇంజనీర్లూ, అడ్వకేట్లూ, ప్రభుత్వోద్యోగులూ ఉన్నారు. జితేందర్ బంధువు హిర్దేశ్ చెప్పిన ప్రకారం, “మేము బాగా బతకడం వారికి అసూయ కలిగించింది, మాలో ఒకరు సర్పంచ్, డాక్టర్, ఇంజనీరు కావడాన్ని చూసి వారు ఓర్చలేకపోయారు.”
చిత్త కుమారుడు బల్వంత్ నిందితుడు, సున్పెద్ గ్రామపు వాడు, ఆధిపత్యం కలిగిన రాజపుత్రుల కుటుంబానికి చెందినవాడు. అతని భార్య రాజన్, మహిళలకు కేటాయింఛిన సీటుపై , 2005-10 వరకూ సర్పంచ్ గా ఉంది, కానీ భార్య వెనుక నిలబడి బల్వంత్ చక్రం తిప్పేవాడు.
జితేందర్ బంధువు, వేదప్రకాష్ కుమారుడు జగ్మల్ 2010లో సర్పంచ్ గా ఎన్నికయ్యాడు. అతని పదవీకాలంలో గ్రామం ఎన్నో మార్పులను చూసింది. కాంక్రీటు రోడ్లు, గొట్టాల్లో నీళ్ళు, విద్యుత్తూ వంటి సదుపాయాలు వచ్చేట్టు చేసాడు. అనేక మంది రాజపుత్రులు కూడా జగ్మల్ పని చేస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చెయ్యడం, సహకారాన్ని అందించారు. నిజనిర్ధారణ సంఘం వారు మాట్లాడిన స్త్రీలలో ఒక రాజపుత్ర మహిళ ఈ విషయం సత్యమేనని 
సాక్ష్యం చెప్పింది. 

మార్పులను గుర్తించి, అతని దీక్షకు మెప్పుదలగా 2010-11లో అతనికి “ఉత్తమ సర్పంచ్ పురస్కారం” అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతి మీదుగా లభించింది. జగ్మల్ ఎన్నికల్లో విజయం సాధించడం, గ్రామంలోని అధికారపు తారతమ్యాలను కదలబార్చింది. రాజపుత్రులలో, ముఖ్యంగా బల్వంత్ కుటుంబం వారిలో ద్వేషాన్నీ, అభద్రతనూ రగిల్చింది. జగ్మల్ రాజకీయపు ప్రాముఖ్యాన్ని చూసి బల్వంత్ ఆందోళనకు లోనయ్యాడు.
2014 సంఘటన
బల్వంత్ భార్యకు ఎదురుగా నిలబడి జగ్మల్ పదవి లోకి వచ్చే ముందూ, వచ్చాకా ఉన్న రాజకీయపు సంబంధాలలోనూ, పైకి వచ్చేఅవకాశాలు పెరగడంలోనూ – ఈ ప్రస్తుత సంఘటనకు మూలాలు ఉన్నాయి.
2014 అక్టోబర్ లో రాజపుత్రులు, జితేందర్ కుటుంబపు స్త్రీలు పొలాల్లో ఉండగా, వారి చిత్రాలు తీసారు. దళిత కుటుంబాల స్త్రీలను అడ్డుపెట్టుకుని వారి కుటుంబాలను రాజపుత్రులు హేళన చేసారు, సమాజంలో తలెత్తు కోలేకుండా అవమాన పరిచారు. 2014 అక్టోబర్ 5న, ఆ చిత్రాలు దళితుల కుటుంబంలో ఒకరికి చూపించారు. ఆ చిత్రాలను నాశనం చేసేందుకై మొబైలును లాక్కొని, కాలువలో పారేయ్యడం జరిగింది. ఆ పెనుగులాట ముఠా తగాదాగా మారింది, ఎముకలు విరిగీ, తలలు పగిలీ, ఇరు పక్షాల వారికీ తీవ్ర గాయాలయ్యాయి. బల్వంత్ కుటుంబం వారైన, తులారాం కుమారుడు మోహనలాల్ అలియాస్ పప్పు, రంభుసింగ్ కుమారుడు ఇంద్రస్ అలియాస్ పప్పీ, పొహపి సింగ్ కుమారుడు భరత్ పాల్ (అందరూ రాజపుత్ర కుటుంబాలకు చెందిన వారే) – వీరు ముగ్గురూ గాయాల కారణంగా మరణించారు.
కానీ, అభియోగి (జితేందర్) కుటుంబ సభ్యుల ప్రకారం, పోలీసులు పూర్తికేసును విచారణ చెయ్యలేదు. రాజపుత్రుల కంప్లైంటును అనుసరించి దళిత కుటుంబాల పై కేసు పెట్టారు, విచారణ ఏకపక్షంగా నిర్వహించారు, వెనువెంటనే 11మంది జితేందర్ కుటుంబ సభ్యులను అరెస్టు చెయ్యడం జరిగిపోయింది. ఆ సమయంలో అక్కడ లేనేలేని సర్పంచ్ జగ్మల్ ని కూడా అరెస్టు చేసారు. ఆ సంఘటన జరిగిననాడు, జనోలి కి చెందిన ఎమ్మెల్యే రఘుబీర్ తెతియాతో కలిసి జగ్మల్ రాజకీయ ప్రచారంలో పాల్గొన్నాడు. 21 గ్రామాల సర్పంచులు, ఎమ్మెల్యేతో సహా ఆ విషయానికి సాక్ష్యం చెప్పేందుకు సిద్ధంగా ఉన్న విషయం, జితేందర్ కుటుంబం వారు గుర్తు చేస్తున్నారు. అంతేకాక ఆ ప్రచారానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. ఎఫ్ ఐ ఆర్ లో నమోదైన మరో కుటుంబ సభ్యుడు దల్బీర్ సింగ్ భార్యతో ఆ సమయంలో నర్సింగ్ హోంలో ఉన్నాడు. వారి వద్ద ఆ నర్సింగ్ హోం రికార్డులు కూడా ఉన్నాయి. వారిని ఐపీసీ 148, 149, 302, 323, 324 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. వారిలో 9మంది ఇప్పటికీ జైలు లోనే మగ్గుతున్నారు (ఇద్దరు స్త్రీలు ఆరేడు నెలలు జైలులో గడిపాక బెయిల్ మీద విడుదలయ్యారు) క్లుప్తంగా చెప్పాలంటే, ఒక సంవత్సరం నుండీ, సంపాదించి కుటుంబాన్ని పోషించే మగ కుటుంబ సభ్యులు జైలులో ఉండగా, ఆడవారూ, పిల్లలూ మాత్రమే గ్రామంలో మిగిలారు.
2014, అక్టోబర్ 6నాడు బల్వంత్, అతని అనుచరులూ కలిసి జితేందర్ కుటుంబ సభ్యులు జైలులో ఉన్న అదును చూసి, వారి ఇంటినుండి నగలనూ, డబ్బునూ దోచుకున్నారు. రాజపుత్రులు నిప్పంటించగా, 5 ఇళ్ళకు పైగా కాలిపోయాయి. బల్వంత్ మరియు అతని అనుచరులు కలిసి జితేందర్ ను ఊరు వదలిపొమ్మని బెదిరించారు. జితేందర్ పోలీసుల రక్షణ కోరినా వారు ఏమీ చర్య తీసుకోలేదు. జితేందర్, భార్యా పిల్లలు, రేఖ అత్త బ్రిజేష్ వంటి జితేందర్ బంధువులూ, ఆ బెదిరింపుల కారణం గానూ, పోలీసులు ఏ చర్యా తీసుకోని కారణం గానూ ఊరు వదిలిపెట్టి పోవలసి వచ్చింది. వారు మూడు నెలలకు పైగా గ్రామం విడిచి పెట్టారు. ఊరు విడిచిన కుటుంబ సభ్యులు వెనుకబడ్డ తరగతుల వారి సంక్షేమం కొరకు ఏర్పడిన జాతీయ సంస్థను ఆశ్రయించారు. బల్వంత్ మరియు అతని అనుచరులు చేసిన బెదిరింపుల గురించి ఫిర్యాదు చేసారు. ఆ సంస్థ, జితేందర్ కు పోలీసు రక్షణ కల్పించమని ఆజ్ఞాపించింది. మొదట్లో 10-15 మంది పోలీసు కానిస్టేబుళ్లను నియమించారు. జితేందర్, రేఖ, వారి పిల్లలూ, బ్రిజేష్ (రేఖ అత్త) మూడు నెలల తర్వాత 14 జనవరి 2015 న గ్రామానికి తిరిగి వచ్చారు. కానిస్టేబుళ్ల సంఖ్యను క్రమంగా తగ్గించారు. వారి రక్షణ నిమిత్తం వచ్చిన పోలీసులు రాజపుత్రుల ఇళ్ళలో టీలు తాగుతూ ఉండేవారనీ, దళిత కుటుంబాల సంగతులు వారి కెప్పటికప్పుడు చేరవేస్తూ ఉండేవారనీ –జితెన్దర్ కుటుంబం ఆరోపణ చేస్తోంది.
సాంఘికమైన, ఆర్ధికమైన వెలి (ఒత్తిడి)
వీరు తిరిగి వచ్చిన పిదప, ఆధిపత్యం నెరిపే రాజపుత్రులు ఈ కుటుంబం పై సాంఘిక, ఆర్ధికమైన వెలిని విధించారు. జితేందర్ మేనల్లుడైన హ్రితేష్ కథనం ప్రకారం, ఆ సాంఘిక వెలి – వారికి పాలు వంటి నిత్యావసర వస్తువులను సైతం గ్రామంలో కొనుక్కోలేని స్థితిని కల్పించిందని తెలుస్తోంది. వారెప్పుడు వీధుల్లో నడిచినా, పొలాల్లోకి పోయినా వారిమీద రాజపుత్రులు కులం పేరెత్తి తిట్టే వారని దళిత కుటుంబం రూఢీగా చెప్తూ ఉన్నది, దాని వలన వారు సాంఘికంగానూ, మానసికంగానూ తీవ్ర ఒత్తిడికి గురైనట్టు తెలుస్తోంది. సాంఘిక వెలి కారణంగా, అతి తక్కువ రాకపోకలు జరిగేవి, అది ఈ కుటుంబాన్ని నిరంతరంగా ఏకాకుల్ని చేసింది. గదుల్లో మగ్గి విసిగి వేసారిపోయామని ఆ స్త్రీలు పేర్కొంటున్నారు.
కుటుంబ సభ్యులు కోపంతోనూ, శోకం తోనూ పదేపదే “ సర్వనాశనమై పోయింది!!” అని ఒకే మాట అంటున్నారు. సుఖం, శాంతి, సంపదా అంతా తుడిచిపెట్టుకుని పోయింది. పిల్లలు బళ్ళకు కూడా వెళ్ళడం లేదు. రాజపుత్రులు వారిని ‘శూన్యం’ చేసి వదిలారని, హిర్తేష్ , మరియు అతని తండ్రి గుర్తు చేస్తున్నారు.
 
న్యాయమూ, కోర్టులూ అందుబాటులో లేకపోవడం
ఈ సాంఘిక పరమైన వెలి వలన కలిగిన మరో పరిణామం - చట్టసహాయపు ద్వారాలను పూర్తిగా మూసుకుపోవటం. క్రిమినల్ లాయర్ కెకె మీనన్ వంటి చాలా మంది లాయర్లను తమ కేసు(2014 అక్టోబర్ సంఘటన) వాదించమని సహాయం అర్ధించారు. కానీ వారందరినీ బల్వంత్, అతని కుటుంబమూ, మరియు ఫరీదాబాదు జిల్లా కోర్టులోని రాజపుత్ర సముదాయమూ కలిసి అదిలించి బెదిరించారు. నిందితుల్లో ఒకడూ, బల్వంత్ మేనల్లుడు ఐన ఆదేల్, ఫరీదాబాదు జిల్లా కోర్టులో లాయర్ కావడం చేత ఈ బెదిరింపులకు కొంత బలం ఉండి ఉంటుంది. అతని పలుకుబడితో, కేసు ముందుకు సాగకుండా ఆటంకపరిచే విధంగా లాయర్లను ప్రయోగిస్తున్నాడనే వార్తలు ఉన్నాయి, కానీ ఇంకా నిర్ధారణ కాలేదు. ఫరీదాబాదు జిల్లా కోర్టుల్లో లాయర్లలో అత్యధికులు రాజపుత్రులేనని జితేందర్ కుటుంబం ఈ సందర్భంగా గుర్తుచేస్తోంది. అడ్వకేట్ల సంఘాన్ని కూడా వారే నియంత్రిస్తున్నారు. వారి లాయరు మాట్లాడేందుకు లేవగానే అతని మీద తిట్లవర్షం కురుస్తుందనీ, అలా అతని నోరు నొక్కేస్తున్నారనీ జితేందర్ బంధువులు చెప్తున్నారు. అదంతా జడ్జీ ముందే జరుగుతుందనీ చెప్తున్నారు. “ఇరవై వేలకోసం ఏ లాయరు ఆ తిట్లు సహిస్తాడు?” అని వారు ప్రశ్నిస్తున్నారు.
తమ కేసును హర్యానా నుండి చండీగడ్ కో, డిల్లీకో బదిలీ చెయ్యమని అర్ధిస్తూ - సుప్రీం కోర్టులోనూ, చండీగడ్ హైకోర్టులోనూ కూడా అడ్వకేటు ఎకె సింగు ద్వారా పిటిషను పెట్టారు.
ఇటువంటి సాంఘిక ఆర్ధిక అరాచకత్వం, చట్టపరిధిలోకి చొచ్చుకుపోయిన దౌర్జన్యం – ఇటువంటి దొంగదెబ్బల నేపధ్యంలో- రాజపుత్రులు జితేందర్నీ, అతని కుటుంబాన్నీ నిప్పంటించడం దివ్య, వైభవ్ ల మరణానికి దారితీసింది.
పిల్లలు మంటల్లో కాలి మరణించిన సంఘటన
ఈ సంఘటనకు కొద్ది రోజుల ముందు, బల్వంత్ మరియు అతని కుటుంబ సభ్యులూ జితేందర్ కుటుంబపు స్త్రీలను బెదిరించారు. 2015 అక్టోబర్6న, జితేందర్ భార్య రేఖ బల్లభ్ గడ్ పోలీసు స్టేషన్కు వెళ్లి వారిపై ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసింది. కానీ, పోలీసు కమీషనర్ సుభాష్ యాదవ్ ‘ముగ్గురు రాజపుత్ర వ్యక్తులు క్రితం సంవత్సరం చనిపోయారు, మీలో ఎవ్వరైనా చనిపోతే చెప్పండి’ అంటూ రేఖ ఫిర్యాదును నమోదు చేసేందుకు తిరస్కరించాడు.
బల్లభ్ గడ పోలీసు స్టేషను లోని స్టేషను హౌసు ఆఫీసరును ఉద్దేశించి రేఖ రాసి ఇచ్చిన ఫిర్యాదుకు అనువాదము:
అయ్యా,
నేను జితేందర్ భార్య రేఖను, సున్పెద్ గ్రామ నివాసిని, చర్మకారుల కులానికి చెందినదానిని. 

2014 అక్టోబర్ 5న, బలోపేతులైన రాజపుత్రులు మా దుకాణానికి వచ్చి ఒక మొబైలు ఫోను విషయంలో గొడవ పడ్డారు. ఆ గొడవ విషమించి ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఆ రాజపుత్రులు మా కుటుంబం వారే వారిని హత్య చేసారని ఆరోపించారు. పదకొండు మంది మా కుటుంబ సభ్యులు జైలు పాలయ్యారు. ఆ సమయంలో రాజపుత్రులు మా ఇళ్ళమీద పడి దోచుకున్నారు. మేము ఊరొదిలి పారిపోవలసి వచ్చింది. మూడు నెలల తర్వాతే 2015 జనవరి 14 నే, మేము మా ఇళ్ళకు తిరిగి చేరుకోగలిగాము. పోలీసుల రక్షణ ఉన్నప్పటికీ, రాజపుత్రులు మమ్మల్ని కులాల పేరెత్తి నిందించేవారు. 2015 అక్టోబర్ 4నా, 5నా,ఈ రాజపుత్రులు మా ఇంటికి వచ్చి “చర్మకారులారా, నీచ జన్ములారా, చూసుకోండి, మేము మిమ్మల్ని ఈ ఊరిలో ఉండనివ్వం!” అని దుర్భాష లాడారు. మా అత్తగారు, లేటు దాల్చంద్ భార్య ఐన శాంతాదేవి, వారిని గుర్తు పట్టింది. వారు – భరత్ పాల్ కుమారుడు ఆకాష్, కిల్లు కుమారుడు సూరజ్, పొహపి కుమారుడు నైనిహాల్,
రంభు సింగ్ కుమారుడు దేశరాజు, తులసి రామ్ కుమారుడు కిల్లు. వీరందరూ పోలీసుల రక్షణను లెక్కచేయక మా ఇళ్ళలోకి చొరపడ్డారు. మా ప్రాణాలూ, ఆస్తులూ ప్రమాదంలో ఉన్నాయి. దయచేసి మీరు ఈ విషయాన్ని పరిచీలించి, తగిన చర్య తీసుకోగలరు.
తేదీ : 05-10-2015
ఈ దళిత కుటుంబం వారి ఆస్తులకూ, ప్రాణాలకూ నష్టం వాటిల్లబోతోందని భయపడుతున్నట్టు ఈ లేఖ లో స్పష్టంగా రాసి ఉంది. కానీ పోలీసులు వారి ఫిర్యాదులను ఖాతరు చెయ్యలేదు.
ముఖ్య నిర్ధారణలు
1. పై సంఘటనలు సున్పేధ్ లోనూ, ఫరీదాబాదులోనూ దళిత కుటుంబాల పైన ఎప్పటినుండో జరుగుతున్న విషాదకర సంఘటనల కొనసాగింపు మాత్రమే. అంతే కాకుండా ఇది రాజపుత్రులు దళితుల మీద కొనసాగుస్తున్న వ్యవస్తీకృత హింస.

2. అక్టోబర్ ఐదు సంఘటన తరువాత దళిత కుటుంబం యిచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ ఐ ఆర్ పోలీసులు కట్టలేదు.

3. అదే రోజు రాజపుత్రులు యిచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు కట్టి పదకొండు మంది దళితులను జైలుకు పంపారు. అందులో ఇద్దరు స్త్రీలు కూడా ఉన్నారు.

4. ఫరీదాబాదు జిల్లా కోర్టులో ఉన్న న్యాయవాదులు దళితుల కేసు వాదించటానికి సిద్ధంగా లేకపోవటం వలన ఢిల్లీ నుండి కౌన్సిల్ ను తీసుకొని రావాల్సి వచ్చింది. ఆ అడ్వకేటు తన వాదనలు వినిపించటానికి అనుమతి ఇవ్వలేదు. అంటే దళిత కుటుంబానికి స్వేచ్ఛగా కేసు నడుపుకొనే హక్కు, న్యాయ హక్కు తిరస్కరించారు.

5. అలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం కేసును హర్యానాకు వెలుపలకి (చండీగర్) బదిలీ చేయమని సుప్రీం కోర్టును వేడుకోవాల్సి వచ్చింది.

6. 2014 అక్టోబర్ తరువాత దళిత కుటుంబం గ్రామాన్ని వదిలి భయంతో కకావికలై మూడు నెలలు బయటకు పోవాల్సి వచ్చింది.

7. మొదట ఏడుగురు పోలీసులను వారికి రక్షణగా నియమించి క్రమంగా వారి సంఖ్యను తగ్గిస్తూ వచ్చారు. అక్టోబర్ 19న ఈ భయంకర ఘటన జరిగినపుడు జితేందర్ ఇంటి వద్ద ఒక్క కానిస్టేబుల్ కూడా లేదు.

8. గత సంవత్సరకాలం నుండి పోలీసు అధికారులు స్పష్టమైన నిర్లక్ష్యాన్ని ఈ కేసు సందర్భంగా ప్రదర్శించారు.

9. ఇంత ఘోరం జరిగిన తరువాత కూడా రాజపుత్రుల మీద ఎస్ సి, ఎస్ టి అట్రాసిటీ యాక్టులోని సెక్షన్లు 3 (1) (x), 3 (2) (iii), 3 (2) (iv), 3 (2) (v), and 3 (1) (xv) లను పెట్టలేదు.