Tuesday 2 May 2017

మూలింటామె - పై రెండు వ్యాసాలు






 మూలింటామెలో పిల్లుల ముచ్చట:

అరుదైన కథా వస్తువుకు తోడుగా యదార్ధ చిత్రణా, సహజ స్వభావాలతో చరించే పాత్రలూ, రసాలూరే సంభాషణలూ కలిసి పఠనీయతను పెంచితే రచన విజయవంతం అయినట్టే. అదొక పార్శ్వమైతే, మూలింటామెనవల అభిశంసలకూ, సాహిత్య వివాదాలకూ చోటు కల్పించడం కూడా రచనలో ఉన్న భావతీవ్రతకే నిదర్శనం. పైపైన చదివితే, రచయిత స్త్రీల నైతిక వర్తనాన్ని అవహేళన చేస్తున్నారనో, వారి లైంగికతను గురించి అనాలోచిత వ్యాఖ్యానం చేస్తున్నారనో, వివక్షను వ్యవస్థలో భాగంగా చేస్తున్నారనో అపోహ కలిగే ప్రమాదమున్నమాట వాస్తవం. అందుకే అయ్యుంటుంది సుమారు రెండేళ్ళ క్రితం నవల వచ్చినప్పటి నుండీ అటు ప్రశంసలూ, ఇటు విమర్శలూ కూడా పెద్ద ఎత్తునే కురిసాయి.

వాటన్నిటినీ పక్కన పెట్టి, ఒక రచనను సరిగ్గా అర్ధం చేసుకోవాలంటే - రచయిత ఏం చెప్పదలుచుకున్నాడో, అది ఎంత వరకూ రచన నుండీ వ్యక్త పరచబడిందో అంచనా కట్టుకోవాలి. కథ యొక్క అర్ధం రచయిత సృష్టించిన కల్పిత ప్రపంచానికీ, కథకు బయట ఉన్న వాస్తవ ప్రపంచానికీ మధ్య ఉన్న సంబంధంలో ఉంటుంది. కథ అర్ధం కావడమంటే సంబంధం అర్ధం కావడమే అని వల్లంపాటి చెప్తారు. నామిని ఉద్దేశాన్ని తెలుసుకోడానికి మూలింటామెలో పిల్లుల ముచ్చట ముఖ్యమైన ఆధారం. ముందు యధాలాపంగా వినిపించే  పిల్లుల ప్రస్తావన, కధనానికి కీలకంగా మారి - అంతకంతకూ తాత్విక స్థాయిని చేరుకుంటుంది.
పిల్లిని చంపడమనే ప్రతీకను వాడి రెండు వేర్వేరు సందర్భాల్లో అతి స్పష్టంగా ఒకే విషయాన్ని చెప్తారు. మూలింటామె చెప్పే కథలో ఒకడిలా అంటాడు: నేను కూనీ జేసి వొక మనిసిని చంపినానే గానీ పిల్లిని చంపలేదే! నేనేం తప్పు జేసినానని? ... నా వొరకూ నాకు పిల్లిని చంపితే పాతకం గానీ మనిసిని చంపితే పాతకం కాదు దొరా!”  అసంబద్ధంగా తోచే వాక్యాన్ని అర్ధం చేసుకోవాలంటే ఒక్క సారి టూకీగా మూలింటామె కథ చెప్పుకోవాలి.

మనవరాల్నే కోడలిగా చేసుకున్న మూలింటామెకి ఆమె పెంచుకునే పిల్లులే ప్రాణం. ఇంట్లో పారాడే పసిబిడ్డలతో సమానం ఆమెకవి. శుక్రవారం సాయంత్రం మనవరాలు, కొనమ్మి- ఇల్లూ, వాకిల్నీ, ఉన్న ఊరినీ, సంసారాన్నీ, అయిదారేళ్ళు మించని కన్నబిడ్డల్నీ సైతం వదిలి కట్టుబట్టలతో వెళిపోతుంది. మాదిగ కులానికి చెందిన  కళాయిలు పోసే అరవతనితో వెళిపోయిందని తెలిసి, మూలింటామె కూతురు నడిపమ్మి, ఆమెను వెనక్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కానీ కొనమ్మి తిరిగి రాదు.
తక్కువ కులపు వ్యక్తితో పోయిందనిఊరూ, వాడా ఒక్కటై మూలింటి వారిని కాకుల్లా పొడుచుకు తింటూండగాఅగ్నికి ఆజ్యం తోడైనట్టు భీమవరం నుంచి మూలింటామె అక్క ఎర్రక్క రంగం లోకి దిగుతుంది. ఎర్రక్క సారధ్యంలో ఆమె తోటికోడలు మనవరాలు వసంతతో నారాయుడికి రెండోపెళ్లి చేస్తుంది నడిపమ్మి. ఇదంతా మొదటి భాగమైతేపెళ్ళై వచ్చీ రావడం తోనే వసంత మూలింటిని సమూలంగా కుదిపేసిన వైనం రెండో భాగం.

మూలింటి కొచ్చిన రెండు కష్టాల తారతమ్యాలనూ వివరించడమే నవల ఎత్తుగడ. మూలింటి కోడళ్ళిద్దరూ నారాయుడి విషయంలో మోనోగమీ సూత్రాన్ని అతిక్రమించిన వారే అని స్పష్టం చేసాక, కోణం లోంచీ మూలింటినీ, ఊర్లోని మనుషుల నడవడినీవిశ్లేషించే ప్రయత్నం జరుగుతుంది నవలలో. నీతీ, న్యాయం, బలహీనతలూఇలాటి అమూర్త (abstract) అంశాలను వివరించేందుకుఒకలాగే కనిపించే వాటిని తీసుకోడం, పోల్చి చూపడం ఒక పద్ధతి. ఒక తప్పునూ, దాని పరిణామాలనూ పరామర్శ చేసేందుకు, దానిని మరో సందర్భంలో సెట్ చేసి, కాంట్రాస్ట్ చూపడమనే శిల్పాన్నిశారద రాసిన రక్తస్పర్శ (1963)” కథలోనూ చూస్తాం. కథలో తన నైతిక వర్తనాన్ని ప్రశ్నించిన తమ్ముడు ప్రసాదానికి నేను ఎవర్నీ ఆత్మహత్యల పాలు చెయ్యలేదు, ఎవరినీ మోసం చెయ్యలేదు. కానీ నీ మూలంగా ఒక నిండు ప్రాణం బావిలో పడి విలవిలా తన్నుకుని చచ్చిందిఅని అనసూయ తమ ఇద్దరి తప్పులలో ఉన్న భేదాన్ని ఎత్తి చూపిస్తుంది.  

కొనమ్మి ఇల్లొదిలి పోవడం వల్ల మూలింటికి కలిగిన ఘాతం చిన్నదేమీ కాదు. నామిని మాటల్లో చెప్పాలంటే తెల్లారి గూడా శేరు పాలిచ్చిన పాల గొడ్డు సందేళ కంతా దొమ్మరోగం తగిలి కడుపు వుబ్బేస్కుని చచ్చిపోతే ఎట్టుండాదో అట్టుండాది. అయినా సరే, మూలింటామె పోయే ముందు ఆఖరు మాటగా నా మనవరాలు మొగుణ్నొదిలేసింది. అంతే గాని మియాం మియాం అంటూ నీ కాళ్ళ కాడా నా కాళ్ళ కాడా చుట్టక లాడే పిల్లిని చంపలేదే! అని అంటుంది. దాని మర్మాన్ని కనుక్కోవాలంటే వసంత చంపిన పిల్లుల వైనం తెలుసుకోవాలి.    
 

పనిడిసి పని చెయ్యడంలో ఇక్లామార్కురాలు వసంత. నారాయుడితో పెళ్ళయ్యాక చంద్రారెడ్డి అనే పొరుగూరి వ్యక్తితో బహిరంగంగా సంబంధం పెట్టుకుని ఒక బిడ్డని కంటుంది. అతని ట్రాక్టరు ఎక్కి చుట్టు పక్క ఊళ్లలో పనులు చక్కబెట్టుకుంటూ చక్రం తిప్పుతుంది. మూలింటి చుట్టూ, కయ్యల చుట్టూ ఉండే మొత్తం చెట్లన్నిటినీ ఒక్కసారి కొట్టించి అమ్మేస్తుంది. డబ్బుతో ఇంటి ముందు కిరాణా కొట్టు పెడుతుంది. చీరలూ, రవికలూ అమ్ముతుంది. చీటీలు వేస్తుంది. పక్క ఊళ్లలో తండల్ వ్యాపారం చేస్తుంది. స్థిరాస్తిని చరాస్తిగా మార్చుకుని, మదుపు పెట్టి రకరకాలుగా ఊరివారి జీవితాలను అదుపు చేయగల శక్తీ వీలూ చిక్కించుకుంటుంది. ఇందులోని చిత్రమేమిటంటే ఆమె నోరెత్తి అడగాల్సిన అవసరం కూడా లేకుండా ప్రజలు వాళ్ళంతట వాళ్ళే  ఆమెకు మద్దతు నివ్వడానికీ, సహాయ పడడానికీ  పోటీలు పడుతూండడం!

ఈమధ్య కార్ల కంపెనీ వాళ్ళదొక అడ్వర్టయిజ్ మెంట్ వస్తోంది. అపుడే పుట్టిన తన బిడ్డను చేతిలోకి తీసుకుంటాడు తండ్రి. కళ్ళల్లో ఆనందం. తర్వాత వెళ్లి కొత్త కారును నడపడానికి కూర్చుంటాడు. అదే అనిర్వచనీయమైన అనుభూతిట! మనుషుల మనసును వారికి తెలియకుండానే తాకగలిగే సెంటిమెంట్లను ఏరుకోడం, వాటిని వాడుకుని తమ అమ్మకాలు పెంచుకోవడం ఆధునిక వ్యాపారానికి ప్రాధమిక సూత్రం అని అందరికీ తెలిసిందే. పనికి స్వయంగా సెంటిమెంట్ లుండే అవసరం లేదు. ఒక గాట నుండిన దాపటెద్దునూ, వలపటెద్దునూ వేరు చేసి వేడుక చూడకూడదనే అతి పురాతనమైన సెంటిమెంటును కూడా లెక్కించకుండా, రెండు ముసలి ఎద్దులనూ చెరో ఊళ్లోనూ అమ్మేసిన ప్రాక్టికాలిటీ వసంతది. కానీ అదే వసంత సమయానుకూలంగా చంద్రారెడ్డినీ, నారాయుడ్నీ కలిపి అన్నాదమ్ముల సెంటిమెంటునూ; ఎర్రక్కనూ, మూలింటామెనూ కలిపి అక్కాచెల్లెళ్ళ సెంటిమెంటునూ పండించాలనుకోడం, ముదిగారం కురిపించడం చూస్తే, మన వాణిజ్య ప్రకటనలను తయారు చేసే మేధావులకే వసంత పాఠాలు చెప్పగలదని తేలుతుంది.

వీటన్నిటి కంటే ఆమె వీరవిహారం చూడాల్సింది నారాయుడి మీద. మూలింటి పేరే అంగిడిల్లుగా మారిపోయినట్టు నారాయుడి అస్తిత్వాన్నే నామరూపాలు లేకుండా మార్చేస్తుంది. చెట్టూ, పుట్టా, గొడ్డూ, గోదా సర్వం అమ్ముకుని తనకంటూ పని లేకుండా చేసుకోడం, మోటార్ సైకిల్ మీద వసూళ్లు చేసుకు రావడం; భార్య మరో సంబంధం పెట్టుకోడానికి నిరాకరించక పోవడం; ముగ్గురూ కలిసి ఇంట్లో మద్యం తాగడంఇలాంటివన్నీ అతని స్వవిషయాలు గానో, అనివార్యంగా ఏర్పడుతున్న సమాజ పరిణామాల్లో భాగంగానో జమ కట్టుకోవచ్చేమోఅవి నారాయుడు తాను స్వచ్చందంగా నిర్ణయించుకున్నవైతే!

corrupt చెయ్యడం వసంత వ్యూహమనడంలో సందేహం లేదు, విషయంలో నారాయుడికీ పిల్లులకీ సామ్యం కనిపిస్తుంది. మూలింటామె పెంచిన పిల్లులు వసంత పెట్టే కోడి మాంసం వాసనకు తోకూపుకుని ఆమె చుట్టూ తిరిగినట్టే, నారాయణ వసంతకు దాసానుదాసుడై పోతాడుకొనమ్మి నారాయుడ్ని వదిలెయ్యడం 'మనిషిని చంపడం అయితే, వసంత చేసిన పని పిల్లిని చంపడం! ఒకడి అసమర్ధతను ఆసరాగా తీసుకుని, వాడి జీవితాన్ని స్వాయత్తం(take over) చేసుకుని, వాడిని తన ఉపకరణం (tool)గా మార్చుకోవడం. దానినే నామిని పిల్లిని చంపిన పాతకంగా వర్ణించేది. నారాయుడు కానీ, మరెవరైనా కానీ వ్యతిరేకత చూపనంత కాలం పాతకం - ‘నేరం అనే రూపం తీసుకోదు
       
పిల్లి పిల్లల్ని చంపడం మూలింటామెను నిర్బంధించడమే (coercion). అంతవరకూ ప్రతీకాత్మకంగా ఉన్న పాతకంవాస్తవంగా మారడమన్నది రచయితకు తాను దర్శించిన జీవితసత్యం మీద ఉన్న అవగాహనను సూచిస్తుంది.

మార్పు యొక్క సూక్ష్మరూపం అనేది - నలుగురితో పాటూ మారే వారిని వందమందిని చూసినా తెలియరానిది, మార్పుకు తలొగ్గక ఎదురు నిలిచిన వారి చరిత్రలోమనకు వేయింతలు విచ్చుకుని కనిపిస్తుందిఎదిరించే వారు లేనంత కాలం, అన్యాయం దాని అసలు రూపంతో బయటకు వచ్చే అవసరమే లేదు. మన ఇష్టంతో, మన వేలితో మన కన్నే పొడుచుకోవడంఒక సహజ పరిణామమని మనల్నేనమ్మించెయ్యగలదు. అలాటి వసంత జైత్రయాత్రకు ఎదురైన ఒకే ఒక్క ఆటంకంమూలింటామె. మూలింటామె అలయన్సును పొందే ప్రయత్నాలు వికటించాక, గత్యంతరం లేకనే వసంత  చాణక్యంక్రైం రూపం తీసుకుందిస్వంత లాభమంటే  లెక్కలేని (eccentricity) తిక్కలేవో ఉన్నవారే బలవంతపు అభివృద్ది వాదులకు కొరుకుడు పడరని నామిని చెప్పక చెప్తున్నారు! మూలింటామె వ్యక్తిగత అనుభవానికున్న విశిష్ట సామాజిక కోణం యిది. ఆమె కథ నవలగా మారదగ్గ కథ అయ్యేదందుకే.      
      __________________________________________________
నెత్తవ గల తల్లి మూలింటి మొదుటామె:
“పుస్తకం, వనితా, విత్తం పరహస్త గతం గతం
“ఇంటి కోడళ్ళు తిన్నా కోళ్ళు తిన్నా వృధాగా పోదు.”  
“రౌతు కొద్దీ గుర్రం!
ఈ వాక్యాల్లో అంతర్లీనంగా ఒక భావజాలం ఉంది. ఆడవాళ్ళను పెంపుడు జంతువుల్లా, కదిలే ఆస్తిలాగా చూడ్డం అనేది వాడుక భాషలోంచీ తొంగి చూస్తున్న సందర్భాలు ఇవి. విడివిడి వ్యక్తుల అనుభూతుల్లో, ప్రత్యక్ష – పరోక్ష అనుభవాల్లో సంతరించుకున్న సమాచారాన్ని అందరికీ  అందుబాటులోకి తెచ్చే సాధనంగా భాష వ్యవహరిస్తుంది. ‘మూలింటామె’  లోని భాషను ఈ కోణం లోంచి పరిశీలిస్తే సమాజంలోని స్త్రీల స్థానం గురించిన సమాచారం మనకు చాలా దొరుకుతుంది. దానికి కారణం - నవలను రాసిన నామిని సుబ్రహ్మణ్యం నాయుడు తాను చూసిన ప్రపంచాన్నీ, అందులోని మనుషులనూ, వారి అంతరంగాలనూ - యధాతధంగా రికార్డు చేసి మనకందించడమే.  

మూలింటామె కథ చదువుతూంటే ఆడవారి పట్లా, నిమ్నవర్ణాల పట్లా  వ్యక్తమౌతున్న వివక్షను చూసి కొందరికి సందేహం రావొచ్చు, యిది కొన్ని వందల ఏళ్ల క్రితం కథ కాదు కదా అని. ఎందుకంటే  కుల మత జాతి లింగాలకు అతీతమైన రాజ్యాంగం మనది, రాసుకుని అరవై ఏళ్లయ్యింది కూడా. కాగితాల మీద రాసి ఉన్న హక్కులు ప్రజల జీవితాల్లో, భావజాలాల్లో ఏపాటి మార్పును తీసుకు రాగలిగాయో మనకు అద్దంలో పెట్టి చూపించగలదు ఈనవల. ఈనాటికీ, దేశంలోని అన్ని పల్లెటూళ్ల లోనూ చిన్నాపెద్దా తేడాలతో వివక్ష పాతుకుపోయి ఉందని గుర్తించి కథలోకి వెళ్లాలి, లేదంటే నవల అర్ధమే కాకపోవచ్చు. “నీ మొగుడు చేసిన బాకీలకి కూలికి పొయ్ చెల్లబెట్టే దానికి నీకు మున్నూటరవై రోజులూ చాలవే పాపం” అన్న కొనమ్మి మాటలు తలుచుకుంటుంది గురివి. కటిక పేదరికానికి తోడు కులం కూడా వారినెలా అణచివేతకు గురిచేస్తుందో మాల గురవమ్మ మాటల్లో తెలుస్తుంది. “... తలగొట్టేసి వొకటి సగంగా గొలుస్తారే గానీ మాలదానికి చేతికి కుంచమిచ్చి కొలుచుకోమంటారా” అన్న ప్రశ్నలో బడుగు వర్గాల వాస్తవస్థితి కళ్ళకు కడుతుంది.

అలాటి సమాజంలో ఉంటూ కూడా, ఆ విలువలకు భిన్నమైన లక్షణాలతో ఉన్న మూలింటామె కథ యిది. ఊరిలో ఒక మూలగా విశాలమైన ఆవరణతో ఉన్న ఇల్లు కుంచమమ్మది. ఇద్దరు పిల్లలు నారాయణ నాయుడూ, మొగిలమ్మానూ. వాళ్ళు పసివారుగా ఉన్నప్పుడే  ఆమె భర్త పోయాడు.  మొగిలమ్మకు పెళ్ళయినా, ఆమె కూడా భర్తను పోగొట్టుకుని, పసిబిడ్డ రూపావతిని తీసుకుని పుట్టింటికే చేరుతుంది. రూపావతి పెద్దయ్యాక ఆమెని తన అన్న నారాయుడికిచ్చి పెళ్లి చేస్తుంది మొగిలమ్మి. మూలింటిలో ఉండే మూడు తరాల స్త్రీలనీ మొదుటమ్మీ, నడిపమ్మీ, కొనమ్మిగా పిలుస్తారు ఊరిలో వాళ్ళు. మూలింటామె మనవరాలి కిద్దరు పిల్లలు. అయిదారేళ్ళ వయసున్న ఆ మునిమనుమల తోనూ, పెంచుకుంటున్న పిల్లులతోనూ నిశ్చింతగా మూలింటామె జీవితం సాగుతూ ఉంటుంది.  

ఉన్నట్టుండి ఒకనాడు, గిన్నెలకు కళాయిలు పోసే అరవ మాదిగతన్ని కావాలనుకుని కట్టుగుడ్డలతో రూపావతి ఇల్లు వదిలిపోవడం, ఊరు ఊకుమ్మడిగా మూలింటి మీద విరుచుకు పడడం, నారాయుడికి వసంతతో రెండో పెళ్ళీ వరసగా జరిగిపోతాయి. అత్తగార్ని తనకు అస్మదీయురాల్ని చేసుకోవాలని వసంత పెళ్ళైన రెండో రోజు నుండే ప్రయత్నాలు సాగిస్తుంది. మూలింటామె తప్ప మిగిలిన వారంతా ఆమెకు వశ్యులే.

                ***                      ***                       ***

అన్ని కులాలూ సమానమేననీ, స్త్రీ పురుషులు సమానమేనని నమ్మే ‘చైతన్యం’ మూలింటామె పాత్రకు లేక పోయినా, ఈ వివక్షల కతీతంగా మనుషులను ప్రేమించగల మానవత్వం ఆమె ప్రత్యేకత. పాతకాలపు భావాల్లో ఉన్న మనిషే కానీ కరుణనూ, దయనూ నింపి ఆమెను నామిని సృష్టించారనిపిస్తుంది. ఈ గుండాంలో తాడు తెంపేసిన ముండ మోపులు దీపిం కింద చలవ బెట్టాల్సొస్తా వుండాది అని ఆమె బాధపడుతున్న మాట నిజం. అయినా తన కొడుకును వదిలి వెళ్ళిపోయిన మనవరాల్ని కడుపులోనూ, నోట్లోనూ పెట్టుకుంటుంది. ‘కళాయోడు కూడా మనోడే గదా, వోడు బాగుంటేనే గదా వోడి దగ్గరుండే మన బిడ్డి బాగుండేది’ అనుకోగలిగే పెద్దమనసు.

రచయిత తనకు పాత్రను గురించి ఉన్న అభిప్రాయాన్ని పాఠకుడికి కూడా కలిగించడానికి అనేక శిల్ప పద్ధతుల ద్వారా ప్రయత్నిస్తుంటాడు. అలాటిదే మూలింటామెకున్న పిల్లుల పిచ్చి. మునిమనవలతో సమానంగానో, ఇంకా చెప్పాలంటే కొంచెం ఎక్కువగానో ఉన్నట్టు తోస్తుంది ఆమె మక్కువ. బిడ్డ లిద్దరినీ కన్న రోజుల్లో వక్కాకు నమిలే అలవాటు ఉండేదట. భర్త పోయాక,  పిల్లుల్ని చేరదీసినాక మళ్ళా వక్కాకు జోలికి పోలా, వక్కాపొవ్వాక్కు పెట్టే రూకతో కోడిగుడ్డో, వుప్పుచేపో తీస్కుంటే పిల్లులు పిరింగా తింటాయనిపించి. వారానికోసారైనా పిల్లులకు నీసు పెట్టడం కోసం   వక్కాకు నమిలే అలవాటును కూడా ఆమె మానుకుంటుంది.

తనకు లాభం కలిగించగలిగిన వాటిని మాత్రమే ప్రేమించేవారున్న ప్రపంచంలో, ఏ మాత్రం తిరిగి ఉపయోగపడని వాటిని – ప్రేమించడం అనేది ఒక రకమైన ఉన్మాదం లాగా కనపడుతుంది. భూమి మీదా, చెట్టూ పుట్ట మీదా ఆమెకున్న బంధానికీ, దురదృష్టవంతుల పట్ల ఆమె ‘నెత్తవ’కూ – ఆ ‘పిల్లుల పిచ్చి’ ఒక ప్రతీకగా భావించవచ్చు.

వసంత ముందు నుంచీ ఆలోచించుకు వచ్చిందో, లేక నారాయుడి మెతకతనం ఆమె నందుకు పురిగొల్పిందో తెలీదు కానీ తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది. చెట్లన్నిటినీ కొట్టించి అమ్మేస్తుంది, ఆ డబ్బుతో రకరకాల వ్యాపారం చేస్తుంది. నిస్సంకోచంగా పరాయి మగవారితో సంబంధాలు పెట్టుకుంటుంది. ఊరంతటికీ నాయకురాలౌతుంది.
         
             ***                             ***                               ***

కథను టూకీగా చెప్పుకున్నా - ఒక విషయం స్పష్టం అవుతూ వస్తుంది. మూలింటి కోడళ్ళిద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకున్నవాళ్ళే. వారిలో ఒకరి మీద ఊరు కత్తి కట్టడం, మరొకరిని నెత్తిన పెట్టుకోడం ఎందుకు జరిగిందన్నది ప్రశ్న. దాని గురించిన  చర్చ నవలలో జరుగుతుంది.

నిమ్న కులం వ్యక్తి  అగ్రవర్ణం స్త్రీని చేసుకున్నాడన్న ద్వేషం ఊరివారికి ఉండనే ఉంది. అది స్పష్టంగా ఊళ్ళో జనాల నోటి వెంట వినిపిస్తూ ఉంటుంది. కులమన్నది ఆ మనుషుల నరనరాల్లో జీర్ణించుకు పోయి ఉంది. ప్రేమనీ, గౌరవాన్నీ వర్ణించుకోవాలన్నా, ఆ ఉపమానం కూడా కులంతో కలగలసి ఉండడం మన దౌర్భాగ్యం. ‘బాపనోళ్ళ బిడ్డి మాదిరిగా చూసుకుంటిమి గదే!’ అని మనవరాల్ని తలుచుకుంటున్న మూలింటామె ఏడుపులో నామిని ఆ కోణాన్నిచూపిస్తారు. దానితో పాటూ కొనమ్మి కుటుంబం మీద ఊరివారి వైరాన్ని గమనించాలి. స్త్రీని ఒక గొడ్డులా భావించి, ఆమెను అదుపు చెయ్యనందుకు ఆ స్త్రీ కుటుంబాన్ని శిక్షించాలన్న వాదన సైతం వినిపిస్తుంది.
నీ గాట్లో దొంగ కూలిపొయ్ న గొడ్డొకటుందనుకో. నువ్వేం చెయ్యాల? మంచి పగ్గమేసి గుంజకు కట్టేయ్యాల. అట్ట గాకుండా నువ్వు కట్టెయ్య కుండా దాన్ని కొట్టాంలో యిడిసి పెట్టేసినావనుకో ఆ దొంగ గొడ్డు ఏం జేస్తిన్ది? పొట్ట కరుకు మిందుండే వరి మళ్ళో పడి సపాయిగా తొక్కి మేసేస్తింది. తప్పు దొంగ గొడ్డుదా, దాన్ని కట్టేయ్యనోడిదా?” అని ఊరి పంచాయితీలో మొలకమ్మ మాట్లాడడం అతిశయోక్తిగా కొంతమందికి తోచినా సమాజంలో ఆ ధోరణి ఉందని గుర్తించక తప్పదు.

ఆ పంచాయితీ దృశ్యాన్ని నామిని వర్ణించిన తీరులో స్త్రీల ఆలోచనలు సంకుచితంగా ఉండడానికీ , వారి ప్రవర్తనకీ మధ్య ఒక సంబంధం కనిపిస్తుంది. ‘మొగోళ్లందరూ గుడి చుట్టూ బండ రాళ్ల మిందా కుచ్చోనుంటే ‘ఆడవి’ మాత్రం యిండ్ల గోడలకు యీపు లానించుకోని, మూతుల మింద చేతులేస్కోని నిలబడుకోనుండాయి.’ ఆడవాళ్ళు అనకుండా ఆడవి అనడంలో అసంకల్పితంగా మనుషుల బదులు జంతువులు స్ఫురణకి రావడంతో – పరిస్థితి ఎంత అవమానకరంగా ఉందో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.   

కులం, లింగం - ఈ రెండు వివక్షలూ కాక ‘స్త్రీల నైతికత’కు సంబంధించి మొలకమ్మ నోటి వెంట ఒక దారుణమైన వాస్తవాన్ని వినిపిస్తారు నామిని. స్త్రీ తనంతట తాను, తన శరీరం కోసమో, మనసు కోసమో – శారీరక సంబంధం పెట్టుకుంటే అది పాపం అని సమాజం ఖండిస్తుంది. కానీ ఆ సంబంధం - తన స్వలాభానికో, తన వారికి లాభం చేకూర్చడానికో  పెట్టుకుంటే మాత్రం – సమాజం ఆ ‘తప్పు’ను కప్పి పుచ్చుకుంటుంది. ఒక ‘రెడ్డి’ని ఆకట్టుకున్న వసంత చాకచక్యానికి ముచ్చట పడుతూ, ఆ చంద్రారెడ్డిని అదుపులో పెట్టుకోలేకపోడం అతని భార్యదే లోపమని ప్రచారం చేస్తుంది ఊరు. నీ మొగుడు నీ దగ్గర శుద్ధం లేకనే గదా నీకాడ గాకుండా యింగొకరి కాడి కొచ్చుండేది! అని భార్యని అడిగే రెండు నాలికల మనుషుల గుట్టు రట్టు చేస్తారు నామిని.

సహజమైన వాంఛ కారణంగా ఏర్పడ్డ సంబంధాల తృణీకరణా, స్వప్రయోజనాల కోసం ఏర్పరుచుకున్న సంబంధాలకు సమర్ధనా – ఇదీ ఈనాటి సమాజంలో మనకు కనిపిస్తున్న కపట గౌరవాల రహస్యం.  
                     ***                        ***                              ***
ఈ ద్వంద్వ నీతులకు విరుద్ధమైన స్వభావంతో మూలింటామె పాత్ర ప్రవర్తిస్తుంది. నీతీ, న్యాయాలకు సంబంధించి ఆమె పరిభాష పూర్తిగా వేరు. పాత బట్టలను దొంగిలించాడన్న నేరానికి ఒక బలహీనుడ్ని గుంజకేసి కొడుతూంటే ఆమె గుండె చెరువౌతుంది. ఊళ్ళో మొగోళ్ళు మాత్రం ఎందురు – చేన్ల కాడుండే పారా, గెడ్డ పారా దొంగిలించకపోయ్ నాటా రంగింట్లో యిచ్చేసి సారాయి తాగేసి రాలేదు! ఈదల్లో ఆడోళ్ళు పొనుకొనుంటే రేత్తిర్లు తాళి బొట్లు తెంపక పోయే ఆడ దొంగల్లేరా మనూళ్ళో! ఊళ్ళో దొంగల్ను యే పొద్దన్నా కరెంటు పోలుకు కట్టేసినారా?” అని ప్రశ్నిస్తుంది.

మూలింటి మొదుటమ్మి మనసు తెలిసిన నేస్తం గురవమ్మ. కొనమ్మి వెళ్ళిపోయిందని తెలిసి, అన్ని కష్టాలు తెలిసిన బిడ్డికి ఎంత కష్టమొచ్చి పడిందమ్మా అని విలవిల లాడుతుంది. ఏనాడో కొనమ్మి దగ్గర తీసుకున్న వొడ్లకు గానూ, కోడిపుంజు నొక దాన్ని గురివి తెచ్చి మూలింటామె కిస్తుంది. ఊరందరూ కక్ష కట్టి సాధిస్తున్నా, చల్లని నాలుగు మాటలు మాట్లాడి మూలింటామె ప్రాణం తెరిపిన పడేస్తుంది. ఆ పుంజును తన అక్క ఎర్రక్క కోసం వండేటప్పుడు, తన పిల్లులతో పాటూ గురివి కూడా తినాలని మూలింటామె మనసు తహతహ లాడుతుంది.

గొర్రెల మధ్యనే పుట్టి, కాస్త అవతలి వారిపై ఆధిక్యత చూపే అవకాశం వస్తే వదులుకోని పొట్టేళ్ల వంటి మనుషులంటే మూలింటమ్మెకు  విరక్తి. ఆ వ్యక్తి స్వంత అక్కే అయినా, ఆమెతో మానసికంగా సంబంధం తెంచుకునే ఉంటుంది. ఆ ఎర్రక్క తత్త్వం గురించి గురివితో ఇలా చెప్తుంది-‘మంచీ చెడ్డా తెలవకుండా అదవగా తిరిగే నా బోటి నీ బోటి గొర్రిల్ని కొమల్తో పొడస్తా తిరగతా వుంటాది’.

మూలింటామె యాడ బాద పెట్టుకుంటాదో అని గురివి ఆరాటం – అందుకే మూలింటక్కా! బూమ్మింద కేర్ మని పడినప్పుట్నుంచీ యిట్టాంటి మాటలే యింటూండా. మీ అక్క అన్న మాట్లకి నేను బేదం బెట్టుకోను. ఈ జలమ్మ కింతే!” –. అని సద్ది చెప్తుంది. వివక్ష తప్పని తెలుసుకుని, మానుకోడమే ఒక అచీవ్ మెంట్ అని సభ్య సమాజం భావిస్తూ ఉంటుంది. కానీ ఆ పరిజ్ఞానమేదీ లేకపోయినా - కమ్మ కులపు మూలింటామెకీ, మాల కులపు గురివికీ ఏర్పడిన స్నేహం స్థాయిని అందుకోడానికి  ఇంకా ఎన్ని తరాలు గడవాలో మరి.
              
              ***                          ***                           ***
తనకో న్యాయం, పరులకో న్యాయం అనే హిపోక్రసీకి మూలింటామె చాలా దూరం. లైంగికత గురించి కూడా తనదైన పారదర్శకమైన ధోరణిలో మాట్లాడుతుంది: తన భర్త పోయి బిడ్డలు పసివారుగా ఉన్నప్పుడు, పక్కింటి చెంగముని ‘ఎద్దులకు మడక్కట్టి దున్ని’ సేద్యంలో తనను ఆదుకున్నాడనీ, అతనితో తనకు సంబంధం ఉండిందనీ ఒప్పుకుంటుంది. కనక వసంతకూ, చంద్రారెడ్డికీ ఉన్న సంబంధం కారణంగా ఆమె వసంతను దూరంగా ఉంచిందనుకోలేం.  వసంత లోని వ్యాపారదృష్టిని ఆమె మొదటి చూపు లోనే పసి గట్టి ఉంటుంది. ఎంత తప్పించుకుని తిరిగినా వసంత వేటు ఆమెపై పడనే పడుతుంది. అన్నిటికీ తల వొంచుతుంది కానీ భూమిని అమ్మేందుకు మాత్రం మూలింటామె సమ్మతించదు. చివరకు ప్రాణాల్నే విడుస్తుంది. కథకుడి స్వరం తటస్థంగా మొదలై, మూలింటి మీద ఊరి వారి ఆరళ్ళకు సానుభూతి చూపుతూ, క్రమంగా వసంత ‘కాండ’ల వర్ణనలో వ్యంగ్యాన్ని నింపుకుంటుంది.

‘ప్రపంచమంతా ప్రతీకల మయం. దానికి ప్రతిబింబంగా తయారయ్యే సాహిత్యంలో ప్రతీకలు బలవత్తరంగా వికసించుకుంటూ సార్వజనీనమైన సత్యాల్ని పట్టుకుంటాయి’ అంటారు మధురాంతకం నరేంద్ర ‘కొండ కింద కొత్తూరు’కు ముందుమాటలో. వసంత లాభార్జనకూ, మూలింటామె మానవత్వానికీ చుక్కెదురవడం సహజ పరిణామం. ఆమెకింకే మోహమూ మిగిలి లేదు కనక ఆ పిల్లుల్నే ఉపయోగించుకుని మూలింటామెను లొంగదియ్యాలని వసంత పధకం. కానీ మూలింటామె ఆత్మస్థయిర్యం అనూహ్యంగా ఉంటుంది: ‘యిప్పుడు నిండా కటీనురాలై పొయ్యింది మొదుటిది. చచ్చిపోయిన పిల్లి పిల్లల్ని చేటలో యిసిరిపారేస్తా వుండినా – కండ్లల్లో నీళ్ళుపెట్టుకోకుండా తోడబుట్టిన అక్కకు చేతులెత్తి దండబెట్టి నోరు తెరవకుండా కండ్లు మూసుకొని యెగతాళి పడతుండాది’. అన్ని పిల్లుల్నీ చంపకుండా ఒక రెండు పిల్లి పిల్లల్నే చంపడంలో – వసంత బెదిరింపూ, మూలింటామె తెగింపూ చూసి రచయిత కూడా దిగ్భ్రాంతి చెందేరా అన్న భ్రమ కలుగుతుంది. మూలింటామె చేత సంతకం చేయించేందుకు వసంత ప్రయోగించిన సామ దాన భేద దండోపాయాలను చూస్తే భూ - సేకరణ, సమీకరణ, ఆక్రమణల్లోని హద్దులు అస్పష్టమౌతూ కన్పిస్తాయి.

మూలింటామెది ఒంటరిపోరాటం అయినందుకు మనకు అంతు లేని దుఃఖం కలుగుతుంది. ఆమె కూతురు నడిపమ్మి పేరుకు తగ్గట్టూ నడుమనే ఉంటుంది – ఏ పక్షానా చేరకుండా. ఆ ఇంటిలోనే పుట్టినా, ఆ పొలంలో జీవితమంతా పని చేసినా – కూతురు గనక ఆ ఆస్తిపై ఏ హక్కూ లేని గాలి జీవితం ఆమెది.

స్వంత కూతుర్నే తలుచుకోకుండా మనసు రాయి చేసుకుంటుంది ఆ నడిపమ్మి. మనం గాని ఆ యమ్మిని కడుపులోనే గాని పెట్టుకున్నా మంటే యింట్లో వుండే లేదర పిల్లకాయల్ని కూడా సాక్కోలేము, సదివించు కోలేము అనేది ఆమె భయం. ఊరివారి మాటలంటే భయం, వసంతను ఎదిరించాలంటే భయం – అందుకే ‘తప్పించుకోని తప్పించుకోని తిరగతుండాది’. బలం గల వసంత మీది మోజుతో రంజకం, మొలకమ్మి ఆమె పక్షాన చేరడం మనకు బాగానే  అర్ధమౌతుంది. కానీ ఏ ఆసరా లేని నడిపమ్మి వంటి బడుగు ప్రాణులు 'భయపడి' తటస్థంగా ఉండడం కన్నా- మూలింటామె వెంట నిలవడమే శ్రేయస్కరం అనిపిస్తుంది.
                                          
                  ***********************************

1 comment:

  1. Excellent review kalyani garu.
    I felt like I read book completely.

    ReplyDelete