Friday 1 January 2016

"అభ్యుదయ ప్రేమలు" - స్త్రీ ప్రేమ స్వేచ్చ పై రంగనాయకమ్మ గారి భావాలు



ఇదుగో...
'మాతృక'
జనవరి సంచికలో...


అభ్యుదయ ప్రేమలు’ అనే పేరుతొ రంగనాయకమ్మ గారి కొత్త పుస్తకం వచ్చింది. అందులో మొదటి రెండు కథలూ ‘ఆధునిక’ స్త్రీ స్వేచ్చపై ఆమె చేసిన వ్యాఖ్యానాల్లాగా కనిపించాయి. ఈ సందర్భంగా - రంగనాయకమ్మ గారి పూర్వ రచనల్లో విరివిగా కనిపించే ప్రేమా, స్వేచ్చా, ఆత్మగౌరవమూ అనే భావాలూ; అవి మూడూ కలిసి చేసే స్త్రీ పురుష సహజీవనం పై ఆమె అభిప్రాయాలూ – వీటిని గుర్తు చేసుకునే ప్రయత్నమే ఈ వ్యాసం.       

ఒక కుటుంబంగా జీవించాలనుకునే జంట మధ్య తప్పనిసరిగా ఉండవలసినవి ఒకరి పట్ల మరొకరికి ‘అనన్య’ మైన ప్రేమానురాగాలు. అవే కాక తమ సంస్కారాల్లో కొంత సమాన స్థాయి కూడా జీవిత సహచరుల మధ్య ఉండాలి. భావసారూప్యం లేనివారితో స్నేహాలే నిలుపుకోడం కష్టం, ఇక సంసారమా దుఃఖ భాజనమే!  

‘ప్రేమరాహిత్యం’- దాని కారణంగా వివాహబంధం తెగిపోవడం - అన్న సమస్యకు పరిష్కారం దొరకలేదు సరికదా, ఆ సమస్యతో ముడిపడిన  స్వేచ్చా ప్రణయం(ఓపెన్ మారేజ్) అనే కొత్త ధోరణి ఒకటి సమకాలీన సమాజంలో ప్రచారం లోకి వస్తోంది. దాని మంచిచెడ్డలు విచారించే ప్రయత్నం రంగనాయకమ్మగారు తమ ఇటీవలి రచనల్లో చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. 

వివాహేతర సంబంధాలు సహజీవనానికి విషతుల్యాలన్న విషయం ఏనాడో అందరూ ఒప్పుకున్నదే. ఏలోటూ తెలియకుండా చేసుకుంటున్న కాపురం ఒక నమ్మకద్రోహంతో ఎలా మొదలంటా కూలిపోయిందో 1995 ప్రాంతాల్లో వచ్చిన ‘ప్రేమ కన్నా మధురమైనది’ లో రంగనాయకమ్మ గారు వర్ణిస్తారు. అనర్హుడని తెలియక తన విలువైన ప్రేమను అర్పించి, విషయం తెలుసుకుని ‘ఆత్మగౌరవం’ అమూల్యమైనదని ‘రమ’ గుర్తించే కథ ఈ నవలికలో చిత్రితమౌతుంది.

జీవితాలను వెలిగించే ప్రేమానుభూతిని  పొందిన ఒక సున్నిత స్వభావురాలు రమ. తనదీ, తన భర్త రమణదీ ‘అజరామరమైన’ ప్రేమ అని నమ్ముతుంది. ‘బ్రతుకంతా ప్రతి నిముషం పాట లాగ సాగాలి, ప్రియా ప్రియా ‘ అని పదేపదే పాడుకుంటూ ఉంటుంది.

రమకూ, జయకూ ఉన్న స్నేహాన్ని రమణ అలుసుగా తీసుకుని  “మీరంటే నాకు చాలా ప్రేమ, మీ స్నేహితురాలికి మీరంటే ఎంత ప్రేమో మీకు తెలీదు, కావాలంటే మీకోసం నన్ను కూడా ఇచ్చేస్తుంది... ... ...మీరిద్దరూ అక్కచెల్లెళ్ళ లాగా ఎందుకుండకూడదు? మీ ఊరు రమ్మంటారా చెప్పండి?” అని జయతో అవాకులూ చెవాకులూ మాట్లాడతాడు. జయ నిర్ఘాంతపోతుంది. 
చెప్పాలా వద్దా అని ఎంతో సేపు మధనపడి చివరకు జయ ఆ విషయం రమతో చెప్తుంది. రమ కుప్పకూలిపోతుంది. ప్రేమ ద్రోహం అనే ఆయుధం తో, నమ్మక ద్రోహం అనే అఘాతం తగిలిన రమ ఏ అఘాయిత్యం చేసుకుంటుందో అని జయ తల్లడిల్లిపోతుంది. రమని ఎలా ఓదార్చాలి అని జయకు ఒకటే ఆలోచన, ఒకటే ఆరాటం
అంత జరిగాక కూడా - ద్రోహానికి తలపడ్డ మనిషి తనను చూసుకుని తను సిగ్గు పడకుండా ఉండగలడా... ... ... పశ్చాత్తాపం తో దగ్ధమై పోకుండా ఉండగలడా అని ఏమూలో రమకు ఇంకా సందేహమే. “ఏం  చెప్పగలడు? ఏం చెప్పగలడు?” అని రాత్రింబవళ్ళు రమణ ఇవ్వబోయే సంజాయిషీ గురించి ఊహిస్తూ ఉంటుంది.
కానీ రమణ తప్పు ఒప్పుకోకుండా బుకాయించబోవడం చూసి రమకు గుండె రాయి అయిపోతుంది. అది అతను క్షణికావేశంలో చేసిన తప్పు కాదనీఅతనికి తన ప్రేమను పొందే అర్హత లేనే లేదనీ ఆమెకు రూఢి ఔతుంది. రమణ చేసిన ద్రోహాన్నితట్టుకు నిలబడితన జీవితం తన  ప్రేమ కంటే విలువైనది అని రమ గ్రహించడమే కథకు ముగింపు.

ప్రేమే ‘మధురమైనది’ కదా,
దాని కన్నా ‘మధురమైనది’ ఇంకేదో ఉందా?  అనే ప్రశ్నవేసి...
ఆ పోలిక అవసరమైనప్పుడు,
ప్రేమ కన్నా మధురమైనది వేరొకటి ఉంది,
అది – ‘ఆత్మగౌరవం’ అని రచయిత్రి స్పష్టం చేస్తారు ఈ కథలో.

ఒకళ్ళమీద ఒకళ్ళకి అణు మాత్రం సందేహాలు రాని స్నేహం, ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి ఊహల్లో కూడా ద్రోహం జరగని స్నేహం అని రమకూ, జయకూ ఉన్న బాంధవ్యాన్ని రంగనాయకమ్మగారు వర్ణిస్తే – అటువంటి బంధమే కదా స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రేమానుబంధాన్ని పటిష్టం చేసేది అని నాకనిపించింది. అదే స్త్రీ పురుషుల సహజీవనానికి పునాది కావలసి ఉంది. స్త్రీ  పురుషుల స్వేచ్చా సమానతలకూఆత్మగౌరవాలకూ లోటు రానివ్వనిదీఆచరణయోగ్యమైనదీ - ఐన వివేచన నాకు ఆమె రచనల్లో కనిపిస్తుంది.   

అయితే రమణను వదిలేసేందుకు రమ నిర్ణయానికి రాకముందూ, వచ్చాకా - ఆమెకు కలిగే అపరిమితమైన మనః క్లేశాన్ని మనం తక్కువ చెయ్యలేం. దానికి కారణం నిష్కల్మషమైన ప్రేమే అని మనం అర్ధం చేసుకోగలం. కానీ సౌకర్యవంతమైన జీవితాలకు అలవాటు పడిపోయి, ఆ కారణంగా భర్తలు చేసే అవమానాలను సహిస్తూ సద్దుబాట్లు చేసుకునే స్త్రీలు ఎంతో మంది మన సమాజంలో ఉన్నారు. వివాహేతర సంబంధాల్లోని మార్పులతో  కొత్త తరం ఎటువంటి రాజీల కొస్తోందో 1999 లో వచ్చిన మురళీ వాళ్ళమ్మ’ కథలో విశ్లేషించారు.

“అసంతృప్తిని ప్రకటించవలసిన కోడలే మెతకతనం చూపుతోందీ ... కోడల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు కానీ కొడుకు తనను మాత్రం పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడూ – కందకు లేని దురద కత్తిపీట కెందుకు లె”మ్మని సాధారణంగా చాలా మంది పెద్దవాళ్ళు జోక్యం చేసుకోరు. కానీ తల్లి అయిన రుక్మిణి అలా అనుకోదు! తనకెం దుకని ఊరుకోదు. స్వేచ్చాస్వాతంత్ర్యాలకూ, స్వాభిమానానికీ ప్రతీకగానూ, ఆధునిక మహిళకు చక్కటి నమూనాగానూ అనిపించే రుక్మిణి కోణం నుండి కథను చెప్పి- ఈ వైవాహిక సమస్యల పరిష్కారం లో కుటుంబ సభ్యుల పాత్రను మనకు  సూచిస్తున్నారనిపించింది.

రుక్మిణి ఆర్ధికంగా స్వతంత్రురాలు కాకపోయినప్పటికీ తన భర్త వేరే స్త్రీ తో సంబంధం పెట్టుకుంటే, భరిస్తూ కూర్చోదు, పదమూడేళ్ళ కొడుకు మురళిని తీసుకుని తెగించి ఇల్లు వదలి వస్తుంది. కుట్టుపని చేసుకుని ఇల్లు గడుపుకుంటుంది.
ఆనాటి నుండీ కొడుక్కి తల్లీ, తల్లికి కొడుకూ ఆధారం. వారిరువురి వ్యక్తిత్వాల గురించీ ఇలా ఉంటుంది. ఎన్ని లోట్లు ఉన్నాఎన్ని అవసరాలు ఉన్నాఎక్కడికక్కడ సరిపెట్టుకోవడమే ఆనందం గా రెండో ఆలోచన లేకుండా కాలం గడిపారు. తమ బతుకు తము బతకడమే తమ లక్ష్యం అయినట్టుతమ లక్ష్యమే తమ జీవితం అయినట్టుఅన్ని ఇబ్బందులనీ ఓర్చుకుంటూ కాలం గడిపారు.                   

పెద్దవాడయినాక మురళి, రజనీ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. క్రమేణా, నిప్పుకు చెద పట్టినట్టు అతని ప్రవర్తనలో మార్పులు రావడం రుక్మిణి దృష్టి లోకొస్తుంది.
పెళ్ళైన మొదట్లో ప్రతీరోజూ రాత్రిపూట కలిసి నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అన్నాలు తినేవారు.
రజని ఏదైనా నవల చదువుతోంటే తను పడుకుని సంతోషంగా వినేవాడు.
కాస్సేపు తను కలెక్టు చేసిన పాటలన్నీ వేసి వినిపించేవాడు.
రజనితో మాట్లాడడానికి తహతహ లాడుతున్నట్టు ఉండేవాడు.  ఎలా మారాడో... ఎప్పుడు మారాడో... అని రుక్మిణి మనసు పరితపిస్తుంది.
“మొగవాళ్ళు ఇల్లు పట్టకుండా తిరుగుతోంటే ఆడవాళ్ళు ఏం చేస్తారో తెలుసాచూసి చూసి మనసు విరిగి కాస్త తీరిగ్గా మాట్లాడే మొగాళ్ళ మీద మనసు పెట్టుకుంటారు. ఒక రోజున ఇంట్లోంచి బయటకు పోతారు అని మురళిని తల్లి ఒకసారి మందలిస్తుంది కూడా.
రజని ఏం కష్టపెట్టుకుంటుందో అని రుక్మిణికి ఒకటే దిగులు! ఆ అమ్మాయికిఏం జరుగుతోన్నా కోపం తెచ్చుకోడమే తెలీనట్టు ఉంటుంది

ఈ చిరాకులన్నీ ఒక ఎత్తైతేమురళీ ఆఫీసులో పనిచేసే శ్రీలత అనే అమ్మాయితో అతనికి పెరుగుతున్న సాన్నిహిత్యం మరో ఎత్తై రుక్మిణిని చాలా ఇబ్బంది పెడుతూఉంటుంది.  అతనికి రజనీ అంటే లక్ష్యం లేకపోడంశ్రీలత మీదఆసక్తి ఉండడం రుక్మిణి కనిపెడుతూ ఉంటుంది.

ఆఫీసు పని మీద శ్రీలత తో మురళి వేరే ఊరు వెళ్తాడు. అతని వద్ద నుండి ఫోన్ వస్తుందివ్యవహారం శృతి మించుతోం దనిపించాక ‘నువ్వేమన్నావూ’ అని రుక్మిణి రజనీని కనుక్కుంటుంది. “ఏమన్నాఅంటేమురళి గురించి నేనేదో అనుమానపడుతున్నానని అనుకుంటాడని రజనీ భయపడుతుంది.

కానీ ఆ ధోరణిని రుక్మిణి సమర్ధించదు. రజనికి అనుమానాలు లేకపోతే అది ఆ అమ్మాయి బుద్ధిలేనితనం! – లేకపోతే సిగ్గుమాలినతనం! ఏదైతేనేం?  అని రుక్మిణి అనుకుంటుంది.  
అందుకే ఆమె కొడుకూ, కోడళ్ళిద్దరి తోనూ మాట్లాడుతుంది.   
“మురళీ! మీనాన్న మనకి చేసిన ద్రోహమే నువ్వు రజనీకి చేస్తున్నావు.
మీ నాన్న లాంటి వాడికివేరే కాపరం పెట్టినా తప్పేం లేదు. నీకు కొంచెం సరదాగా తిరిగితే తప్పేం లేదు! ఈ తప్పొప్పులు మీరే నిర్ణయించుకుంటే కాదు. ఆ కష్టం కట్టుకున్నవాళ్ళకి తెలుస్తుంది.”

కోడలికి అవసరమైతే తాను అండగా ఉంటానని ధైర్యం చెప్తుంది. కానీ వారు అలాగే కొనసాగాలనుకుంటే మాత్రం తను వారితో ఉండబోనని స్పష్టం చేస్తుంది.
“... ... ... పెద్దపదవిలో ఉన్నవాడు కదా? అతని సరదాలు అతనికి ఉంటాయి. నీ కోపతాపాలతో అతని కాళ్ళకి బంధం కాకూడదు. ఆ ఒక్క స్వేచ్చా అతని కిచ్చేస్తే...నీకోసం అతను ఎన్ని వస్తువులన్నా కొంటాడు.
అందుకే నువ్వు ఇంత అణకువగా ఉంటున్నట్టు ఉన్నావు” అని పదునైన వ్యంగ్యంతో రజనీని నిలదీస్తుందిసూటిగా వారు చేస్తున్న తప్పును వారికి ఎత్తి చూపిస్తుంది.    
భర్తను ఎదిరించి బతికింది బిడ్డలతో రాజీ పడడానికా అని ప్రశ్నిస్తుంది.
తప్పు చేసేవాడు తనకెంతో ఆప్తుడైన కొడుకే అయినా ఎదిరించి, తన ఆత్మగౌరవాన్ని నిలుపుకున్నస్త్రీ గా ‘మురళీ వాళ్ళమ్మ’ రుక్మిణి మన ముందు నిలుస్తుంది. 

కథ లోనైతే రుక్మిణి చెప్పిన హితం మురళీ, రజనీలకి పశ్చాత్తాపం కలిగించినట్టే కనిపిస్తుంది. కానీ నిజ జీవితాల్లో స్త్రీ పురుషుల ఆలోచనలు వేరే మార్గం పడుతున్నాయి. అవి ఎవరి చేత్తో వారి కళ్ళే పొడుచుకుంటున్న ట్టుండడం రంగనాయకమ్మగారు గమనించారనుకోవచ్చు. స్త్రీ పురుష కుటుంబ సంబంధాలను ధ్వంసం చేసే అసలైన నీచ విషయం, వ్యభిచారాలే. అవి పురుషాధిక్యత నుంచి పుట్టుకు వచ్చే నేరాలే. ఆ నేరాలు, భర్తలవి అయినా, భార్యలవి అయినా అవి కుటుంబ శాంతి సౌఖ్యాల్నీ, బిడ్డల అనురాగ పెంపకాల్నీధ్వంసం చేసే నేరాలే  అని ఆమె రాస్తారు.

మగవాడు వేరొక ఆమెతో సంబంధం పెట్టుకుంటే, అదే పని ఆడది కూడా చేసి ‘సమానత్వపు హక్కు’ను వినియోగించుకోవాలనీ, అదే తగిన ప్రతిచర్య అనీ ఈరోజుల్లో కొందరి వాదం. ఆ వాదానికి పరిణామాలెలా ఉంటాయో, దాని వల్ల వచ్చే నష్టాలెంత దారుణంగా ఉండబోతాయో ‘అభ్యుదయ ప్రేమలు’ కథలో చిత్రిస్తారు.
అదే వాదాన్ని నమ్మి ఆచరించిన పద్మ పాత్ర తనకు కనువిప్పు కలిగాక ఇలా అంటుంది. “మనం స్వేచ్చ అనుకున్నదంతా మనకీ, మన బిడ్డలకీ విషంతో సమానం... నిజానికి మనం చేసిందేమిటో తెలుసా? మొగవాళ్ళ స్వేచ్చను రెట్టింపు చేశాం! వాళ్ళు మన బిడ్డల బాధ్యతలను పట్టించుకోకుండా తప్పుకోడానికి, వాళ్ళ మార్గం సుగమం చేశాం!
సమానత్వం అంటే, మంచి వాళ్ళతోనో, చెడ్డ వాళ్ళ తోనో? మనకి తెలివి లేదు! అని పద్మ వాపోతుంది.      
ఆ కథలో ఏ ఒక్క సంభాషణా తర్కవిరుద్దంగా ఉండకపోవడం గమనించాల్సిన విషయం. అతిశయోక్తుల్లా కొందరికి కనపడినా అందులో చిత్రించిన పరిస్థితుల సంభావ్యతను కాదనలేం.

ఈ సమానత్వపు వాదం ఇంకాస్త ముందుకు పోయి ‘స్త్రీ ప్రేమ స్వేచ్చ సిద్ధాంతం’ నిలువెల్లా ఉన్న ‘సంతలక్ష్మి’ గా తయారైన వైనం రెండవ కథ లో ఉంటుంది. స్త్రీ పురుషులు ‘ఒకరికి ఒకరే’ అన్న పట్టుబందీ ఏమిటని సంతలక్ష్మి ప్రశ్న. ‘ఆ శారీరక సంబంధాలు’ డబ్బు కోసం పెట్టుకున్నవి కావు గనక వాటిని వ్యభిచారాలు అనకూడదని ఆమె సమర్ధింపు.

అటువంటి భావాలను సమర్ధించే వారందరూ కూడి పెట్టుకున్న సంఘం ‘లోగుట్టు’ గురించి ఇలా ఉంటుంది: ఆ బృందం ఒక స్వచ్చంద సంస్థగా కూడా పెట్టుబడిదారులు ఇచ్చే డబ్బుతో, స్త్రీలను అభివృద్ధి చేసే చర్చలతో, మీటింగుల కార్యక్రమాలు, ఫైవ్ స్టార్ హోటళ్ళలో జరుపుతూ ఉంటుంది. పెట్టుబడిదారులు పంపే డబ్బుతో ఒక ఆఫీసూ, ఆ ఆఫీసులో ఆడ క్లర్కులూ, అన్ని ఏర్పాట్లూ ఉంటాయి.

ఆ సంతలక్ష్మిని ‘పెళ్ళాడి’ ఆమె తన పద్ధతి మార్చుకోకపోయినా కూడా ఆమెను వదలలేక(?) తన ఆత్మగౌరవానికి తిలోదకాలిచ్చిన చంద్రం మనకో ప్రశ్నార్ధకంగా కనిపిస్తాడు.
సమాజంలో ఈ విషయాలను గురించి చర్చించేవారిని - సమాజానికి నైతిక నిఘాదారు(మోరల్ పోలీసు)  లంటూ స్వేచ్చాప్రణయ వాదులు ఈసడించడం వింటూ ఉంటాం.

స్త్రీ పురుషుల ప్రణయ సంబంధం ఒక కుటుంబపు రూపం దాల్చాక, ఆ కుటుంబ సభ్యుల శ్రేయస్సు ఆ జంటను అంటి పెట్టుకుని ఉంటుందని మనకు తెలిసిన విషయమే. ‘మా ఇష్టం మాద’ని స్పష్టంగా చెప్పే  ‘సంతలక్ష్ము’లకు ఎవరూ ఏదీ చెప్పి ఒప్పించలేరు. కానీ సమాజమంతా వారి తోటే నిండి ఉండదనీ,  ఏది తప్పు?ఏది ఒప్పు? అని విచారించే వారు కూడా ఉంటారనీ మనం అర్ధం చేసుకోవాలి. వారిని ఉద్దేశించి, ఇటువంటి సమకాలీన భావాల బాగోగులనూ, అసంబద్ధతలనూ కూలంకషంగా చర్చిస్తున్న ఈ కథలకు మంచి ప్రయోజనం ఉంటుందని నా నమ్మకం.      





No comments:

Post a Comment