Wednesday 16 December 2015

'కోర్టు' మరాఠీ సినీమా రివ్యూ

ఇంగ్లీషు(సబ్ టైటిల్స్) చదవని వారికి ఉపయోగపడాలనే ఉద్దేశం తో సినీమా కథ ను కూడా సమీక్షలో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేసాను...


వాస్తవ జీవిత నిరలంకార చిత్రణ
కోర్ట్ సినిమా

                                                                                                                  ఎస్.జె. కల్యాణి
ముంబాయిలో నారాయణ కాంబ్లి అనే వ్యక్తి చిన్న పిల్లలకు ట్యూషన్లు 

చెప్పడం పూర్తి చేసుకుని లోకల్ బస్సు పట్టుకుని ఒక మురికివాడలో 

జరుగుతున్న‘వడగావ్ హత్యాకాండ విరోధ సాంస్కృతిక సభ’కు వెళ్లడంతో 

సినిమా మొదలౌతుంది. ఈ పాత్రను పోషించిన వీర సాతిదార్ తన 

చేతిసంచీని అక్కడున్నవారికందించి, మెళ్ళో కండువా వేసుకోగానే ఒక 

ప్రజాకవి మన కళ్ళ ముందు ప్రత్యక్షమౌతాడు.                                                        

నీ శత్రువును నీవు గుర్తించే 

సమయమొచ్చిందిరా! అని పాట పాడుతూ ఉండగా, పోలీసులు స్టేజీ మీద 

కొచ్చి అతన్ని అరెస్టు చేసి తీసుకు పోతారు. వాసుదేవ్ పవార్ అనే 

పారిశుధ్య కార్మికుడి మరణానికి అతను బాధ్యుడనే అభియోగం మోపారని 

తెలుస్తుంది.



మురికికూపాలు బాగుచేసే వాసుదేవ్ పవార్ అనే మునిసిపల్ కార్మికుడి 

శవం మురికి కాలువలో దొరుకుతుంది. “వాసుదేవ్ ఐదేళ్లకు పైగా 

అనుభవం  ఉన్న కార్మికుడూ, తన వృత్తి లో ఉండే ప్రమాదం అతనికి 

తెలియంది కాదు, మరి అతని శవం మీద కళ్ళకూ, ముక్కుకూ, శరేరానికి 

తొడుక్కోవలసిన ఏ రక్షణ కవచాలూ దొరకలేదు. దాని అర్ధం అతని మరణం 

ఆత్మహత్యే అయి ఉంటుంది” అని పోలీసులు నిర్ధారిస్తారు.

వాసుదేవ్ నివసించే బస్తీ పరిసరాల్లో అంతకు రెండు రోజుల ముందు 

నారాయణ కాంబ్లి “చావుతోనే న్యాయమూ, గౌరవమూ లభిస్తాయి” అని 

అర్ధం వచ్చే పాట పాడాడనీ, అది విని వాసుదేవ్ పవార్ ప్రాణాలు 

తీసుకోవాలనుకున్నాడని దిగువ కోర్టులో ప్రోసిక్యూటర్ నూతన్ 

ఆరోపిస్తుంది. వాసుదేవ్ ను ఆత్మహత్యకు పురిగొల్పిన నేరానికి నారాయణ 

కాంబ్లికి శిక్ష పడాలని ఆమె చెప్తుంది. అదేకాక, ప్రజలను రెచ్చగొట్టే పాటలు 

పాడవద్దని కాంబ్లిని అంతకు ముందే హెచ్చరించి ఉన్నారు కనక ఆ 

‘ప్రదర్శన’ అనే నేరానికి కూడా అతన్ని శిక్షించాలని వాదిస్తుంది. డిఫెన్సు 

లాయరు వినయ్ వోరా అటువంటి పాట ఏదీ కాంబ్లీ పాడలేదనీ, వాసుదేవ్ 

మరణానికీ కాంబ్లీకీ ఏ సంబంధమూ లేదని వాదించినా జడ్జీ సదావర్తే 

నారాయణకు బెయిలు మంజూరు చెయ్యడు.

మరికొన్ని నెలలూ, మరిన్ని వాయిదాలూ గడిచాక మృతుడు వాసుదేవ్ 

భార్య షర్మిలను పోలీసులు కోర్టులో ప్రవేశపెడతారు. ఆమెను ప్రశ్నిస్తే - 

ఆత్మహత్య చేసుకునే ఉద్దేశమూ, కారణమూ రెండూ వాసుదేవ్ కి లేవని 

తెలుస్తుంది. వాసుదేవ్ వద్ద కళ్ళద్దాలు కానీ, ముఖానికి పెట్టుకునే మాస్క్ 

గానీ, గమ్ బూట్లు గానీ లేవనీ, అవేవీ లేకుండానే పలుగూ, పారలతో 

మురికి కాలవలోకి దిగేవాడనీ, కళ్ళ లోకి చెత్త పోగా పోగా వాసుదేవ్ 

కన్నుఒకటి ముందే పోయిందనీ, మురికి దుర్గంధం భరించేందుకుగానూ 

తాగి పనిలోకి వెళ్ళేవాడనీ - డిఫెన్సు లాయరు వినయ్ ప్రశ్నలకు షర్మిల 

జవాబులిస్తుండగా మనకు తెలుస్తుంది.

వాసుదేవ్ కు, కాలవలోని విషవాయువులు ప్రాణాలు తీసేంత ఎక్కువగా 

ఉన్నాయో లేవో తెలుసుకునే ఏకైక సాధనం – బొద్దింకలు. బొద్దింకలు 

కాలవలో కనిపించని రోజున పనికి సెలవు అని ఇంటికి వచ్చేసే వాడని 

షర్మిల కాలవలు శుభ్రంచేసే భర్త వాసుదేవ్ జీవితం గురించిన వివరాలు 

చెప్తుంది.


వాసుదేవ్ పోస్టుమార్టం రిపోర్టు వస్తుంది. ఆల్కహాలు అతని శరీరంలో 

మోతాదుకు మించి ఉందనీ, కాలువలో పడిన కారణంగా ఊపిరాడక 

చనిపోయాడని తెలుస్తుంది. ఆత్మహత్యను నిరూపించే లేఖ గానీ, సాక్షులు 

గానీ లేని కారణంగా అతని చావుకు నారాయణ కాంబ్లి బాధ్యుడు కాదని 

తెలుస్తోందనీ ... కాంబ్లీ వయసునూ, అనారోగ్యాన్ని పరిగణించి బెయిలు 

ఇవ్వమని వినయ్ వోరా జడ్జీని కోరి ఎట్టకేలకు ఒప్పిస్తాడు.                                                 

ఒక లక్ష రూపాయలు తన స్వంత డబ్బు కట్టి మరీ కాంబ్లీని బయటకు 

తెస్తాడు.

తరువాత దృశ్యంలో నారాయణ కాంబ్లీ ఒక చిన్నముద్రణాలయంలో 

“అవమానాల చరిత్ర” అనే పుస్తకం బైండ్ చేస్తూ ఉంటాడు. ‘తీవ్రవాదులతో 

సంబంధం ఉంది’ అనే ఆరోపణతో మరలా అతన్ని పోలీసులు 

పట్టుకుపోతారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధ చట్టం 1967, దాని 

సవరణ చట్టం యుఎపియే 2008 కిందా నేరారోపణ జరిగింది కనుక 

బెయిలు కూడా ఇవ్వవద్దని జడ్జీ సదావర్తే ఆదేశిస్తాడు. మర్నాటి నుండీ 

కోర్టుకు నెలరోజుల సెలవులు. మరో కేసు పాత తరహాలోనే 

మొదలవ్వబోతోందని ప్రేక్షకులకు అర్ధం ఔతుంది.

ఆ సెలవులను సదావర్తే విహారయాత్రలో గడుపుతూండగా సినిమా 

ముగుస్తుంది. ఆఖరి దృశ్యంలో సదావర్తే, ఈతలు కొట్టీ, ఆటలు ఆడీ, 

పాటలు పాడీ, ‘అలిసిపోయి’ పార్కులో బెంచీ మీద కునికిపాట్లు పడుతూ 

ఉంటాడు. పిల్లలు వచ్చి ఆట పట్టించేందుకు, అతని చెవి దగ్గర గట్టిగా 

అరుస్తారు. అతను తుళ్లిపడి లేచి చేతికి అందిన పిల్లవాడి చెంప 

పగలగొడతాడు.


వారి ఆనందాల్లో వారిని మునిగి తేలనీకుండా, ‘ఇబ్బంది’ కలిగిస్తున్న 

నారాయణ కాంబ్లీ వంటి ప్రజాకవుల పట్లా, ఉద్యమకారుల పట్లా - 

మధ్యతరగతి వర్గం చూపించే ‘అసహనా’నికి ఈ జడ్జీ చర్య ఒక ప్రతీకలా 

కన్పించింది. ఇదీ అని చెప్పేందుకు ఏమీ కనిపించనట్లుండే కథా, ఏ 

రకమైన నాటకీయతా లేని కథనం, డాక్యుమెంటరీ వంటి చిత్రీకరణ – ఈ 

కోర్టు సినీమా ప్రత్యేకతలు. నటించిన కళాకారులందరూ వారి పాత్రల 

అంతరంగాలను చక్కగా అర్ధం చేసుకున్నారన్న భావం కలిగింది.

ఉన్నది ఉన్నట్టూ చెప్పడమే తప్ప దర్శకుడి స్వరం ఎవరి పక్షమూ 

వహించదు. కానీ సంభాషణలూ, సంఘటనలూ వాటంతట అవే తమ 

అసంబద్ధతలనూ, వైషమ్యాలనూ బయట పెట్టుకునేట్టూ కథాసంవిధానం, 

దృశ్యాల రూపకల్పనా ఉంటుంది. ఉదాహరణకు కాంబ్లీ నేరానికి ఒక 

రుజువు- అశోక్ భగత్ అన్న నక్సలైట్ ఖైదీ జైలు నుండీ కాంబ్లీ కి రాసిన 

ఉత్తరం. జబ్బుతో ఉన్న తల్లిని కొంచెం కనిపెట్టి ఉండమని అశోక్ ఆ 

ఉత్తరంలో కాంబ్లీని కోరతాడు. “అది కోడ్ భాష, వీరందరూ కలిసి ఏదో ప్లాన్ 

చేస్తున్నారు, ఇంటెలిజెన్సుటీం వారు దానిలో రహస్యం కనిపెట్టి చెప్తారని 

ఎదురు చూస్తున్నాం” అని పోలీసు అధికారి కోర్టులో చెప్తాడు. అది 

వింటున్న మనకు నవ్వూ, ఏడుపూ ఒకేసారి వస్తాయి.

కళలను నియంత్రించే 

1876నాటి వలసపాలనా 

చట్టాలూ, పరమ 

శక్తివంతమైన యుఎపియే 

2008 చట్టాలూ - ప్రజల 

కార్యకలాపాలనే కాక, 

భావజాలాలను కూడా - 

ఎలా కట్టుదిట్టాలలోఉంచుతున్నాయో మనకు ఈ

శాంభాజీ భగత్ 


“చితిమంటల చిటపటలు 


‘కళ కావనీ, తనను 
కళాకారుడిననొద్దనీ” 


మొర పెట్టుకునే చివరి పాటతో 

సహా, కాంబ్లీ పాడే పాటలన్నీ - 

అత్యంత ప్రజాదరణ పొందిన లోక్ షాహిర్ 

(ప్రజాకవి) శాంభాజీ భగత్ 

రాసిన జానపద గేయాలే!

అవి ఈ ‘కోర్ట్’ అనే మరాఠీ చిత్రానికి ఒక సమగ్రతా, సాధికారత చేకూర్చాయి. 

డిఫెన్సు లాయరు వినయ్ వోరాగా నటించిన వివేక్ గోమ్బర్ ఈ చిత్రానికి 

నిర్మాత కూడా.
                            
కోర్టు అంటే నాలుగుగోడలున్న హాలుగా కాక న్యాయస్థానంగానే ఒక 

సామాన్యపౌరుడు కూడా అర్ధం చేసుకుంటాడు. నిందితుడూ, అభియోగీ, 

డిఫెన్సు లాయరూ, ప్రాసిక్యూటరూ, న్యాయమూర్తీ, పోలీసులూ, మృతుని 

కుటుంబసభ్యులూ, సాక్షులూ... ఇలా ఒక కేసుకు సంబంధించిన 

వారందరినీ, కోర్టు లోపలా కోర్టుకు బయటా చూపించడం ద్వారా కంటికి 

కనపడని న్యాయవ్యవస్థను మన ముందు ఆవిష్కరింప చేస్తారు చిత్ర 

దర్శకుడు, రచయితా ఐన చైతన్య తమానే.
చైతన్య తమానే 
పాత్రల జీవితశకలాలను, కేసుకు నేపధ్యంగా అందించడం వల్ల, ప్రేక్షకుల 

ఊహకూ, అన్వయ శక్తికీ పని కల్పించారనిపించింది.
                               

ప్రాసిక్యూటరు నూతన్ మధ్యతరగతికి చెందిన మహిళ. చిన్న పిల్లల్నీ, 

కుటుంబ బాధ్యతల్నీ సంబాళించుకుంటూ వృత్తిధర్మంగా మాత్రమే ఈ 

కేసును చూస్తుంది. నిందితుడికి వీలైనంత ఎక్కువ శిక్ష పడేట్టు చెయ్యడమే 

ఆమె లక్ష్యం. ఈ పాత్రను గీతాంజలి కులకర్ణి పోషించారు.

డిఫెన్సు లాయరు వినయ్ వోరా ధనిక వర్గానికి చెందిన వ్యక్తి. మానవ 

హక్కుల పట్ల నిబద్ధత కలిగి, ‘నినాద్’ అనే ఎన్జీవోను స్థాపించాడని 

తెలుస్తుంది. కానీ తాను ఏ పేదల పక్షాన ఉన్నాడో వారి భాషలోనూ, 

జీవితాలతోనూ అతనికి అంతగా ప్రవేశం ఉండదు. ఈ కేసులను వాదిస్తూ, 

అతను తన మానసిక ప్రపంచాన్ని విశాలం చేసుకుంటున్నట్టు 

కనిపిస్తుంది. 

పోలీసు అధికారి ఎంతో నమ్రతగా, మర్యాదగా మాట్లాడతాడు.

కానీ రూల్స్ పాటించడు. జడ్జీ సదావర్తే న్యూమరాలజీనీ, మెరిసే రంగు రాళ్ళ 

మహిమలనీ నమ్ముతాడు. ఆడక్లయింటు చేతుల్లేని చొక్కా తొడుక్కుని 

రావడం కోర్టు మర్యాదకు భంగం అని అతని ఉద్దేశం. ఈ జడ్జీ పాత్రధారి పేరు 

ప్రదీప్ జోషీ.


ఇలా ప్రతీ ఒక్కరూ సమాజంలోని వివిధ రకాల భావజాలాలకు లోనై 

ఉండడం కోర్టు కార్యకలాపాలను ఎలా ప్రభావితం చేస్తుందో, ‘న్యాయం’ ఎన్ని 

రంగులు మార్చుకుంటుందో ధ్వనిస్తూ, ఈ ‘కోర్టు’ మనలో ఎన్నో ప్రశ్నలను 

రేకెత్తిస్తుంది.

కాంబ్లీ వద్ద జప్తు చేసిన నలభై పుస్తకాలలో, రెండు ప్రభుత్వం నిషేధించినవి. 

ఒకటి 1899లో సంత్ కాశీనాథ్ రాసిన “గోయమార్ మానుస్” అనే 

రాతప్రతి.అది “గోయమారు”లనే ఆదివాసీల చరిత్రను చెబుతుంది. దానిని 

110 ఏళ్ల క్రితం నిషేధించారు. ఆ పుస్తకం ఆదివాసులలోని కొన్ని 

‘దురాచారాల’పై చేసిన సహేతుక విమర్శ అనీ, ఆ ఆచారాలు ఈనాటికీ 

హానికరమే, అవి తప్పని చెప్పడంలో ఏమి తప్పుందనీ - కోర్టులో వినయ్ 

ఒక చిన్నవ్యాఖ్య చేస్తాడు. ఆ వ్యాఖ్య కోర్టు బయటకు ఎలా పొక్కిందో, అతని 

ముఖం మీద ఇంకు పోసి అవమానించే విధంగా ఎలా పరిణమించిందో, 

దాని వెనక ఉన్న రాజకీయ కారణాలేవో ఆలోచించే పని ప్రేక్షకులకు 

వదిలిపెడతారు దర్శకుడు.

అలాటిదే మరో ఉదాహరణ వాసుదేవ్ దుర్మరణం. కాంబ్లీపై నింద నిజమో, 

కాదో నిరూపించేందుకే తప్ప ‘వాసుదేవ్ పవార్’ మృత్యువుకు ఏది 

కారణమో ఎవ్వరికీ పట్టదు. ప్రశ్నించే అగత్యం ఉన్న అతని భార్యకు అడిగే 

శక్తీ, ఆర్దిక వనరులూ, జ్ఞానమూ ఉండవు, పైగా అమితమైన భయం. ఈ 

షర్మిల పాత్రలో ఉషా బానే నటించారు.                                                                  
                                  


ప్రాంతీయవాదం, వ్యాపార సంస్కృతీ వంటి సమకాలీన ధోరణులను, అనేక 

కోణాల్లో జీవితపు వాస్తవాలను ఈ చిత్రం మనకు నిర్వికారంగా చూపిస్తుంది.
ఫిలిం ఫెస్టివల్ లో 'కోర్టు' చూసాక  దర్శకుడు చైతన్య తో ...
                 

No comments:

Post a Comment